
భూమా నాగిరెడ్డి అరెస్టు
రెండు హత్యాయత్నం.. ఒక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
సాక్షి, కర్నూలు: నాటకీయ పరిణామాల మధ్య నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల పురపాలక సంఘం సమావేశం సందర్భంగా ప్రజా సమస్యలపై తన ప్రసంగాన్ని వినాల్సిందేనని.. డోర్ వేయమని భూమా సైగ చేసినందువల్లే టీడీపీ కౌన్సిలర్లపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు శుక్రవారం దాడులకు పాల్పడ్డారని పేర్కొంటూ భూమాపై మూడు కేసులు నమోదు చేశారు. శనివారం రాత్రి 7.15 గంటల ప్రాంతంలో ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్ ఎదుట భూమా నాగిరెడ్డిని పోలీసులు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్కు ఆదేశించారు.
వివరాలివీ..
శుక్రవారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ కౌన్సిలర్లు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులు భూమా ప్రోత్సాహంతోనే జరిగాయని పేర్కొంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వారు భూమాను అరెస్టు చేసేందుకు ప్రయత్నించడం.. రాత్రి ఆయన ఇంటిని తనిఖీ చేయడం జరిగాయి. భూమా ఇంట్లో లేకపోవడంతో.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని, లొంగిపోవాలంటూ ఎస్పీ హెచ్చరించారు.
శనివారం ఉదయం భూమా నాగిరెడ్డి స్వయంగా ఎస్పీ వద్దకు వస్తున్నారని తెలియడంతో పట్టణమంతా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసి పోరుుంది. ఇదే సమయంలో శనివారం కర్నూలులో జరగాల్సిన జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని రద్దుచేసుకుని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, గౌరు చరితారెడ్డి, గుమ్మనూరు జయరాం, మణిగాంధీ, భూమా అఖిలప్రియ, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిలు మధ్యాహ్నం నంద్యాలలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకున్నారు. అక్కడే ఉన్న నాగిరెడ్డితో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాలం బాబు నేతృత్వంలో విద్యార్థులు నంద్యాలకు తరలివచ్చారు. వారితో కలిసి నాగిరెడ్డి అక్కడి నుంచి బయలుదేరి 1.35 గంటలకు డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవికృష్ణతో సమావేశమయ్యారు.
మీరు సైగ చేయడం వల్లే దాడులు: ఎస్పీ
శుక్రవారం జరిగిన సంఘటనలకు మీరు బాధ్యత వహించాల్సిందేనంటూ.. తలుపులు మూయమని వైఎస్సార్ సీపీ శ్రేణులకు మీరు చెప్పడం వల్లే దాడులు జరిగాయని, ఫ్యాక్షన్ను ప్రోత్సహించేలా మీ ప్రవర్తన ఉందంటూ ఎస్పీ రవికృష్ణ వాదించారు. దీన్ని ఎమ్మెల్యే నాగిరెడ్డి ఖండించారు. టీడీపీ కౌన్సిలర్లే తమ దాడులకు పాల్పడ్డారని చెప్పారు.
నిష్పక్షపాతంగా వ్యహరించాలని, రెండు వైపులా సమగ్ర విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఎస్పీని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కోరారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారించిన ఎస్పీ ఎట్టకేలకు నాగిరెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేశామని, అదేవిధంగా కులం పేరుతో దూషించారనే కారణంగా నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉందని తెలిపారు.
మెడికేర్కు భూమా
నంద్యాల టౌన్: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని జడ్జి ఆదేశాల మేరకు శనివారం రాత్రి పోలీసులు స్థానిక మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. భూమా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని. గుండె దడ కూడా ఉందని డాక్టర్ డేవిడ్రాజ్ నేతృత్వంలోని వైద్య బృందం నివేదిక అందజేసింది. అనంతరం, పోలీసులు ఆయనను జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్ ఎదుట హాజరు పరిచారు. వైద్య పరీక్షలను పరిశీలించిన అనంతరం భూమాకు ఈ నెల 16 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మెడికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి అనుమతించారు.
తప్పుడు కేసులు బనారుుంచారు: భూమా
‘నా మీద ఈ రోజు 3 కేసులు బనాయించారు. మేం ఎంత చెప్పినా కూడా అన్ని విధాలా ఆలోచించే కేసులు పెట్టామని పోలీసులు అంటున్నారు. నన్ను, వైఎస్సార్ సీపీని ఇబ్బందులు పెట్టేందుకే కేసులు పెట్టారు. మానసికంగా ఒత్తిడికి గురి చేసేందుకే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. కేసులు పెట్టినా బాధపడేది లేదు. ప్రజా సంక్షేమానికి ఏ శిక్షకైనా సిద్ధమే’ అని నాగిరెడ్డి అన్నారు. ఎస్పీని కలిసిన అనంతరం మీడియా తో మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు.