
సాక్షి, విజయవాడ తూర్పు : వాహన చోదకులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శివశంకర్ హెచ్చరించారు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే పలువురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం నగరంలోని పలు కూడళ్లల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు పాటించని వాహన చోదకులను అదుపులోకి తీసుకున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం 257 కేసులు నమోదు చేసి వారి వద్ద నుంచి రూ.1.05 లక్షలు అపరాధ రుసుం వసూలు చేశారు. వారి వాహనాలు సీజ్ చేశారు. అలాగే, తనిఖీల్లో పట్టుబడ్డ వారికి మంగళవారం బందరు రోడ్డులోని వ్యాస్ కాంప్లెక్స్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వలన కలిగే అనర్థాల గురించి షార్టు ఫిల్మ్లు ప్రదర్శించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివశంకర్ మాట్లాడుతూ వాహన చోదకులు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు.
లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు రోడ్డు ప్రమాదాల కేసులను తీవ్రమైనవిగా పరిగణించాలని సూచించిందని తెలిపారు. అందులో భాగంగా తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. వాహన చోదకులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. నగరంలో సగటున రోడ్డు ప్రమాదాలలో రోజుకు ఒకరు మృతి చెందుతున్నారని, వీరిలో టూ వీలర్ నడుపుతున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా గమ్యస్ధానాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రావి సురేష్రెడ్డి, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment