
పోలవరంలో ఎమ్మెల్యేల పర్యటనలతో ప్రయోజనం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.
సాక్షి, కాకినాడ: పోలవరంలో ఎమ్మెల్యేల పర్యటనలతో ప్రయోజనం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్ట్ సాధనకు అవసరమైన నిధులను కేంద్రంతో పోరాడైనా సాధించాలని వ్యాఖ్యానించారు. నిర్వాసితుల సమస్యను గాలికొదిలేశారని, విభజన చట్టంలోని హామీలను మరచిపోయారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రయోజనాల కోసం రాష్ట్ర అవసరాలను వదిలేస్తున్నారని విమర్శించారు.
ఈ నెల 20 న వామపక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి చలో అమరావతి కార్యక్రమం తలపెట్టినట్లు ఆయన చెప్పారు. టీడీపీ ప్రభుత్వం దగాకోరు రాజకీయాలు నడుపుతోందని, రైతుల్ని వంచిస్తూ విశాఖలో ఆధునిక వ్యవసాయం అంటూ ముఖ్యమంత్రి నాటకం ఆడుతున్నారన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరుగుతుంటే ఇలాంటి సదస్సులతో అవకాశవాద వైఖరి తగదని మధు హితవు పలికారు.