
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అసమర్ధతను కప్పిపుచ్చుకోనేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకు రోజుకో విషయాన్ని అనుకున్న విధంగా రక్తి కట్టిస్తున్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయకున్నా, నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరుగుతున్నా ఒక్కసారైనా నోరు విప్పని అధికార తెలుగుదేశం ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నట్లు కలరింగ్ ఇస్తోంది. ఎప్పటిలాగే అనుకూల మీడియా ద్వారా లీకులిస్తూ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. పార్లమెంట్లో టీడీపీ ఎంపీల పోరాటం అంటూ భజన బ్యాచ్తో డబ్బులు కొట్టించుకొంటోంది.
ఇందులో భాగంగానే దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం తెలుగుదేశం ఎంపీలతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. అందరూ అనుకునే విధంగానే పార్లమెంట్లో విభజన చట్టంలోని హామీల అమలుకు గట్టిగా పోరాటాలంటూ ఊకదంపుడు కార్యక్రమం జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లడుతున్నప్పుడు ఏమాత్రం చప్పుడు చేయకుండా కూర్చున్న టీడీపీ ఎంపీలు, అదే తీరును ఉభయసభల్లో శుక్రవారం కూడా అదే తీరును అనుసరించాలంటూ తీర్మానించారు.
గురువారం లోక్సభలో అరుణ్ జైట్లీ ప్రసంగిస్తున్నప్పుడు టీడీపీ నేత, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి సభలో బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారు. ప్రకటన అద్భుతం అంటూ పరోక్షంగా చెప్పేశారు. టీడీపీ ఎంపీలు కూడా నోరుమెదపకుండా మౌనం దాల్చారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇది పసిగట్టిన టీడీపీ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment