
కోల్డ్ స్టోరేజీ నిర్మాణం జరిగేనా ?
- పాలకుల మౌనం
- గిలకలదిండి హార్బర్లో పెరుగుతున్న కష్టాలు
- వ్యాపారుల ఇష్టారాజ్యం
- ఐస్ప్లాంట్ నిర్మాణంలోనూ రాజకీయం
మచిలీపట్నం : గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారకం సమకూరుతోంది. అయినప్పటికీ ఇక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో బోట్ల యజమానులు, మత్స్యకారుల సమస్యలు రోజురోజూకూ పెరుగుతున్నాయి. సోనా బోట్లు, మరపడవల ద్వారా ద్వారా వేటాడి తెచ్చే అతి విలువైన ట్యూనా చేపలకు మార్కెట్లో ఒక్కోసారి సరైన ధర పలకదు. ఆశించిన ధర వచ్చే వరకు వాటిని భద్రపరిచేం దుకు ఇక్కడ కోల్డ్స్టోరేజీ లేదు.
దీంతో బోట్ల యజమానులు లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది. హార్బర్లో రెండేళ్ల కిందట ప్రారంభమైన ఐస్ప్లాంట్ నిర్మాణానికి రాజకీయరంగు పులుముకుంది. రూ.60 లక్షలతో దీని నిర్మాణానికి రెండేళ్ల కిందటే అనుమతులు వచ్చా యి. ఈ ప్లాంట్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. దీనికి ఎంపెడా నిధులు సమకూర్చగా, పోర్టు విభాగం ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి.
జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర ఈ నెల 24న గిలకలదిండి హార్బర్లో మత్స్యకారులతో సమావేశమయ్యా రు. ఐస్ప్లాంట్లో నెలరోజుల్లోపు ఉత్పత్తి ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా రెండు శాఖల అధికారులు చెప్పారు. అయినప్పటికీ ఐస్ప్లాంట్ నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి రవీంద్ర హామీ ఇవ్వటం చర్చనీయాంశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే దీని నిర్మాణం జరిగిందని చెప్పుకునేందుకు మంత్రితోపాటు ఆ పార్టీ నాయకులు యత్నించటం వివాదాస్పదమవుతోంది.
అంతా దోపిడీనే..
గిలకలదిండి ఫిషింగ్ హార్బర్లో మత్స్యసంపదను కొనుగోలు చేసే సందర్భాల్లో వ్యాపారుల హవా కొనసాగుతోం ది. నలుగురైదుగురు వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి వా టి ధరను ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ధర చెప్పకుండానే కొనుగోళ్లు..
సోనా, మరబోట్ల ద్వారా తీసుకువచ్చిన మత్స్యసంపద కు ముందుగా ధర చెప్పకుండానే వ్యాపారులు తూకం వేయిం చే ఆనవాయితీ ఇక్కడ కొనసాగుతోంది. ధర ఇంకా నిర్ణయం కాలేదని, అడ్వాన్స్గా కొంత సొమ్ము తీసుకువెళ్లాలని చెప్పి వ్యాపారులు తప్పించుకుంటుంటారు. కోల్డ్ స్టోరేజీ లేకపోవటంతో ధర తక్కువగా ఉన్నప్పటికీ అతి విలువైన టూనా, ఇతర రకాల చేపలను బోటు యజమానులు అమ్ముకోవాల్సిందే. వ్యాపారులు ధర నిర్ణయించకుండా అడ్వాన్స్లు ఇచ్చి, మత్స్య సంపదను కొంటున్నారు. దీంతో బోటు యజమానులు, మత్స్యకారులు నష్టపోతున్నారు.
ఇక్కడి హార్బర్లో కోల్డ్ స్టోరే జీ నిర్మించాలని బోటు యజమానులు, మత్స్యకారులు ఎన్నేళ్లుగానో కోరుతున్నారు. రూ.15 కోట్ల అంచనా వ్యయంతో కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి రెండేళ్ల క్రి తం అప్పటి ఎమ్మెల్యే పేర్ని నాని ప్రతిపాదన పంపారు. తరువాత రాజకీయ సమీకరణాలు మారటంతో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది.
మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కొల్లు రవీంద్ర మంత్రి అయ్యారు. గిలకలదిండి హార్బర్లో పరిస్థితులపై ఆయనకు అవగాహన ఉంది. ఈనెల 24న ఫిషిం గ్ హార్బర్లో మత్స్యకారులతో మంత్రి రవీంద్ర సమావేశమైనపుడు కోల్డ్ స్టోరేజీ గురిం చి ప్రస్తావించకపోవడంపై వారితోపాటు బోటు యజమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి భూమి అందుబాటులో ఉందని.. గతంలో చేసిన ప్రతిపాదన ఆమోదింపజేస్తే ఉపయోగపడుతుందని వారు అంటున్నారు.