
'మహంతి పదవీకాలాన్ని పొడగించడం సరికాదు'
రాజమండ్రి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహంతి పదవీ కాలాన్ని పొడగించడం సరికాదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. రాజధాని ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్య విద్వేషాలను పెంచుతున్నారని విమర్శించారు. సీఎస్ గా మహంతి పదవీ కాలం పొడగించడం ఎంతమాత్రం సరైన విధానం కాదని సోమవారం రాజమండ్రి మీడియాతో మాట్లాడిన వెంకయ్య తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మహంతి పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మహంతి పదవీ కాలం పొడగించడంపై సీనియర్ ఐఏఎస్ అధికారి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఐ.వై.ఆర్. కృష్ణారావు మండిపడిన విషయం తెలిసిందే.
విభజన సమయంలో స్థానిక కేడర్లో సమర్థులున్నా గుర్తించలేదన్నారు. సమర్థులైన అధికారులు లేనప్పుడు, ప్రతిభావంతులైన అధికారులకు మాత్రమే పదవీ కాలం పొడిగింపు ఇవ్వాలనే నిబంధన ఉందని, ఆ నిబంధనను తుంగలో తొక్కారని విమర్శించారు.