
సాక్షి, విజయవాడ : విపరీతమైన రసాయనాల వాడకం వల్ల మనం తినే ఆహారం విషతుల్యం అవుతోందనీ, అందుకే మనం మళ్లీ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నామని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు. శనివారం స్థానిక సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సేవాభారతి వారి సంగమం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఎలాంటి ప్రతిఫలం లేకుండా, చాలా మంది ప్రముఖులు కలిసి సేవాభారతిని నడిపిస్తున్నారని అభినందించారు. మానవసేవే మాధవ సేవ అంటూ సేవాభారతి ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమైనవని వ్యాఖ్యానించారు.
దేశంలో కాలుష్య ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్, మానవాళి మనుగడకు మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఇటీవల ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో రసాయన సాగుకు, ప్రకృతి సాగుకు గల తేడాను అడిగానని కేవలం 20 శాతం దిగుబడిలో తేడా ఉందని రైతులు చెప్పారన్నారు. అయినా ఆరోగ్యవంతమైన ఉత్పత్తులు అందిస్తున్నామని సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి వక్కాణించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ శ్రీ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి, తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment