Bhuma Nagi Reddy
-
మా నాన్నను వేధిస్తున్నారు
-
మా నాన్నను వేధిస్తున్నారు
టీడీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గతంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: తన తండ్రి భూమా నాగిరెడ్డిని టీడీపీ ప్రభుత్వం వేధిస్తోందంటూ గతంలో పలుమార్లు అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే.. 2014 నవంబర్ 6న.. ‘‘మా నాన్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాష్ట్రప్రభుత్వం పదేపదే వేధిస్తోంది. రెండు రోజుల్లోనే నాన్నపై మూడు తప్పుడు కేసులు పెట్టారు. రౌడీషీట్ ఓపెన్ చేశారు. రెండు గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటకు నాన్న గారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు. భూమా నాగిరెడ్డి గారి మీద ఇంతకు ముందు కేసులు లేవు. ఇప్పుడు ఒక్క సంఘటనలో మూడు కేసులు పెట్టి రౌడీషీట్ ఓపెన్ చేశారు. అమ్మ పోయిన షాక్లో నుంచి మేమింకా బయటకు కూడా రాలేదు. ఆయన్ని మెంటల్గా ఇంకా వీక్ చేయాలని కేసులు పెడుతున్నారేమో.. మీరు ఆయన్ని ఎంతైతే వెనక్కి లాగాలని చూస్తారో ఆయన అంతకు వెయ్యి రెట్లు ఎక్కువ బలపడతారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి గారు ఓపెన్గా మీడియాకు చెబుతున్నారు. నంద్యాలకు బై ఎలక్షన్స్ వస్తాయి. భూమా నాగిరెడ్డిపై కేసులు ఎలా పెట్టాలో మాకు, మా నాయకుని(సీఎం చంద్రబాబు)కి తెలుసు. అంత ఓపెన్గా వాళ్లు నంద్యాలకు బై ఎలక్షన్స్ వస్తాయని ఏ ఉద్దేశంతో అంటున్నారో నాకు తెలియడం లేదు. దాని వెనుక చంద్రబాబు సపోర్టు కూడా ఉందని ఓపెన్గా మీడియాకే చెబుతున్నారు. నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా.. భూమా నాగిరెడ్డి గారికి గానీ, నా కుటుంబానికి గానీ ఏమైనా జరిగితే దానికి బాధ్యత చంద్రబాబే అవుతారు. ఎందుకంటే ఆయన సపోర్ట్ లేకుండా వీళ్లు ఇంత ఓపెన్గా బైఎలక్షన్స్ వస్తాయి. కేసులు పెడతాం అని అనరు.. 2015 జూలై 4న... ‘‘బైపాస్ సర్జరీ చేయించుకున్న నాన్నకు మధుమేహం, రక్తపోటు ఉంది. అలాంటి వ్యక్తిని హైదరాబాద్లోని ‘నిమ్స్’కు తరలించడాన్ని కూడా వివాదాస్పదం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ముగ్గురు డాక్టర్ల బృందాన్ని ఆళ్లగడ్డ సబ్జైలుకు పంపి, వారి నివేదిక ప్రకారమే నిర్ణయం తీసుకుంటామనడం సరికాదు. ఆ బృందంలో హృద్రోగ నిపుణులు లేరు. మమ్మల్ని వేధిస్తున్న ఈ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. ఓటుకు కోట్ల వ్యవహారంలో ప్రమేయమున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు వెన్నునొప్పి ఉందనే కారణంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. నాన్నకు హృద్రోగం, మధుమేహం, రక్తపోటు ఉన్నా నిమ్స్కు తరలించడానికి అభ్యంతరం ఏమిటి? ఒక పధకం ప్రకారం నాన్నను ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులో ఇరికించారు..’’ -
కేసులు.. వేధింపులు.. అవమానాలు
► భూమా నాగిరెడ్డిని మొదట్నుంచీ వేధించింది తెలుగుదేశం పార్టీయే.. ► ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, రౌడీషీట్ ► పార్టీ మారేలా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ► పార్టీ మారాక మంత్రి పదవి ఇవ్వకుండా అవమానాలు ► ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థిని గెలిపించాలని సీఎం హుకుం ► మానసిక క్షోభకు గురై తుదిశ్వాస విడిచిన భూమా నాగిరెడ్డి సాక్షి ప్రతినిధి, కర్నూలు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మొదటి నుంచీ వేధించింది ఎవరు? ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు ఏకంగా రౌడీషీట్ తెరిచింది ఎవరు? ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం చేయించుకునేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నది ఎవరు? కేసులు పెట్టి, వేధింపులకు గురిచేసి పార్టీ మారేలా ఒత్తిడి తెచ్చింది ఎవరు? తీరా పార్టీ మారిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకుండా అవమానాలకు గురిచేసింది ఎవరు? పైగా ఎమ్మెల్నీ ఎన్నికల్లో చిరకాల రాజకీయ ప్రత్యర్థి శిల్పా గెలుపు కోసం పని చేయాలంటూ ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ విజయవాడకు పిలిపించి మరీ ఒత్తిడి పెంచింది ఎవరు? అనే అంతులేని ప్రశ్నలకు అటు ఆళ్లగడ్డతోపాటు ఇటు నంద్యాలలోని ఆయన అనుచరుల నుంచి వస్తున్న ఒకేఒక్క సమాధానం... చంద్రబాబు నాయుడు. భూమా నాగిరెడ్డి ఒక రౌడీ సర్ 2014 ఎన్నికల్లో వెఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డిని తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. అవకాశం దొరికినప్పుడల్లా ఆయనపై కేసులు నమోదు చేయించింది. మున్సిపాలిటీలో జరిగిన గొడవలను కారణంగా చూపి 2014 అక్టోబరు 31న ఆయనపై ఒకేసారి ఏకంగా మూడు కేసులను నమోదు చేశారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 2015లో డీఎస్పీతో వాగ్వావాదానికి దిగారనే నెపంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను వైద్యం కోసం హైదరాబాద్కు తరలించకుండా ప్రభుత్వం అడ్డుకుంది. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లోనూ ఇరికిస్తామని ప్రభుత్వం ఆయనను బెదిరింపులకు గురిచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ‘‘భూమా నాగిరెడ్డి ఒక రౌడీ సర్’’ అంటూ అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్విప్ కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. కూరలో కరివేపాకు తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబాన్ని అవసరం ఉన్నప్పుడు వాడుకుని, అవసరం తీరాక పక్కనపెట్టడం పరిపాటిగా మారింది. భూమా కుటుంబానికి ఎన్నడూ మంత్రి పదవి ఇచ్చి గౌరవించలేదు. భూమా కుటుంబాన్ని టీడీపీ నాయకత్వం కూరలో కరివేపాకులా వాడుకుంటూ వదిలేసిందనే అభిప్రాయం ఇప్పటికీ ఆయన అనుచరుల్లో ఉంది. చిన్నకర్మ కాకుండానే అసెంబ్లీకి అఖిలప్రియ భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత అసెంబ్లీలో సంతాప తీర్మానం సందర్భంగా ఆయన కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియను అసెంబ్లీకి రావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. దీంతో కనీసం చిన్నకర్మ కూడా కాకుండానే ఆమె అసెంబ్లీకి వచ్చారు. అయితే, తాము ఆమెను అసెంబ్లీకి రావాలని పిలవలేదని స్వయంగా సీఎం చంద్రబాబు పేర్కొనడాన్ని టీడీపీ కార్యకర్తలే ఖండిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక భూమా నాగిరెడ్డిపై నమోదైన కేసులు కేసు 1 224/2014, టూటౌన్ పోలీస్ స్టేషన్, నంద్యాల తేదీ: 31–10–2014 ఫిర్యాది: దేశం సులోచన, మున్సిపల్ చైర్పర్సన్ నిందితులు: భూమా నాగిరెడ్డి, కౌన్సిలర్లు సెక్షన్లు: 147, 148, 324, నేపథ్యం: మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎమ్మెల్యే భూమా రోడ్ల విస్తరణ గురించి మాట్లాడటం ప్రారంభించగా, సమావేశం ముగిసిందని చైర్పర్సన్ బెల్ కొట్టారు. తాను ఇంకా మాట్లాడాలని భూమా పట్టుబట్టారు. ఆయ నపై చైర్పర్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు 2 225/2014 నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్ తేదీ: 31–10–2014 ఫిర్యాది: వైస్చైర్మన్ గంగిశెట్టి విజయ్కుమార్, టీడీపీ ఇన్చార్జి శిల్పా మోహన్రెడ్డి అనుచరుడు నిందితులు: భూమా నాగిరెడ్డి, మరికొందరు కౌన్సిలర్లు సెక్షన్లు: 147, 148, 324, 506, 307, 120బీ, 109 రెడ్విత్34 ఐపీసీ. నేపథ్యం: వైస్ చైర్మన్ గంగిశెట్టివిజయ్కుమార్పై జరిగిన హత్యాయత్నం కేసు 3 226/2014, నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్ తేదీ: 31–10–2014 ఫిర్యాది: అనిల్ అమృతరాజ్, టీడీపీ ఇన్చార్జి శిల్పామోహన్రెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్ నిందితులు: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, కౌన్సిలర్లు సెక్షన్లు: 147, 148, 324, 506, రెడ్విత్ 149 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నేపథ్యం: మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే భూమా తనను కులం పేరిట దూషించారని ఎస్సీ వర్గానికి చెందిన కౌన్సిలర్ ఫిర్యాదు చేశారు. కేసు 4 132/2015 నంద్యాల త్రీటౌన్ పోలీస్ స్టేషన్ తేదీ: 03–07–2015 ఫిర్యాది: దేవదానం, డీఎస్పీ నిందితులు: భూమా నాగిరెడ్డి సెక్షన్లు: 353, 188, 506, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నేపథ్యం: ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే భూమా డీఎస్పీ దేవదానం విధి నిర్వహణకు అడ్డుతగిలి, కులం పేరిట దూషించినట్లు నమోదైన కేసు ఆ రోజు ఏం జరిగింది? అనారోగ్య కారణాలతో గత నాలుగు రోజులుగా హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో భూమా చికిత్స పొందుతున్నారు. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పాకు భూమా సహకరిస్తాడో లేదో అనే అనుమానంతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో వచ్చి, తనను కలవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన అప్పటికప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి, విమానంలో విజయవాడకు వెళ్లి సీఎంను కలిసినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో సమావేశం సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి సహకరిస్తామని భూమాతోపాటు వచ్చిన నేతలు తెలిపారు. తమ నేత భూమాకు మంత్రి పదవి ఇవ్వాలని నంద్యాల కౌన్సిలర్లు ఈ సమావేశంలో సీఎంను కోరినట్లు సమాచారం. అయితే, ‘ఏయ్... నాకు తెలుసు మీరు ఉండండి’ అంటూ చంద్రబాబు గద్దించారనే వాదన వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఏ ఎమ్మెల్యేనూ పిలవకుండా, కేవలం తనను మాత్రమే పిలవడంపై కూడా భూమా మానసిక క్షోభకు గురై, గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. -
అసెంబ్లీ సాక్షిగా టీడీపీ శవ రాజకీయం
-
వారికి పదవులు ఇవ్వండని చెప్పాలా?
⇒ బాబు వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం ⇒ ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని ధ్వజం సాక్షి, అమరావతి: భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి విషయంలో సీఎం చంద్రబాబు వైఎస్సార్ సీపీపై నిందలు వేయడం కంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. భూమాకు మంత్రి పదవి ఇవ్వొద్దంటూ వైఎస్సార్సీపీ గవర్నర్కు ఫిర్యాదు చేసిందని సీఎం చంద్రబాబు మంగళవారం వ్యాఖ్యానించారు. విజయవాడ లోని ఆర్అండ్బీ అతిథిగృహంలో జరిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు వ్యాఖ్యలపై జగన్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? మన పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వొద్దని చెప్పకుండా ఇంకేం చెబుతాం? తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు చంద్రబాబు యాగీ చేసిన విషయం మరిచారా? శాసనసభలో భూమా సంతాప తీర్మానంపై మాట్లాడేటపుడు చంద్రబాబు గానీ, మరొకరు గానీ నాగిరెడ్డి ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనో ఎందుకు చెప్పలేక పోయారు? నాగిరెడ్డి ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనే విషయమే ప్రస్తావించలేక పోయారంటే వారి నైతికత ఏపాటిదో అర్థమవుతోంది. చంద్రబాబు తాను తప్పు చేసిందే కాకుండా ఎదుటి వారిని తప్పుపట్టడం ‘దొంగే... దొంగా దొంగా’ అని అరచినట్లుగా ఉంది’’ అని జగన్ పేర్కొన్నారు. -
భూమా నాగిరెడ్డికి శాసనసభ నివాళి
⇒ సభలో సంతాప తీర్మానం ⇒ తల్లిదండ్రులు చూపిన బాటలో పయనిస్తా: అఖిల ప్రియ సాక్షి, అమరావతి: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి శాసనసభ మంగళవారం నివాళులు అర్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సభ ఆమోదించింది. నాగిరెడ్డి మృతికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించిన అనంతరం శాసనసభ బుధవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభమవుతూనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు విజ్ఞప్తి మేరకు చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ భూమా జీవిత విశేషాలను వివరించారు. చనిపోవడానికి 24 గంటల ముందు భూమా తనను విజయవాడలో కలిశారని, నియోజకవర్గ సమస్యలపై చర్చించారని, ఆయన మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. నాగిరెడ్డి గుండె ధైర్యం, అంకిత భావం కలిగిన నాయకుడని కొనియాడారు. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే తల్లి, తండ్రిని కోల్పోయిన ఎమ్మెల్యే అఖిల ప్రియ, ఆమె చెల్లెలు, తమ్ముడికి అండగా ఉంటామని, కన్నతండ్రిలాగా ఆదుకుంటామని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు వెలుగోడు రిజర్వాయర్ నుంచి నంద్యాలకు నీటిని తరలించే పైప్లైన్ ప్రాజెక్టుకు భూమా నాగిరెడ్డి పేరు పెట్టడానికి అభ్యంతరమేమీ లేదని తెలిపారు. వ్యక్తులు వేరు, రాజకీయాలు వేరంటూ శివారెడ్డి, పరిటాల రవి హత్యోదంతాలను చంద్రబాబు ప్రస్తావిం చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు తాము సహకరించామని అన్నారు. డాక్టర్లు వారించినా విజయవాడ వచ్చారు తన తల్లిదండ్రులు చూపిన బాటలో పయనిస్తానని, వారి ఆశయ సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని భూమా దంపతుల కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ చెప్పారు. తన తండ్రి నాగిరెడ్డి ఆసుపత్రిలో బెడ్పై ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారని తెలిపారు. ప్రయాణం చేయవద్దని డాక్టర్లు వారించినా విజయవాడకు వచ్చి సీఎం చంద్రబాబును కలసి వెళ్లారన్నారు. తనకు మార్గదర్శకుడు తన తండ్రేనని, తన తల్లి చనిపోయిన పడక మీదనే తండ్రి కూడా మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా బడుగువర్గాల కాలనీకి, రహదారి విస్తరణకు, నంద్యాల పైప్లైన్కు ఆయన పేరు పెట్టాలని కోరారు. బాధను కసిగా మార్చుకుని పని చేస్తానన్నారు. భూమా కుటుంబంతో తనకు 25 ఏళ్లుగా పరిచయం ఉందని స్పీకర్ కోడెల చెప్పారు. -
భూమాకు తుది వీడ్కోలు
⇒ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ⇒ భౌతిక కాయానికి నివాళులర్పించిన నేతలు ⇒ కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ⇒ అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తల నినాదాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సోమవారం ఆళ్లగడ్డలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వ హించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయ కులు, వేలాదిమంది అభిమానుల మధ్య భూమా అంతిమయాత్ర సాగింది. ఆళ్లగడ్డ లోని శోభానాగిరెడ్డి ఘాట్ వద్దనే భూమా అంత్యక్రియలను ఆయన కుమారుడు జగత్ విఖ్యాత్రెడ్డి నిర్వహించారు. ఆదివారం ఉద యం భూమా గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. సాయంత్రం నాలుగు గంటల సమయంలో భారీ జన సందోహం మధ్య భూమా పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి వైపీపీఎం కళాశాల, పాత బస్టాండు మీదుగా శోభాఘాట్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడే అంత్యక్రియలను అధికార లాంఛనా లతో పూర్తి చేశారు. ప్రత్యేక పోలీసులు గౌరవ వందనం సమర్పించి సంతాపసూచకంగా గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం జగత్విఖ్యాత్రెడ్డి తన తండ్రి చితికి నిప్పంటించారు. భూమా కుమార్తెలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ, నాగ మౌనిక, కుటుంబసభ్యుల రోద నలతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. భూమా కుటుంబానికి సీఎం భరోసా భూమా కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుటుంబ సభ్యులతో కాసేపు ఏకాంతంగా చర్చించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయే సమయానికి 24 గంటల ముందు భూమా విజయవాడలో తనను కలిశారని.. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల అభివృద్ధి గురించి చర్చించారని తెలిపారు. అఖిలప్రియ ద్వారా ఆయన ఆశయాలను నెరవేరుస్తామని ప్రకటించారు. సీఎం మాట్లాడుతున్నప్పుడు కొందరు కార్యకర్తలు అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అయితే సీఎం స్పందించలేదు. నేతల నివాళి భూమా భౌతిక కాయానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, శాసనమండలి చైర్మన్ చక్ర పాణి యాదవ్, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుతో పాటు డిప్యూటీ సీఎంలు కె.ఇ.కృష్ణ మూర్తి, చిన్నరాజప్ప, మంత్రులు అచ్చెన్నా యుడు, పరిటాల సునీత, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎంపీ జె.సి.దివా కర్రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఐజ య్య, సాయిప్రసాద్రెడ్డి, బాలనాగిరెడ్డి, ఆది మూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, రాజ గోపాల్రెడ్డిలు భూమాకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
ముగిసిన భూమా అంత్యక్రియలు
-
భూమా నాగిరెడ్డి కన్నుమూత
- గుండెపోటుతో కుప్పకూలిన నంద్యాల ఎమ్మెల్యే సాక్షి ప్రతినిధి, కర్నూలు/ నంద్యాల: కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి (54)ఆదివారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం ఆళ్లగడ్డ నివాసంలో అల్పాహారం తీసుకున్న భూమా 8.30 గంటల సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనను కాపాడటానికి వైద్యులు రెండు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయం అమరావతిలో ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో నంద్యాల, ఆళ్లగడ్డ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో కలసి భూమా పాల్గొన్నారు. భూమాకు మంత్రి పదవి అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్టు, ఈ సందర్భంగా వాదోపవాదాలు చోటు చేసుకున్నట్టు తెలిసింది. అనంతరం అమరావతి నుంచి బయలుదేరి రాత్రి ఏడు గంటల సమయంలో ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో మరోమారు భేటీ అయ్యారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్న భూమా ఆదివారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు, కార్యకర్తలు వెంటనే స్థానిక డాక్టర్ రామలింగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 9.30 గంటల సమయంలో నంద్యాలలోని సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ రవికృష్ణ సారథ్యంలో క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ హరినాథరెడ్డి, డాక్టర్ మధుసూదనరావు, కర్నూలు నుంచి వచ్చిన కార్డియాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ అలీలు సుమారు రెండు గంటల పాటు భూమాను కాపాడేందుకు ప్రయత్నించారు. ఒకానొక సమయంలో ఆయన్ను హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు తరలించి వైద్యం అందించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. భూమా ఆరోగ్య పరిస్థితిపై చాలాసేపటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు భూమా మరణించినట్లు 11.30 గంటల సమయంలో వైద్యులతో కలసి భూమా బావమరిది, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ప్రకటించారు. గుండె ఆగిపోవడంతో... గుండె పనిచేయడం ఆగిపోవడంతో (కార్డియాక్ అరెస్ట్) భూమా నాగిరెడ్డి మరణించారని డాక్టర్ హరినాథరెడ్డి తెలిపారు. భూమా హార్ట్బీట్ తీవ్రస్థాయిలో 250కి పైగా చేరిందని, బీపీ కూడా ఎక్కువై మెదడుకు రక్తప్రసారం నిలిచిపోయిందని చెప్పారు. దీని వల్ల ఆయనకు ఫిట్స్ వచ్చాయని, ఊపిరితిత్తులకు ట్యూబ్ ద్వారా ఆక్సిజన్ను పంపే ఏర్పాటుచేసి కొన ఊపిరితో తీసుకువచ్చారని తెలిపారు. వెంటనే వెంటిలేటర్పై పెట్టి ఇంజక్షన్లు వేసి తీవ్రంగా ప్రయత్నించినా భూమా గుండె స్పందించలేదని, దీంతో ఆయన మృతి చెందినట్లు నిర్ధారించామని తెలిపారు. ప్రముఖుల సంతాపం.. నివాళులు భూమా హఠాన్మరణంపై ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కె.చంద్రశేఖర్రావు, చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కె. హరిబాబు, వామపక్ష పార్టీల నేతలు కె. నారాయణ, కె. రామకృష్ణ, పి. మధు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, రాజగోపాల్రెడ్డి తదితరులు భూమా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సోమవారం జరిగే అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దుఃఖసాగరంలో కుటుంబసభ్యులు భూమా మరణించారని తెలియగానే ఆయన కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. భూమాను చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు ఆస్పత్రికి తరలివచ్చారు. భూమా భౌతికకాయాన్ని నంద్యాల పార్టీ కార్యాలయంలో కొద్దిసేపు ఉంచిన తర్వాత ఆళ్లగడ్డకు తరలించారు. సోమవారం ఆళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఎస్వీ మోహన్రెడ్డి తెలిపారు. భూమా నేత్రాలను హైదరాబాద్లోని ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. నాగిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు అఖిలప్రియ (ఆళ్లగడ్డ ఎమ్మెల్యే), మౌనిక, కుమారుడు జగత్ విఖ్యాత్రెడ్డి ఉన్నారు. భార్య శోభా నాగిరెడ్డి మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. మూడుసార్లు ఎంపీ.. మూడుసార్లు ఎమ్మెల్యే భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు 1964 జనవరి 8వ తేదీన భూమా జన్మించారు. బెంగళూరులో హోమియో వైద్యం చదువుతూ మధ్యలో ఆపేసి రాజకీయరంగ ప్రవేశం చేశారు. ముప్పై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. మూడుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. చివరిసారిగా 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూమా ఏడాది క్రితం కుమార్తెతో కలసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. భూమా మరణ వార్త తెలియగానే ఆయన కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియకు జగన్ ఫోన్ చేశారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ఫోన్లో అఖిలప్రియను పరామర్శించారు. -
‘తండ్రిలా అఖిలప్రియకు అండగా ఉంటా’
-భూమా హఠాన్మరణంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి అమరావతి : నంద్యాల శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కర్నూలు జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఎప్పటికప్పుడు తెలుసుకున్నానని, ఇంతలోనే విషాద వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదని ముఖ్యమంత్రి అన్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉందని అన్నారు. భూమా మృతి వ్యక్తిగతంగా తనకు, తెలుగుదేశం పార్టీకి, కర్నూలు జిల్లా ప్రజలకు తీరని లోటని అన్నారు. భూమా కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు భూమా ఎనలేని కృషి చేశారని, కొద్ది రోజుల క్రితమే జిల్లా నాయకులతో వచ్చి తనను కలసి మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. భూమా కుమార్తె ఎమ్మెల్యే అఖిలప్రియకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. తండ్రి స్థానంలో తానుంటానని, అన్ని విధాలా అండగా ఉంటానని చంద్రబాబు ధైర్యం చెప్పారు. భూమా నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. -
భూమా నాగిరెడ్డి కన్నుమూత
-
భూమా నాగిరెడ్డికి తీవ్ర అస్వస్థత
-
భూమా నాగిరెడ్డికి తీవ్ర అస్వస్థత
కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆళ్లగడ్డలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నంద్యాల ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు వచ్చిందని నాగిరెడ్డి అనుచరులు చెబుతున్నారు. స్మృహలేని స్థితిలో ఆయనను ఆస్పత్రికి తరలించారు. నాగిరెడ్డి అస్వస్థకు గురయ్యారన్న వార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నంద్యాల ఆస్పత్రి వద్దకు భారీ ఎత్తున జనం తరలివస్తున్నారు. నిన్ననే సీఎం చంద్రబాబుతో నాగిరెడ్డి భేటీ అయ్యారు. తన మద్దతుదారులతో కలిసి చంద్రబాబును కలిశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, శిల్పా సోదరులతో విభేదాలు, మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రితో చర్చించారు. నాగిరెడ్డి అనారోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఆయనను తరలించేందుకు అవసరమైతే హెలికాప్టర్ వాడాలని ఆదేశించారు. మరోవైపు అహొబిలంలో ఉన్న నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ హుటాహుటిన నంద్యాలకు బయలుదేరారు. -
కొత్త చిచ్చు!
మంత్రి పదవి ఆశల చుట్టూ రాజకీయం - భూమా వైపు మొగ్గితే తాముండబోమంటున్న శిల్పా? - సీఎం వద్ద పంచాయితీకి నిర్ణయం - ఎన్నికలు వస్తే స్వతంత్రంగానైనా పోటీకి సిద్ధం - భూమాను ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతామని స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘ఎన్నికల ముందు నుంచీ పార్టీలో ఉన్నాం. మమ్మల్ని పట్టించుకోకుండా కొత్తగా వచ్చిన వారికి పదవులు అప్పగిస్తే పార్టీకే నష్టం. ప్రధానంగా భూమా నాగిరెడ్డికి ఏకంగా మంత్రి పదవి ఇస్తామంటే ఒప్పుకోం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో మేం ఎలా కొనసాగగలం. మంత్రి పదవి కావాలంటే ఎమ్మెల్యేకు రాజీనామా చేయాల్సిందే. అదే జరిగితే భూమాకు వ్యతిరేకంగా మేం ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తాం. సహకరించే అవకాశమే లేదు. ఇదే విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి విన్నవించాలని భావిస్తున్నాం.’’ ఇవీ తన ప్రధాన అనుచరులతో శిల్పా బ్రదర్స్ చెబుతున్న మాటలు. ఈ నేపథ్యంలో మరోసారి నంద్యాల రాజకీయం రసకందాయంలో పడబోతుందని అర్థమవుతోంది. తెలంగాణలో జరిగిన మంత్రి తలసాని ఎపిసోడ్తో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కొత్తగా ఎవ్వరికీ మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదనేది శిల్పా వర్గీయుల భావనగా ఉంది. ఎన్నికలు తప్పవని.. ఇదే జరిగితే తాము స్వతంత్రంగా పోటీ చేసి సత్తా చాటుతామని కూడా వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఇదీ ఇప్పుడు అధికార పార్టీలో మరింత కాక పుట్టిస్తోంది. ఎన్నికలొస్తే.. వాస్తవానికి తెలంగాణలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే తలసానికి మంత్రి పదవి అప్పగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు వెళ్లాయనే ప్రచారం ఉంది. దీంతో గవర్నర్కు కేంద్ర హోంశాఖ లేఖ పంపిందని కూడా తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రి పదవులు లభించే అవకాశం లేదని స్వయంగా అధికార పార్టీ నేతలే పేర్కొంటున్నారు. భూమాకు మంత్రి పదవి రావాలంటే కచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో నంద్యాల అసెంబ్లీలో ఉప ఎన్నికలు తథ్యమని కూడా అధికార పార్టీలో వాదన ఉంది. ఒకవేళ భూమాకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించి.. ఉప ఎన్నికలకు సిద్ధపడితే తమ నేత కూడా బరిలో ఉంటారని శిల్పా వర్గీయులు పేర్కొంటున్నారు. పోటీలో తమ నేత గెలిచినా, గెలవకపోయినా భూమాను మాత్రం కచ్చితంగా ఓడిస్తామని స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని స్పష్టంగా అధినేతకు వివరించిన తర్వాతే తమ నిర్ణయం ఉంటుందని వక్కాణిస్తున్నారు. కాగా.. ఎన్నికలు వచ్చి ఓడిపోతే పార్టీ పరువు బజారున పడుతుందని అధికార పార్టీలో అలజడి రేగుతోంది. ఇదిలాఉంటే తమ నేతకు మాత్రం కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని భూమా వర్గీయులు ధీమాగా ఉన్నారు. ఆదీ నుంచి సమన్వయలేమి..! ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవనే సామెతకు అనుగుణంగా.. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, కోడుమూరు, కర్నూలు, శ్రీశైలం నియోజకవర్గాల్లో ఇదే జరుగుతోందనే వాదన అధికారపార్టీలో వినిపిస్తోంది. పైకి ఎంత బహిరంగంగా విమర్శలు చేసుకోకపోయినప్పటికీ లోలోపల మాత్రం పాత నేతలు కొత్త నేతల రాకపై మండిపడుతున్నారు. పైగా తమ అధినేత కూడా కొత్తగా వచ్చిన వారికే పట్టం కడుతున్నారని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పాత నేతలంతా కలిసి తమ స్థానానికి కన్నం పెట్టే ప్రయత్నాలు పార్టీ నుంచే జరిగితే సహించేది లేదని తేల్చి చెప్పాలని నిర్ణయించుకున్నారు. తమకంటూ ఒక అసెంబ్లీ నియోజకవర్గం లేకపోతే.. తమకు విలువ ఏముంటుందని మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాత నేతలంతా కలిసి అధినేతను కలవాలనే చర్చ కూడా సాగుతున్నట్టు సమాచారం. మొత్తం మీద మంత్రి పదవి వ్యవహారం కాస్తా అధికార పార్టీలో అగ్గి రాజేస్తోంది. -
నాపై రౌడీషీట్ ఎత్తేయండి!
- ప్రభుత్వానికి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వినతి - పరిశీలించాలంటూ జిల్లా పోలీసులకు ప్రభుత్వ ఆదేశం - త్వరలో రౌడీషీట్ ఎత్తేసేందుకు రంగం సిద్ధం! సాక్షి ప్రతినిధి, కర్నూలు: తనపై ఉన్న రౌడీషీట్ ఎత్తివేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కోరారు. ఆయన స్వయంగా సీఎం చంద్రబాబును కలసి ఈ మేరకు విన్నవించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన వినతిని పరిశీలించాలంటూ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. భూమాపై రౌడీషీట్ ఎత్తివేయడంపై జిల్లా పోలీస్ యంత్రాంగం తన అభిప్రాయాల్ని మరికొన్ని రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నట్టు తెలిసింది. వైఎస్సార్సీపీ నుంచి అధికారపార్టీలో చేరిన తర్వాత భూమాపై ఉన్న రౌడీషీట్ను ఎత్తివేసేందుకు పావులు కదపడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష పార్టీలో ఉంటే కేసుల్ని నమోదు చేస్తారని, అధికారపార్టీలో చేరితే అవే కేసుల్ని ఎత్తివేస్తారనే భావన ప్రజల్లో బలంగా నెలకొనే ప్రమాదముందనే ఆందోళన అధికారపార్టీలోని నేతల్లోనే వ్యక్తమవుతుండడం గమనార్హం. కేసు నేపథ్యమిదీ..: నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశాన్ని 2014, అక్టోబర్ 31న నిర్వహించారు. చివర్లో రోడ్ల విస్తరణపై భూమా నాగిరెడ్డి మాట్లాడుతుండగా.. సమావేశం ముగిసిందంటూ అధికారపార్టీకి చెందిన చైర్పర్సన్ దేశం సులోచన బెల్కొట్టారు. ఇది ఇరువర్గాలమధ్య దాడులదాకా వెళ్లింది. మాజీమంత్రి శిల్పామోహన్రెడ్డి వర్గానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు గాయపడ్డారు. చైర్పర్సన్ చాంబర్ అద్దాలు పగిలిపోయాయి. గాయపడిన కౌన్సిలర్లను సమావేశం ముగిశాక మునిసిపల్ వైస్చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ పరామర్శించి వస్తుండగా హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనల గురించి మాజీ మంత్రులు శిల్పామోహన్రెడ్డి, ఫరూక్లు టూటౌన్ పోలీస్స్టేషన్లో అదేరోజు ఫిర్యాదు చేశారు. దీనిపై దళిత కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ను అవమానించారంటూ అట్రాసిటీ కేసు, గంగిశెట్టి విజయ్కుమార్పై హత్యాయత్నానికి కుట్రపన్నినట్టు భూమాపై నాన్బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. వెంటనే రాత్రిసమయంలో ఆయన్ను అరెస్ట్ చేసి విచారించారు. మరుసటిరోజు భూమా, ఆయన అనుచరులైన ఏడుగురు కౌన్సిలర్లతోపాటు ఏవీఆర్ ప్రసాద్లపై రౌడీషీట్ నమోదైంది. -
భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ
కర్నూలు: కర్నూలు జిల్లాలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, టీడీపీ నేత గంగుల ప్రభాకర్రెడ్డి వర్గీయుల మధ్య సోమవారం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి కామినేని శ్రీనివాస్ సమక్షంలోనే ఇరువర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు తన్నుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. రెండు నెలల కిందట సీసీ రోడ్డు పనుల విషయంలో తలెత్తిన వివాదంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. తాజా పరిణామాలతో గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీలో భూమా చేరికను మొదటి నుంచి గంగుల, శిల్పా వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. -
భూమాపై నాన్బెయిలబుల్ వారెంట్
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 2015 మే నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో భూమా నాగిరెడ్డి, డీఎస్పీ దేవదానంకు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భూమా డీఎస్పీని కులం పేరుతో దూషించారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరస్టయిన భూమా బెయిల్ మీద బయటకు వచ్చారు. కాగా, కోర్టు కేసు విచారణకు దాదాపు రెండుమార్లు గైర్హాజరయ్యారు. సోమవారం మరోసారి విచారణకు రాకపోవడంతో మేజిస్ట్రేట్ కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. -
ఎమ్మెల్యే భూమాకు స్వల్పంగా గుండెపోటు
నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆదివారం రాత్రి స్వల్పంగా గుండెపోటుకు గురయ్యారు. ఆయన క్రాంతినగర్లో ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు బాణసంచా కాల్చడంతో వచ్చిన పొగ వల్ల శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అలాగే ఐఎంఏ సమావేశంలో పాల్గొని ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కూడా ఇబ్బంది పడుతుండటంతో వైద్యులు ఆయనకు ఈసీజీ తీసి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. ఆయన్ను సురక్ష ఎమర్జెన్సీ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యులు గంట పాటు చికిత్స అందించిన అనంతరం ఆయన కోలుకున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను హైదరాబాద్కు తీసుకెళ్లారు. భూమా మీడియాతో మాట్లాడుతూ తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. -
కార్యకర్తలను కాపాడుకునేందుకే టీడీపీలో చేరా: భూమా
కర్నూలు: నమ్ముకున్న కార్యకర్తలతో పాటు వర్గాన్ని కాపాడుకునేందుకే తాను వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరానని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఆస్తులతో పాటు తాత, ముత్తాతలు వర్గాన్ని మిగిల్చిపోయారని, వారు కొంతకాలంగా ఇబ్బందులు పడుతుండటం వల్ల కాపాడుకోవడం కోసం అన్నింటికీ సిద్ధపడి టీడీపీలో చేరానన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలని, ఎవరికీ అన్యాయం జరగకుండా కలసి పనిచేద్దామని అన్నారు. -
ముఖ్యమంత్రి వద్దే పరిష్కరించుకుంటాం
భూమా నాగిరెడ్డితో సమస్యలపై శిల్పా ప్రకటన సాక్షి, కర్నూలు: ‘‘భూమా నాగిరెడ్డితో మాకు సమస్యలు ఉన్న మాట వాస్తవమే. అయితే వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పరిష్కరించుకుంటాం’’ అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. గురువారం ఆయన నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఫిలిప్ సి టాచర్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఫ్రధాన కార్యదర్శి జాన్వెస్లీలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చన్నాయుడు, జిల్లా అధ్యక్షుడితో కూడిన కమిటీ త్వరలోనే సీఎం చంద్రబాబును కలవనుందని.. ఆ సందర్భంగా భూమాతో సమస్యలను చర్చించి పరిష్కరించుకుంటామన్నారు. శ్రీశైలంలో అభివృద్ధి పనులపై అనేక ఆరోపణలు వస్తున్నాయని.. త్వరలోనే చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా కర్నూలు కార్పొరేషన్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. తుంగభద్ర నుంచి ఎల్ఎల్సీకి మే నెలలో నీళ్లు ఇచ్చేందుకు బళ్లారి కలెక్టర్ అంగీకరించినట్లు జిల్లా కలెక్టర్ విజయమోహన్ తెలిపారన్నారు. జిల్లాలో కరువు నివారణకు ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసిందన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్.సి.టాచర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్రిస్టియన్, మైనార్టీ వర్గాల స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. -
భూమా వ్యాఖ్యలకు నిరసనగా రాస్తారోకో
పాములపాడు: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కులవివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో పాములపాడులో కర్నూలు-గుంటూరు రహదారిపై రాస్తారోకోకు దిగారు. నంద్యాలలో గురువారం కొంతమంది దళితులు తమకు అంబేద్కర్ భవన్ను కట్టించవలసిందిగా భూమానాగిరెడ్డిని కోరారు. ఆ సందర్భంలో ఆయన‘ మీకు తినడానికి తిండి లేదు కానీ అంబేద్కర్ భవన్ అంత అవసరమా’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా కులవివక్ష పోరాట సమితి నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగారు. -
టీడీపీ నాయకుడు జేవీసీ ప్రసాద్ అరెస్ట్
► మున్సిపల్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో నిందితుడు ► రిమాండ్కు తరలించిన పోలీసులు నంద్యాల: మున్సిపల్ కాంట్రాక్ట్ వాల్వ్ ఆపరేటర్ ఆత్మహత్య కేసులో ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ నాయకుడు జేవీసీ ప్రసాద్ను పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. అతన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా.. రిమాండ్కు ఆదేశించారు. నూనెపల్లె ట్యాంక్ వద్ద వాల్వ్ ఆపరేటర్గా హుసేన్బాషా పని చేస్తున్నారు. ఇటీవల పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రమైన విషయం తెలిసిందే. దీంతో ప్రజా ప్రతినిధులు, ప్రజలు సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. నూనెపల్లె ట్యాంక్ వద్ద ఉన్న హుసేన్బాషాను ..టీడీపీ కౌన్సిలర్ జేవీసీ హారిక భర్త ప్రసాద్ నీటి సరఫరా విషయంలో దూషించారు. అసభ్యంగా తిట్టడంతో అవమానం తట్టుకోలేక హుసేన్బాషా గత నెల 24న ట్యాంక్ వద్ద దోమల నివారణకై వినియోగించే రసాయనాలను తాగి ఆత్మహత్యకు యత్నించాడు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. కాని ఆయన చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందారు. ఈ మేరకు జేవీసీ ప్రసాద్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మున్సిపల్ ఆఫీసు ఎదుట మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు, ఆవాజ్ కమిటీ నాయకులు రాస్తారోకో చేశారు. అయితే పోలీసులు హుసేన్బాషా భార్య షహనాభాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. విచారణలో జేవీసీ ప్రసాద్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ... సెక్షన్ 306కింద కేసు నమోదు చేశారు. ఆయనను రాత్రి అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా, రిమాండ్కు ఆదేశించారు. అయితే హుసేన్ ఆత్మహత్యకు తాను కారకుడు కాదని, తనపై కుట్రపన్ని ఇరికించారని ప్రసాద్ తెలిపారు. -
సీఎం చంద్రబాబును కలిసిన భూమా
శిల్పా మోహన్రెడ్డిపై ఫిర్యాదు! తాడేపల్లి రూరల్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సోమవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాతో కలసి ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తన చిరకాల ప్రత్యర్థి అయిన శిల్పా మోహన్రెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గత 20 రోజుల కిందట శిల్పా మోహనరెడ్డి తన సోదరుడితో కలసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా కలసి భూమాపై ఫిర్యాదు చేశారు. భూమా నాగిరెడ్డి ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని.... తాను పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, అయితే ఆ సమయంలో ఎలాంటి గొడవలు జరగలేదని చంద్రబాబుకు వివరించారు. భూమా కుటుంబం టీడీపీలో చేరినప్పటి నుంచి జిల్లా రాజకీయాలలో గొడవలు మొదలయ్యాయని పార్టీ అధ్యక్షుడికి శిల్పా ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తమను టీడీపీలో లేకుండా చేయాలని భూమా ప్రయత్నిస్తున్నారంటూ శిల్పా మోహనరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారు
భూమాపై సీఎంకు శిల్పా సోదరుల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఇటీవల టీడీపీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం నేత శిల్పా మోహన్రెడ్డి, ఆయన సోదరుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మంగళవారం సీఎం చంద్రబాబును కలసి ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో ఫ్యాక్షనిజంతో కల్లోలం రేపాలని భూమా చూస్తే సహించబోమని హెచ్చరించారు. సీఎంను కలసిన అనంతరం శిల్పామోహన్రెడ్డి అసెంబ్లీ మీడియాపాయింట్లో మాట్లాడారు. నంద్యాల మండలంలోని కొత్తపల్లె గ్రామ సర్పంచ్, జిల్లా టీడీపీ న్యాయ విభాగం అధ్యక్షుడు తులసిరెడ్డిపై సోమవారం భూమా అనుచరులు కళ్లలో కారం చల్లి వేటకొడవళ్లతో దాడి చేశారని, తీవ్ర గాయాలపాలైన ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆయనకు జరగరానిది జరిగితే అందుకు పూర్తి బాధ్యత భూమా వహించాల్సి ఉంటుందని, ఇదే విషయాన్ని సీఎంకూ చెప్పామన్నారు. -
పోలీసుల 'పచ్చ'పాతం
అధికారానికి తలొగ్గారు! ► మున్సిపల్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో టీడీపీ నేత పేరు చేర్చని పోలీసులు ► మున్సిపల్ ఆఫీసు ఎదుట ఉద్యోగులు, ఆవాజ్ కమిటీ రాస్తారోకో ► గంటన్నరసేపు స్తంభించిన ట్రాఫిక్ కమిషనర్ హామీతో ఆందోళన విరమణ ఈమె పేరు షారాబాను. నంద్యాల మున్సిపాలిటీలో కాంట్రాక్టు వాటర్ వాల్వు ఆపరేటర్ హుసేన్సాబ్ భార్య. గుండలవిసేలా రోదిస్తున్న ఈమె కన్నీటి వెనుక అధికార పార్టీ నేత అహంకారం దాగుంది. టీడీపీ కౌన్సిలర్ భర్త అయిన ఆయన.. ఆ చిరుద్యోగిపై ఉరిమిన చూపునకు ఈమె జీవితంఅంధకారమైంది. ఓ మనిషి ప్రాణం తీసిన ఆ నేత విషయంలో పోలీసుల ‘పచ్చ’పాత ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. నంద్యాల: బాధితుల పక్షాన నిలబడి న్యాయం అందించాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారు. మున్సిపల్ కాంట్రాక్ట్ వాల్వ్ ఆపరేటర్ హుసేన్బాషా ఆత్మహత్యకు కారకుడైన ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ నేత జేవీసీ ప్రసాద్ పేరును కేసు నుంచి పోలీసులు తప్పించారు. విచారణలో తేలితే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పి, చేతులు దులుపుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆవాజ్ కమిటీ, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట గంట సేపు ఆందోళన చేశాయి. నూనెపల్లె ట్యాంకు వద్ద వాల్వ్ ఆపరేటర్గా హుసేన్బాషా పని చేస్తున్నాడు. ఈనెల 22వ తేదీ రాత్రి 9గంటల సమయంలో టీడీపీ నాయకుడు, కౌన్సిలర్ జేవీసీ హారిక భర్త ప్రసాద్ అక్కడికి వెళ్లి ‘నీటిని సక్రమంగా సరఫరా చేయడం లేదు.. అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నావు.. నీ అంతు చూస్తా.. అంటూ దుర్భాషలాడాడు. భార్య సమక్షంలో దూషించడంతో మనస్థాపానికి గురైన హుసేన్బాషా గురువారం మధ్యాహ్నం ట్యాంకు వద్ద ఉన్న ఫాగింగ్కు వినియోగించే కెమికల్స్ను తాగి భార్యకు ఫోన్ చేసి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నాడు. అయితే రాత్రి వాంతులు అధికమై ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. విచారణలో తేలాకే కేసు: కాంట్రాక్ట్ వాల్వ్ ఆపరేటర్ హుసేన్బాషా ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేవీసీ ప్రసాద్పై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేయలేదు. గురువారం సాయంత్రం హుసేన్బాషా, అతని భార్య షారాబాను పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేశామని, ఎవరి పేర్లు చేర్చలేదని సీఐ వెంకటరమణ తెలిపారు. ఆధారాలు లభ్యమైతే జేవీసీ ప్రసాద్పై కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఈ విషయంపై జేవీసీ ప్రసాద్ మాట్లాడుతూ హుసేన్ బాషా ఆత్మహత్యకు తాను కారణం కాదని, రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మృతదేహంతో ఆందోళన కర్నూలులో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు శుక్రవారం సాయంత్రం నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే సమాచారం అందుకున్న కాంట్రాక్ట్ కార్మికుల సంఘం కార్యదర్శి భాస్కరాచారి, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, ఆవాజ్ కమిటీ అధ్యక్షుడు ముర్తుజా, డివిజన్ కార్యదర్శి అమ్జాద్బాషా సిద్ధిఖీ, సీపీఎం నాయకులు తోటమద్దులు, మస్తాన్వలి, మరికొందరు ముస్లిం మైనార్టీ నేతలు మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నా రు. మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేశారు. జేవీసీ ప్రసాద్ను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. హుసేన్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని, అతని భార్యకు ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. టూటౌన్ సీఐ గుణశేఖర్ బాబు, ఎస్ఐ మోహన్రెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళనలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కోలా కల్యాణ్, మరికొందరు ఎమ్మార్పీఎస్ నేతలు కూడా జత కావడంతో ఆందోళన ఉధృతమైంది. కమిషనర్ సత్యనారాయణరావు, పోలీస్ అధికారులు చర్చలు జరిపారు. జేవీసీ ప్రసాద్పై చర్యలు తీసుకొనేలా చూస్తామని, ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని హామీనిచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. -
భూమాకు ఎదురుగాలి
► వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నగర పంచాయతీ వైస్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి ► అదే బాటలో మరికొందరు మండల, గ్రామస్థాయి నాయకులు ఆళ్లగడ్డటౌన్: ఫ్యాన్ గుర్తుపై గెలిచి ఇటీవలే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి అనుకోని పరిస్థితి ఎదురవుతోంది. పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు, కార్యకర్తలు తన వెంటే ఉంటారని భావిస్తూ వచ్చిన ఆయనకు సొంత ఇలాకాలో ఎదురుగాలి వీస్తోంది. నగర పంచాయతీ వైఎస్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేయడం, మరికొందరు గ్రామ, మండలస్థాయి నాయకులు ఆయన బాటలో వెళ్తుండడం ఇందుకు నిదర్శనం. శుక్రవారం ఆళ్లగడ్డలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్ రామలింగారెడ్డి ఈ మేరకు బహిరంగంగానే ప్రకటించారు. ‘ఎవరో పార్టీని వీడినంత మాత్రాన నేను కూడా మారాలా? నాకు ఆ అవసరం లేదు’ అని పేర్కొన్నారు. డాక్టర్ రామలింగారెడ్డి, ఆయన భార్య డాక్టర్ సరోజిని దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైద్య వృత్తిలో ఉంటూ, విద్యా సంస్థలు స్థాపించి, అంకాళ్రెడ్డి మెమోరియల్ సేవా ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తు నియోజవర్గ ప్రజలకు సుపరిచితులుగా ఉన్నారు. గత నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 20 వార్డులకు 18 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయిండంతో వైఎస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మున్సిపాల్టీకి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన గళం వినిపిస్తూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో భూమా, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పార్టీ మారడంతో డాక్టర్ రామలింగారెడ్డి ఆయన వెంట వెళ్లారా? వారితో విభే దిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచాను. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిరభ్యంతరంగా స్వీకరిస్తానని ఆయన ప్రకటించారు. అదేబాటలో పలువురు భూమానాగిరెడ్డి..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడ టం జీర్ణించుకోలేని అనేకమంది లోలోన మదనపడుతున్నారు. ఎవరో ఒకరు ముందుకు వస్తే వారి నాయకత్వంలో పార్టీలోనే ఉంటామని చెబుతున్నారు. భూమా కుటుంబం పీఆర్పీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చిన సమయంలో ఆ కుటుంబానికి చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న అనేక కుటుం బాలు వైఎస్సార్పై ఉన్న అభిమానంతో కలిసి నడిచారు. ముఖ్యంగా ఉయ్యలవాడ, చాగలమర్రి, శిరివెళ్ల మండలాల్లో ప్రధాన వర్గాలుగా ఉన్న ముస్లిం మైనార్టీ, క్రైస్తవులు, మరో సామాజిక వర్గం పూర్తిగా మద్దతు తెలిపింది. ఫలితంగానే పీఆర్పీ అభ్యర్థిగా కేవలం 2 వేల మెజార్టీతో గెలిచిన దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడి ఆ త ర్వాతి ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై పోటీ చేసి 36వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. ఇందులో చాలా వరకు వైఎస్సార్ అభిమానులే ఉన్నారన్న విషయం సుస్పష్టం. అలాంటి వీరంతా ప్రస్తుతం వైఎస్సార్సీపీ నాయకుని కోసం ఎదురుచూస్తున్నారు. -
వైఎస్ఆర్సీపీని ఎవరూ వీడరు
ఆత్మకూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరూ వీడరని, అంతా కల్పిత ప్రచారమేనని పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఒకరిద్దరు పార్టీ వీడినా వైఎస్ఆర్సీపీకి ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. భూమా నాగిరెడ్డి పార్టీ ఫిరాయింపుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సీనియర్ నాయకుడని, పార్టీ ఎంతో గుర్తింపు ఇచ్చిందన్నారు. అయితే, పార్టీ వీడడానికి ఆయనకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలున్నాయో తెలియదన్నారు. టీడీపీ నుంచి త్వరలో వైఎస్ఆర్సీపీలోకి వలసలు ప్రారంభమవుతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, మేము పార్టీలోకి చేర్చుకునేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు లాగా నీచ రాజకీయాలు చేయమన్నారు. రాష్ట్రంలో టీడీపీ తప్ప ఏ పార్టీని ఉండనివ్వమని ముఖ్యమంత్రి తనయుడు నారాలోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ జన్మలో కూడా అది జరగదని అన్నారు. బాబువి దిగజారుడు రాజకీయాలు - హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తమరెడ్డి, మంత్రాలయం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తమరెడ్డి విమర్శించారు. గురువారం మంత్రాలయంలో జరిగిన ఆయన బంధువుల వివాహ వేడుకలకు హాజరైన పురుషోత్తమరెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడాన్ని తప్పుబడుతూ చంద్రబాబు గ్రేటర్ హైదరాబాబు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. తమ వారిని టీఆర్ఎస్లో చేర్చుకోవడం అనైతికమని అక్కడ చెప్పిన బాబు ఇక్కడ చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. పార్టీలు మారే నాయకులు నియోజకవర్గాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కోసమేనని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ అభివృద్ధి చెందలేదంటూ తన తల్లిపైనే నిందలు వేయటం ఆమె తెలియని తనానికి నిదర్శనమన్నారు. తెలుగుదేశం పాల్పడే కుట్రలతో వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో అభిమానం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీలు మారే వారికి మనుగడ ఉండదు ఆలూరు రూరల్ / హాలహర్వి : పార్టీలు మారే నేతలకు మనుగడ ఉండదని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. గురువారం స్థానిక స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల తమ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వారి స్వార్థప్రయోజనాల కోసం టీడీపీలో చేరారని చెప్పారు. వీరికి అధికార పార్టీ నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. తాను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటానన్నారు. టీడీపీలో చేరుతున్నాననే ప్రచారం కల్పితమేనన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని తమ పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను కొనుగోలు చేసుకునేందుకు కొందరు అధికార పార్టీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. కొందరు నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరుతున్నామని ప్రకటిస్తున్నారని, అయితే, ఈ రెండేళ్ల కాలంలో అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందో చూపిస్తే తాను శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వెఎస్సార్సీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి కమ్మరచేడు తిమ్మారెడ్డి, మండల కో-కన్వీనర్ బాబాసాహెబ్, మరకట్టు తిక్కన్న, అరికెర వెంకటేశ్వర్లు తదితర నాయకులు ఉన్నారు. -
గోడ దూకిన ఎమ్మెల్యేల ఫొటోలు దహనం
టీడీపీలో చేర్చుకోవడం సిగ్గుచేటు పీలేరు: ప్రజల ఆకాంక్షను విస్మరించి తమ స్వార్థం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం సిగ్గుచేటు అని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సుంకర చక్రధర్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, జలీల్ఖాన్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి చిత్రాపటాలను మంగళవారం చిత్తూరు జిల్లా పీలేరులో దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణాలో టీడీపీ దుకాణం మూతపడడంతో ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇక్కడ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కోట్లు, పదవులు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొన్నంత మాత్రాన బాబుకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి జిల్లా కార్యదర్శి పూల కుమార్, ఎం. నరేష్, శ్రీనాథ్, ఉదయ్, సాయికుమార్, ఆజాద్, సాదిక్, అస్లాం, మస్తాన్, గణేష్ పాల్గొన్నారు. -
‘భూమా’ గతంలో ఏమన్నారు..!
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబునాయుడుకు దూకుడుగా వెళ్లినపుడు మేం నచ్చుతాం. అపుడు ఆయన మమ్మల్ని ఉపయోగించుకున్నారు. టీడీపీలో ఉన్నపుడు మాకు అవమానం జరిగితే చంద్రబాబు ముందే ఏడ్చాను. అయినా పట్టించుకోలేదు. ఆయనకు ఓదార్చటం కూడా రాదు. ఓదార్చటం అలవాటు ఉందో లేదో కూడా తెలియదు. పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు పనిచేసినా దగ్గరకు తీసుకోలేదు. ప్రతిదానికీ రాజకీయమే. పార్టీలో మేం సిన్సియర్గా పనిచేస్తేనే ఆ పాటి గౌరవం దక్కింది. ఇతర పార్టీలోకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి వస్తే ఏ పాటి గౌరవం ఉంటుందో మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఫిరాయింపులపై గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చంద్రబాబు వ్యాఖ్యలు సనత్నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తలసాని శ్రీనివాసయాదవ్ ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలి. మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్లు, ఇది న్యాయమా? టీడీపీలో గెలిచి రాజీనామా చేయకుండా హీరో మాదిరిగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారంటే.. అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా తమ్ముళ్లూ? ఇది న్యాయమా? ఇలాంటి సమయంలో అలాంటి వ్యక్తులను చిత్తు చిత్తుగా ఓడించాలి. స్వార్థంతో కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినా పార్టీ కార్యకర్తలు చెక్కు చెదరలేదు. ఒకరు పోతే వందమంది నేతలను తయారు చేసుకునే శక్తి టీడీపీకి ఉంది. -
పీఏసీ చైర్మన్గా తప్పుకున్న భూమా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా పద్దుల సమితి (పీఏసీ) చైర్మన్ పదవి నుంచి కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తప్పుకున్నారు. సోమవారం సమితి సమావేశం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. ఆ సమావేశానికి భూమా అధ్యక్షత వహించారు. సభ్యులు ఆదిమూలం సురేష్, తోట త్రిమూర్తులు, పి. శమంతకమణి హాజరయ్యారు. గనులు, రోడ్లు, భవనాలు, నౌకాశ్రయాలు తదితర శాఖలపై సమీక్షించి నివేదిక రూపొందించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పీఏసీ తన నివేదికను సభకు సమర్పించాల్సి ఉంది. సమావేశంలో పాల్గొన్న భూమా మాట్లాడుతూ.. చైర్మన్గా తనకు ఇదే చివరి సమావేశమని చెప్పారు. ఆ వెంటనే సమావేశం నుంచి బైటకు వెళ్లిపోయారు. -
టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు
సాక్షి, తాడేపల్లి (గుంటూరు): వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆళ్లగడ్డ, నంద్యాల ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ, విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, జమ్మలమడుగు ఎమ్మెల్యేల దేవగుడి ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి సోమవారం రాత్రి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ వేదికగా మధ్యాహ్నం నుంచి జరిగిన హై డ్రామా చివరకు సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి మారింది. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ఒక్కొక్కరితో విడివిడిగా జరిపిన చర్చల అనంతరం 11 గంటల తర్వాత చంద్రబాబు వీరికి పార్టీ కండువాలు కప్పారు. ఆరేడు నెలల కిందటే తాము టీడీపీలో చేరే విషయం ఖరారైనా ఇంత దాకా ఆలస్యం జరిగిందని ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి చంద్రబాబుకు ఉందనే నమ్మకం కార్యకర్తలు, ప్రజల్లో ఉన్నందువల్లే తాము టీడీపీ గూటికి వచ్చినట్లు వివరించారు. మాజీ శాసనసభ్యుడు రామసుబ్బారెడ్డి కుటుంబంతో తమ కుటుంబానికి భయంకరమైన ఫ్యాక్షన్ ఉన్నా దాన్ని మర్చి పోయి వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రెండేళ్లుగా చంద్రబాబే సీఎంగా ఉన్నా అభివృద్ధి జరగలేదంటే ఆయనే కారణం కదా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆదినారాయణరెడ్డి అసహనం వ్యక్తం చేసి వెళ్లిపోయారు. సర్దుబాట్లు చేసుకుంటాం : భూమా రాష్ట్రంలో ఎలాంటి రాజకీయాలు ఉన్నాయో, కార్యకర్తల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలీదు కానీ, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజక వర్గాల్లో మా వాళ్లు మాత్రం ఇబ్బందుల్లో ఉన్నారని ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వాలు తమ నియోజక వర్గాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదనీ, కార్యకర్తలందరితో మాట్లాడి టీడీపీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నానన్నారు. పార్టీలో ప్రత్యర్థులనుకునే వారితో కూడా సర్దుబాట్లు చేసుకుంటామన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలనే టీడీపీలో చేరామని చెప్పారు. మా పనులు జరగడం లేదు : జలీల్ ఖాన్ రెండేళ్లుగా తమ పనులు జరగడం లేదనీ, నియోజక వర్గంలో ముస్లింలు పేదలకు అన్యాయం జరుగుతోందనీ అందువల్లే టీడీపీలో చేరుతున్నానని విజయవాడ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ చెప్పారు. -
భూమాను చేర్చుకోవద్దు
చంద్రబాబుతో కర్నూలు టీడీపీ నేతలు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో కర్నూలు జిల్లా నుంచి విపక్ష నేతలు చేరటాన్ని స్వాగతిస్తున్నామని చెప్తున్న అధికార పార్టీ నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సమక్షంలో మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. తాము పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు చేరామని, అలాంటి తమకు ఇతరుల చేరికవల్ల ప్రాధాన్యత తగ్గుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి నంద్యాల శాసనసభ్యుడు, పీఏసీ ఛైర్మన్ భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరుతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డిలను విజయవాడ పిలిపించుకుని వారితో సుమారు రెండు గంటల పాటు చంద్రబాబు మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. తమలో కొందరు ఎంతోకాలం నుంచి పార్టీలో ఉన్నారని, మరికొందరం గత ఎన్నికలకు ముందు పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు చేరామని, భూమాలాంటి వారి చేరికవల్ల తమకు ప్రాధాన్యత తగ్గుతుందని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. భావసారూప్యత కలిగిన వారిని చేర్చుకుంటాం: భావసారూప్యత కలిగిన వారిని చేర్చుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విలేకరుల సమావేశం అనంతరం చేరికపై ప్రశ్నించగా... చూస్తారుగా, చూస్తారుగా అని వ్యాఖ్యానించారు. -
భూమా పార్టీలోనే కొనసాగుతారు
వైవీ సుబ్బారెడ్డి, సజ్జల వెల్లడి సాక్షి, హైదరాబాద్ : భూమా నాగిరెడ్డి తమ పార్టీలోనే కొనసాగుతారని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వీరిద్దరూ శనివారం పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డితో పాటు భూమా నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. భూమా పార్టీని వీడుతున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వారు ఆయన వద్దకు వెళ్లారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... నాగిరెడ్డి తమ పార్టీ సీనియర్ నాయకుడని, ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారని స్పష్టంచేశారు. భూమా పార్టీని వీడుతున్నట్లు మీడియా సృష్టించిన వార్తలపై స్పష్టత కోసమే ఆయన వద్దకు వచ్చామని వారు మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను తన కుమార్తె నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉంటే ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయో తనకూ తెలియడం లేదని ఆయన తమతో చెప్పారని తెలిపారు. నంద్యాలలో శుక్రవారం పార్టీ కార్యకర్తలు సమావేశమైనపుడు, స్థానిక మీడియా ప్రతినిధులు అడిగినపుడు పార్టీ వీడుతున్నట్లు భూమా చెప్పారని ప్రతినిధులు ప్రశ్నించగా... అసలు అక్కడ కార్యకర్తల సమావేశం గాని, విలేకరుల సమావేశం గానీ జరుగనే లేదని వైవీ వివరించారు. వాస్తవానికి భూమా నంద్యాలకు వెళ్లింది కోర్టు కేసు పనులపైనని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఎలా కేసులు పెట్టి వేధిస్తోందో అనే విషయం కూడా భూమా తమకు చర్చల సందర్భంగా చెప్పారని పేర్కొన్నారు. పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని భూమా ఎందుకు ఖండించలేదని ప్రశ్నించగా... తాను పార్టీని వీడుతున్నట్లు భూమా ఎక్కడ చెప్పలేదని, అలాంటపుడు ఖండించే అవసరం ఏముందన్నారు. ఈ సమస్యకు ఇంతటితో పుల్స్టాప్ పడినట్లేనా? అని ప్రశ్నించగా... ‘అసలిక్కడ ఎలాంటి సమస్యా లేదు... పుల్స్టాప్ పడటానికి. అంతా మీరే సృష్టించారు అంతే’ అని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ వీడుతున్నట్లు వచ్చిన ప్రచారాన్ని ఐజయ్య, జయరామయ్య తీవ్రంగా ఖండించారని గుర్తుచేశారు. దీన్ని బట్టే ఇలాంటి వార్తల్లో నిజమెంతో తెలుస్తోందన్నారు. ఇవాళ కర్నూలు ఎమ్మెల్యేలు జగన్కు కలిసిన నేపథ్యంలో భూమా కూడా ఆయనను కలుసుకునే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ఈ రోజని కాదు, వైఎస్సార్సీపీ నేతగా నాగిరెడ్డి జగన్ను ఎపుడైనా కలుసుకోవచ్చునని ఆయన సమాధానం ఇచ్చారు. -
ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం
బగనానపల్లె : రాష్ట్ర ప్రభుత్వం ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు. బనగానపల్లెలోని జి.ఎం.ఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన ఆదివారం మండల స్థాయి వైఎస్సార్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా భూమానాగిరెడ్డి మాట్లాడారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఉన్న నాయకత్వ లక్షణాలు సీఎం చంద్రబాబులో లేవన్నారు. టీడీపీ అధికారం చేపట్టి 15 నెలలైనా ఒక్క అభివృద్ధి చేయలేదని, టీడీపీని ప్రజలు నమ్మడం లేదన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు సాగునీరు అందిస్తానని సీఎం చెప్పే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు అధికారం బలంతో బనగానపల్లె నియోజకవర్గంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. పోలీసుల సహకారంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని, తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వేధింపులు తమకు కొత్తకాదని, గతంలో ఇలాంటి వాటిని ఎన్నో చూశామన్నారు. అధికారం కోల్పోయిన తరువాత ఇలాంటి వారు ఇంటి నుంచి బయటికి రాగలరా అంటూ ప్రశ్నించారు. కాటసాని కుటుంబానికి వేధింపులు కొత్తేమీ కాదని, బెదిరింపులను లెక్కచేయబోమన్నారు. వైఎస్సార్ హయాంలో ఫ్యాక్షన్ గ్రామాల్లో శాంతి కుసుమాలు విరిశాయని, టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల కారణంగా మళ్లీ గ్రామాల్లో అశాంతి నెలకొందన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు కాటసాని రామిరెడ్డి అండగా నిలుస్తారని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా కలిసికట్టుగా రెక్కలు కట్టుకొని వాలుతామని భూమా భరోసా ఇచ్చారు. విసృతస్థాయి సమావేశానికి భారీ ఎత్తున కార్యకర్తలు హాజరు కావడం చూస్తుంటే అధికార పార్టీపైన, ఇక్కడి అధికార పార్టీ నాయకుడిపై ఎంత వ్యతిరేకత ఉన్నదో అర్థమవుతోందన్నారు. ‘బీసీ జనార్దన్ రెడ్డి ఓ సైకో’ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని బనగానపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ విగ్రహావిష్కరణను మండలంలోని యనకండ్ల గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేయించామన్నారు. అయితే పోలీసుల సహకారంతో ఎమ్మెల్యే దానిని ఆపివేయించారన్నారు. ఈ విషయం తనకు తీవ్ర ఆవేదనను కలిగించిందన్నారు. అధికారం శాశ్వతం కాదని పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించే పోలీసులపై న్యాయపరంగా పోరాటం సాగిస్తామన్నారు. గ్రేడుల వారీగా అవినీతి చంద్రబాబు పాలనలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు గ్రేడుల వారీగా అవినీతి సాగుతోందని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. చేసిన అభివృద్ధి కొంతయితే ప్రచారం ఎక్కువగా కనిపిస్తోందన్నారు. బయోమెట్రిక్ విధానంతో ఎంతో మంది పేదలు పింఛన్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేపడితే ఒక పోలీసు కానిస్టేబుల్ని కూడా నియమించని ప్రభుత్వం బనగానపల్లెలో మండల స్థాయి వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల విసృత స్థాయి సమావేశానికి భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడమేమిటంటూ ప్రశ్నించారు. రాజకీయాలు శాశ్వతం కాదని, పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రజల మన్నలను చురగ్గొన్నవాడే ప్రజానాయకుడని బుగ్గన అన్నారు. -
అక్రమ కేసుల బనాయింపే బాబు లక్ష్యం
- ప్రజాపోరాటాలను అణచివేయాలని చూస్తున్నారు - నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాల: ప్రజా సమస్యలను పరిష్కరించాలని నిలదీసే వారిపై అక్రమ కేసులు బనాయించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ఆరోపించారు. నంద్యాల పట్టణ సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం నాయకులు ఆదివారం.. 72గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. వీరికి భూమా మద్దతు తెలిపి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర పరిస్థితులు తయారయ్యాయన్నారు. అక్రమ కేసులతో ప్రజా పోరాటాలను అణచి వేయాలని సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఎల్లకాలం సాగబోవన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే ఉండబోదని, ప్రజలకు మాత్రమే తాము భయపడుతామన్న విషయం గుర్తించుకోవాలన్నారు. సీపీఎం నాయకులు కోరుతున్న విధంగా నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం రూ.350కోట్లు నిధులు మంజూరు చేయాలన్నారు. చిత్రహింసలకు గురి చేస్తున్నారు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించారనే కసితో మాజీ మంత్రి శిల్పామోహన్రెడ్డి ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని భూమా ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను గమనించకుండా కాలుష్యానికి దూరంగా శిల్పా..బెంగళూరులో నివాసం ఉంటున్నారని ఎద్దేవా చేశారు. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండబోదని, అధికారులు తొత్తులుగా మారకుండా నిజాయితీ వ్యవహరించాలని కోరారు.నంద్యాల పట్టణంలో రహదారుల విస్తరణతో పాటు పందుల సమస్య కూడా తీవ్రంగా ఉందని గుర్తుచేశారు. రోడ్లు వెడల్పు చేయాలని చిన్నారులు సైతం ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు. నంద్యాల పట్టణంలో జరుగుతున్న అవినీతి వెలుగులోకి తేవడానికి పీఏసీ చైర్మన్గా ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. దీక్షలో సీపీఎం నాయకుడు మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు. -
దౌర్జన్యం చేస్తే గెలుపు వరించదు
మెజార్టీ పోలీసులకు నేను మిత్రున్ని.. ♦ జిల్లా ఎస్పీ రవికృష్ణను ఏనాడూ కించపరిచి మాట్లాడలేదు ♦ చట్టం గురించి ప్రశ్నిస్తే సంకెళ్లా ♦ రూల్స్ పోలీసులకు వర్తించవా ♦ వీడియో పుటేజీ ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ♦ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి రాజకీయ పార్టీల గాలికి వ్యతిరేకంగా గెలుపు కులమతాలకు అతీతంగా తమ గెలుపులో ప్రజలు కీలక భూమిక పోషించారన్నారు. రాజకీయ పార్టీల గాలికి వ్యతిరేకంగా గెలిచిన ఘనత కూడా తమ కుటుంబానికే దక్కిందన్నారు. ఎస్పీ ఇప్పుడు చేస్తున్న ప్రచారం, తన ప్రత్యర్థులు ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికల్లోనూ చేసి విఫలమయ్యారన్నారు. నిజంగానే డీఎస్పీ దేవదానం కులం తనకు తెలియదన్నారు. ఆయనపై అంతటి అభిమానమే ఉంటే రెగ్యులర్ డీఎస్పీగా ఎందుకు నియమించలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. తనకు వ్యతిరేకంగా ప్రెస్మీట్ పెట్టి డీఎస్పీ దేవదానం కులాన్ని పదేపదే చెప్పడం ఎస్పీకి తగదన్నారు. నంద్యాల : మూడు దఫాలు పార్లమెంట్కు, నాలుగు దఫాలు శాసనసభకు ఎన్నికయ్యానంటే ప్రజాబలంతోనే సాధ్యమైందని.. దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ఇన్నిసార్లు గెలుపు వరించేది కాదనే విషయం జిల్లా ఎస్పీ రవికృష్ణ గుర్తుంచుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నంద్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాప్రతినిధులను, రెవెన్యూ అధికారులను పోలీసులు డామినేట్ చేసినప్పుడు.. చట్ట ప్రకారం తాను ప్రశ్నిస్తే ఎస్పీ ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల విధుల్లోని రెవెన్యూ అధికారులను పోలీసులు డామినేట్ చేసిన విషయాన్ని వీడియో ఫుటేజీల ఆధారంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ స్టాల్లో కూర్చొన్న ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియను బయటకు పంపేందుకు పోలీసులు అధికారం ఎవరిచ్చారో చెప్పాలన్నారు. పోలీసులు తనను కూడా వెయిటింగ్ స్టాల్లో కూర్చోనివ్వలేదన్నారు. అదే విషయం వారికి చెప్పగా.. ఆర్డీఓ వచ్చి ఓటు వేయాలని కోరడంతో ఎన్నికల నిబంధనల ప్రకారం గౌరవించానన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ప్రకటించిన రెండు గంటల తర్వాత తనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించడం వెనుక ఎవరి డెరైక్షన్ ఉందో అందరికీ తెలిసిందేనన్నారు. పోలీసు శాఖలో ఉన్నంత మిత్రులు మరెక్కడా లేరనే విషయం ఎస్పీ తెలుసుకోవాలన్నారు. ద్వేషించే వారు ఒకరిద్దరు ఉంటే.. అభిమానించే వారి సంఖ్య 95 మందికి పైమాటేనన్నారు. ఎస్పీ బాధపడేలా తాను ఎప్పుడూ మాట్లాడలేదని, అయితే ఆయన ఎందుకు అంతలా కక్ష పెంచుకున్నారో వేయి డాలర్ల ప్రశ్నగా మారిందన్నారు. తనను అరెస్టు చేయడానికి ఇల్లు, ప్రభుత్వాసుపత్రి వద్ద వందల సంఖ్యలో పోలీసులను నియమించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం బాధాకరమన్నారు. ఆ సందర్భంగా ఎలాంటి సమ్మెలు, ఆందోళనలు చేయవద్దని క్యాడర్కు స్వచ్ఛందంగా పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనను ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే.. ఇమెజ్ అంతలా పెరుగుతుందన్నారు. పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తానని.. ఎస్పీ మరోసారి రాజకీయ నాయకుడిలా ప్రకటనలు చేస్తే కోర్టును ఆశ్రయిస్తానన్నారు. -
కర్నూలు ఎస్పీపై భూమా మండిపాటు!
-
'కర్మ, కర్త, క్రియ అన్నీ ఆయనే'
ఆళ్లగడ్డ: తమపై కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు డిపార్ట్ మెంటును ప్రభుత్వం ఉపయోగించడం విడ్డూరమని నంద్యాల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. తమపై అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరించాలని టీడీపీ సర్కారు చూస్తోందని ఆరోపించారు. ఆళ్లగడ్డ సబ్ జైలు నుంచి బుధవారం సాయంత్రం ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనపై కేసులకు కర్మ, కర్త, క్రియ అన్నీ జిల్లా ఎస్పీనే అన్నారు. ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భూమా నాగిరెడ్డిని అంతకుముందు ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలించారు. -
నెట్టేస్తే 'డోంట్ టచ్ మీ' అన్నందుకు కేసా?
-
క్షీణిస్తున్న భూమానాగిరెడ్డి ఆరోగ్యం
-
క్షీణిస్తున్న భూమానాగిరెడ్డి ఆరోగ్యం
కర్నూలు(జిల్లా పరిషత్): కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలీసులు అక్రమంగాపెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టు అయిన నంద్యాల ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. మూడు రోజులుగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయనను సోమవారం వైద్యులు పరీక్షించారు. 1999లో గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న భూమా నాగిరెడ్డికి కార్డియాక్ ఎంజైమ్స్ పెరుగుతున్నందున ఆయనకు మరింత మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. దీంతో పాటు షుగర్ లెవెల్స్ తగ్గడం లేదని వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. ఈ మేరకు ఆయనను ఉన్నతస్థాయి సౌకర్యాలున్న వైద్యశాలకు తరలించాలని వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. తాను రెగ్యులర్గా హైదరాబాద్ నిమ్స్లో చికిత్స చేయించుకుంటున్నానని, తనను అక్కడికి పంపించాలని భూమా నాగిరెడ్డి కోరినట్లు సమాచారం. -
భూమాకు మధుమేహం, రక్తపోటు
-
భూమా అరెస్ట్ అప్రజాస్వామికం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్రెడ్డి గిద్దలూరు రూరల్ : నంద్యాల శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆయన ధ్వజమెత్తారు. పట్టణంలోని తన నివాస గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆళ్లగడ్డ శాసన సభ్యురాలు అఖిలప్రియను ఎన్నికల ప్రదేశానికి వెళ్లిన సమయంలో ఆమెపై దురుసుగా ప్రవర్తించిన అక్కడి పోలీసులను అడ్డుకుని ప్రశ్నించినందుకు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును బనాయించడం చాలా దారుణమన్నారు. కేవలం వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేసి బూటకపు కేసులు బనాయించి పార్టీని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కర్నూల్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న భయంతో ఇటువంటి లోపబూయిష్టమైన పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒక ప్రజాప్రతినిధి పై ఇటువంటి తప్పుడు కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తున్న ఇటువంటి హేయమైన చర్యలను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎంత అణచాలని ప్రయత్నించినా అంత పైకి లేచే శక్తి పార్టీకి ఉందన్నారు. కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే ఇటువంటి చర్యలను ప్రజలు గమనిస్తున్నారని సమయం చూసి తిప్పి కొడతారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సూరా స్వామిరంగారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్రెడ్డి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు షేక్ పెద్దబాష, కౌన్సిలర్ శ్రీను, కంభం ముస్లీం మైనార్టీ నాయకులు మహమ్మద్ మాబు, వైఎస్సార్ సీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, చింతలపూరి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు. అరెస్ట్ అక్రమం మార్కాపురం : కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వెళ్లిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని రాష్ట్రంలోని అధికార టీడీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిం దని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడం మంచి సాంప్రదాయం కాదన్నారు. ఎవరికైనా అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మార్కాపురం -
కులచిచ్చు రేపుతున్న చంద్రబాబు
భూమా నాగిరెడ్డిపై కేసులు పెట్టడం దారుణం చంద్రబాబుకు తొత్తులుగా పోలీసులు తిరుపతి మంగళం : కులమత భేదాలు లేకుండా అందరూ అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉన్న వారి మధ్య చంద్రబాబు కు లచిచ్చు రేపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వా మి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే అదేమిటని ప్ర శ్నించిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై అక్రమ కేసులు పెట్టించడం దుర్మార్గమైన చర్య అని ధ్వజమెత్తారు. జిల్లాలో పెద్దదిక్కు గా ఉన్న భూమా నాగిరెడ్డిని జైలుకు పంపితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవొచ్చన్న దురాలోచనతో చంద్రబాబు కు ట్రపన్నారని తెలిపారు. తమ పార్టీ అ ధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు అంసెంబ్లీలో ప్రభుత్వ తీ రును నిలదీస్తే టీడీపీలోని దళిత మం త్రులు, ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించే నీచ సంస్కృతి చంద్రబాబుదన్నారు. కులాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికార దాహంతో పిల్లనిచ్చి చేరదీసిన ఎన్టీఆర్నే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని గుర్తుచేశారు. కర్నూలు జిల్లాలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా భూమానాగిరెడ్డిపై వేధింపుల పర్వం కొనసాగుతూనే వస్తోందన్నారు. కర్నూలులో పోలీసులు కూడా చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయ న ఆరోపించారు. భూమా నాగిరెడ్డిపై పెట్టిన కేసులను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. -
భూమాపై కేసులు అక్రమం
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పామర్రు : కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డినిఅధికార పార్టీ నాయకులు స్థానిక అధికారులతో కలిసి కక్ష సాధింపుతో అరెస్టు చేయించడం నీచ రాజకీయానికి నిదర్శనమని పామర్రు ఎమ్మెల్యే, అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన దుయ్యబట్టారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల నాటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆయనపై అక్రమ కేసులు, వేధింపులు చేస్తూనే ఉన్నదన్నారు. భూమా ఆరోగ్యం బాగుండలేకపోయినా 12 గంటలపాటు పోలీ స్స్టేషన్లో ఉంచడం కక్ష సాధింపు చర్య కాదా అని ప్రశ్నిం చారు. నేను ఎమ్మెల్యేని తనను గౌరవించాలని అన్న పదాన్ని అధికార పార్టీ నాయకులు తప్ప డు దారి పట్టించి భూమాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం దారుణమని ఆమె పేర్కొన్నారు. ఒక ఎమ్మెల్యే తన ఆరోగ్యం బాగోలేదని, వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే దా నిని కూడా టీడీపీ నాయకుల సలహాతో ఒప్పుకోకపోవడం అన్యాయన్నారు. భూమానాగిరెడ్డికి ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి, టీడీపీ నాయకులు బాధ్య త వహించాల్సి వస్తుందని కల్పన హెచ్చరించారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అబ్దుల్ మొబీన్, జిల్లా పార్టీ నాయకులు బొప్పన స్వర్ణలత, పామర్రు ఉప సర్పంచ్ ఆరేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
తప్పుడు కేసులతో భూమా అరెస్టు
ఎల్.ఎన్.పేట: టీడీపీ అధికారం చేపట్టిన తరువాత ప్రజాస్వామ్యం ఎటుపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని.. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్టుతో ఇది నిజమని తేలిందని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. ఆదివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటుహక్కును కూడా వినియోగించుకోకుండా పోలింగ్ కేంద్రం వద్దనే అడ్డుకుని అరెస్టు చేయడం దారుణమన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వేధిస్తున్నారని.. లేదంటే దాడులు చేసి మారణహోమం సృష్టస్తున్నారని ఆరోపించారు. పోలీసులు దగ్గరగా వస్తున్నప్పుడు నన్ను తాకద్దు.. దూరంగా ఉండి మాట్లాడండి అనడం నేరంగా వక్రీకరించి అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తున్న ప్రభుత్వం ఇందుకు పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదంతా చేస్తున్నారని అన్నారు. నెల రోజులు క్రితం తెలంగాణ లో ఓటుకు కోట్లు ఇచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏకంగా అరెస్టులు చేసి అరాచకం సృష్టిస్తూ ప్రజలను భయానికి గురిచే స్తున్నారన్నారు. -
ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న భూమా
-
ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న భూమా నాగిరెడ్డి
హైదరాబాద్: ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికారులను దూషించారంటూ భూమాపై కేసులు నమోదైన సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భూమా నాగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ సబ్ జైల్లో ఉన్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ కు తరలించనున్నారు. -
'నువ్వు అరిస్తే ఏమీ కాదు.. '
హైదరాబాద్: ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పట్ల డీఎస్పీ అగౌరవంగా మాట్లాడారని డోన్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో ఉన్న భూమా నాగిరెడ్డిని 'నువ్వు అరిస్తే ఏమీ కాదు' అంటూ డీఎస్పీ ఏకవచనంతో మాట్లాడారని, ఎమ్మెల్యేలతో మాట్లాడేతీరు ఇదేనా అని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. భూమా నాగిరెడ్డితో అగౌరవంగా మాట్లాడిన విషయం వీడియో రికార్డులో స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. భూమా కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియతో పోలీసులు దురుసుగా వ్యవహరించారని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. మహిళా ఎమ్మెల్యేతో ఇలా ప్రవర్తించడం సరికాదని రాజేంద్రనాథ్ రెడ్డి ఖండించారు. ఈ విషయంపై పోలీసులను గట్టిగా ప్రశ్నించినందుకే భూమా నాగిరెడ్డిపై పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని అన్నారు. శాసనసభ్యులకే రక్షణ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటని రాజేంద్రనాథ్ రెడ్డిఆవేదన వ్యక్తం చేశారు. -
'నన్ను దూషించి.. నాన్నపై తప్పుడు కేసు'
-
అక్రమ కేసులకు భయపడం
డోన్ : ప్రతిపక్ష పార్టీగా అధికార టీడీపీ అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడతామని.. ఈ విషయంలో అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో నిలిచిన డి.వెంకటేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరుతూ శనివారం పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్రెడ్డి.. నంద్యాల, కర్నూలు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు. బుగ్గన మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమన్నారు. అధికార పార్టీ ఆదేశాలతో రెండు జీపుల్లో వచ్చిన పోలీసులు నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలే కానీ అధికార పార్టీకి కొమ్ము కాయం తగదన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు రుణాలు అందడం లేదని.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.56వేల కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ పంపిణీ రూ.16వేల కోట్లు మించలేదన్నారు. రుణమాఫీ పేరిట చంద్రబాబు రైతులతో పాటు డ్వాక్రా మహిళలకు చుక్కలు చూపుతున్నారన్నారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నందుకే తరతరాలుగా తమ కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ కర్నూలు ఎమ్మెల్సీ స్థానం పదవీకాలం ఒక సంవత్సరం 10 నెలలు మాత్రమే ఉందని, ఈ పదవినీ దక్కించుకునేందుకు బలం లేకపోయినా అధికార టీడీపీ అభ్యర్థిని బరిలో నిలిపిందన్నారు. దొంగ పని చేసిన చంద్రబాబు సమర్థించుకుంటున్న తీరు చూస్తే.. భవిష్యత్తులో చిల్లర దొంగలు కూడా కోర్టులను తప్పుదోవ పట్టించే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ పాలనను భ్రష్టు పట్టించి అవినీతి మార్గాలను అన్వేషించడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందన్నారు. కేసు నుంచి బయటపడేందుకు ఆ పార్టీ నేతలు సర్కస్ ఫీట్లు చేస్తున్నారన్నారు. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ కన్న తల్లి లాంటి పార్టీని కళ్లలో పెట్టుకుని చూసుకున్నప్పుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. అభ్యర్థి వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజాసంక్షేమానికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో డోన్, ప్యాపిలి, బేతంచెర్ల జెడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు, దిలిప్చక్రవర్తి, పద్మావతమ్మ, బేతంచెర్ల ఎంపీపీ కిష్టమ్మ, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ దివంగత నేత ఆర్ఈ రవికుమార్ సతీమణి ఆర్ఈ సరళమ్మ, కుమారుడు రాజవర్దన్లను నాయకులు పరామర్శించారు. -
ముల్కనూర్ బ్యాంకు పనితీరు భేష్
ఏపీ పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డి భీమదేవరపల్లి: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ముల్కనూర్ బ్యాంకు పనితీరు అభినందనీయమని ఏపీ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండ లం ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకును ఆదివారం ఆయన పరిశీలించారు. బ్యాంకు అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, జనరల్ మేనేజర్ మార్పాటి లక్ష్మారెడ్డి బ్యాంకు పనితీరును పవర్ పారుుంట్ ప్రజంటేషన్ ద్వారా భూమాకు వివరించారు. అనంతరం బ్యాంక్ ఆర్థిక లావాదేవీలను రికార్డుల ద్వారా చూపించారు. బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేస్తున్న పారాబాయిల్డ్ రైస్మిల్, కాటన్ జిన్నింగ్ ప్లాంట్, సూపర్బజార్, పెట్రోల్ బంక్లను పరిశీలించారు. అనంతరం ముల్కనూర్ స్వకృషి డెయిరీని పరిశీలించారు. డెరుురీ పనితీరును అధ్యక్షురాలు కడారి పుష్పలీల, జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్రెడ్డి భూమా నాగిరెడ్డికి వివరించారు. -
చెత్తబుట్టలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో
నంద్యాల : ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చంద్రబాబునాయుడు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి సింగపూర్, జపాన్ పర్యటనలను కొనసాగిస్తున్నారని పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి విమర్శించారు. గురువారం నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో సమ్మెలో ఉన్న కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. అయితే సహచర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 43 శాతం ఫిట్మెంట్ను ఆర్టీసీ కార్మికులను ఎందుకు అమలు చేయలేకపోతున్నారని భూమా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆరు సంవత్సరాల పాలనలో రెండు దఫాలుగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచిన విషయాన్ని భూమా గుర్తు చేశారు. 2004 ఎన్నికలకు ముందే ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని బాబు ఆలోచించిన విషయాన్ని భూమా వారికి గుర్తు చేశారు. రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్న కార్మికులకు 43శాతం ఫిట్మెంట్ను ఇవ్వాలని జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేస్తున్న విషయాన్ని వారి దృష్టికి తెచ్చారు. సమావేశంలో జేఏసీనేత ఖాన్ మాట్లాడుతూ సమ్మెలో పాల్గొంటున్న కార్మికులను పోలీసులు వేధిస్తున్నారని ఇప్పటికే అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భూమా అండగా నిలువాలని కోరారు. -
ప్రభుత్వమే బాధ్యత వహించాలి : భూమా
నంద్యాల(కర్నూలు జిల్లా) : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న క్రమంలో శుక్రవారం జరగనున్న ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని, ఒక వేళ విఫలమైతే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు. ఎంసెట్కు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను దృష్టిలో ఉంచుకొని విద్యార్ధులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. -
మాగోడు వినండయ్యా..
పునరావాస కాలనీల్లో పీఏసీ చైర్మన్ భూమా పర్యటన సమస్యలు ఏకరువు పెట్టిన కాలనీవాసులు ముత్తుకూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి మంగళవారం కృష్ణపట్నం పోర్టు పునరావాస కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. మత్స్యకారుల సమస్యలను సావధానంగా ఆలకించారు. పునరావాస కాలనీల్లో నిర్వాసితుల కోసం ఏర్పాటైన సీవీఆర్ ఆసుపత్రి(మాధవ చికిత్సాలయం)ని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ఆర్వో ప్లాంటును పరిశీలించారు. మండుటెండలో పాదయాత్ర ద్వారా కాలనీలో నిర్మించిన రోడ్లు, ఇరువైపులా నాటిన చెట్లు, డ్రెయిన్లు, ఆలయాలను తిలకించారు. మధురానగర్లో సీవీఆర్ పాఠశాలను పరిశీలించారు. సమస్యలను విన్నవించిన నజిరీనా పునరావాస కాలనీలోని పాదర్తిపాళేనికి చెందిన నజిరీనా అనే మహిళ పలు సమస్యలను భూమా నాగిరెడ్డికి విన్నవించింది. ఆమెతోపాటు ఆ ప్రాంతవాసులు తమ గోడును వెల్లిబుచ్చారు. ఉప్పు సాగు నిలిచిపోవడంతో ఉపాధి దొరక్క బతుకు భారంగా మారిందన్నారు. ప్రాజెక్టుల నుంచి కొందరు పెద్దలు మాత్రమే లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కృష్ణపట్నం గ్రామంలో జెన్కో ప్రాజెక్టు అందజేస్తున్న ప్యాకేజీని ఇతర ప్రాజెక్టుల నుంచి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ గ్రామాల కాపులు ఈ సందర్భంగా పలు సమస్యలు, డిమాండ్లను భూమా దృష్టికి తీసుకొచ్చారు. ఆర్ అండ్ ఆర్ యాక్ట్ ప్రకారం నిర్వాసితులకు అంద వలసిన ప్రతి సదుపాయాన్ని ప్రభుత్వంతో చర్చిస్తామని భూమా హామీ ఇచ్చారు. అవసరమైతే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధనరెడ్డి, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ గండవరం సూరి ఉన్నారు. -
భూమా పిటిషన్పై స్పందించిన హైకోర్టు
ప్రతివాదులకు నోటీసులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: నంద్యాల పట్టణంలో రోజు రోజుకు ఊర పందుల సంఖ్య పెరిగిపోతోందని, వీటిని ఆరికట్టేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానిక శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులుగా ఉన్న నంద్యాల మునిసిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలో పందుల సంఖ్య పెరిగిపోతోందని, దీని వల్ల స్వైన్ఫ్లూ, డెంగ్యూ తదితర ప్రమాదకర వ్యాధులు ప్రబలుతున్నప్పటికీ అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదంటూ భూమా నాగిరెడ్డి గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున పి.నాగేందర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, పట్టణం చుట్టపక్కల దాదాపు 8వేల పందులు రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరుగుతూ ట్రాఫక్ తీవ్ర ఇబ్బందులు సష్టిస్తున్నాయని తెలిపారు. వీటి వల్ల ముఖ్యంగా వానా కాలంలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని వివరించారు. పందులను చంపేందుక బుల్లెట్లు కొనుగోలు చేసేందుకు జిల్లా కలెక్టర్ను పురపాలక కమిషనర్ అనుమతి కోగా, కలెక్టర్ అనుమతి నిరాకరించారని, దీంతో జిల్లా ఎస్పీ కూడా అనుమతిని ఇవ్వలేదని తెలిపారు. దీని వల్ల పందుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, పందులను చంపడానికి బదులు వాటిని జనావాసాలకు దూరంగా ఉంచడం మేలని అభిప్రాయపడింది. పందుల వల్ల వ్యాధులు వస్తున్న మాట నిజమేనని, అయితే పర్యావరణ సమతుల్యతను కాపాడంలో పందుల పాత్ర కూడా ఉందని, అందువల్ల వాటిని జనావాసాలకు దూరంగా ఉంచాలని వ్యాఖ్యానిస్తూ విచారణను వాయిదా వేసింది. -
మంచి మనసున్న మనిషి శోభ: భూమా నాగిరెడ్డి
-
నంద్యాల పేరు గొప్ప...ఊరు దిబ్బ
-
కాగ్ అభ్యంతరాలపై వివరణలివ్వండి: భూమా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో వివిధ పథకాల అమలు తీరు, నిధుల వినియోగంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఎప్పటికప్పుడు వివరణలు ఇవ్వాలని ప్రజా పద్దుల సమితి(పీఏసీ) చైర్మన్ భూమా నాగిరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ కమిటీ హాలులో బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతోనూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీ ప్రాధామ్యాలను చైర్మన్ భూమా అధికారులకు వివరించారు. సమావేశంలో ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధనరెడ్డి(వైఎస్సార్సీపీ), తోట త్రిమూర్తులు, పీవీజీఆర్ నాయుడు(టీడీపీ), విష్ణుకుమార్ రాజు (బీజేపీ), పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, ఇటీవలే టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే ఫిబ్రవరి 5న పీఏసీ విశాఖపట్నం వెళ్లనుంది. 6న భీమిలిలో ఏర్పాటు చేసిన పర్యాటక రిసార్టులపై వచ్చిన ఆడిట్ అభ్యంతరాలను స్వయంగా పర్యవేక్షించనుంది. అనంతరం, గంగవరం నౌకాశ్రయం ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల అమలు తీరును సమీక్షిస్తుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో హైదరాబాద్లో సమావేశమై నీటిపారుదల, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం తదితర శాఖలపై కూడా సమీక్షించనున్నట్లు తెలిసింది. కాగా, గురువారం జరగాల్సిన రెండోరోజు పీఏసీ భేటీ రద్దయింది. -
విఐపి రిపోర్టర్ - నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి
-
పీఏసీ అలంకారప్రాయం కావొద్దు
ప్రజా పద్దుల కమిటీ తొలి భేటీలో స్పీకర్ కోడెల హితవు కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన భూమా సాక్షి, హైదరాబాద్: ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) అలంకారప్రాయం కాకూడదని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అరికట్టడంలో సమితి క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. పీఏసీ తొలి సమావేశాన్ని కోడెల శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు, పనుల్లో ఏైదె నా అవినీతి జరిగినట్లు కమిటీ పరిశీలనకు వస్తే ప్రభుత్వంతోపాటు అసెంబ్లీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సభ్యులు క్రియాశీలంగా వ్యవహరించాలన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కానీయొద్దు కమిటీ చైర్మన్గా భూమా నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ కమిటీలన్నింటిలో పీఏసీ కీలకమైందన్నారు. ప్రజాధనం ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా ప్రయత్నిద్దామన్నారు. అందుకు అందరి సహకారం కావాలన్నారు. అందరూ ఒక బృందంగా పనిచేద్దామన్నారు. వైఎస్సార్ సీపీ సభ్యుడు ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ గత పీఏసీలో కూడా తాను సభ్యుడినని, అపుడు నిర్వహించిన సమావేశాలకు అధికారులు సక్రమంగా హాజరయ్యేవారు కాదని, శాఖాపరమైన సమీక్షలు సక్రమంగా జరగాలంటే అధికారుల హాజరు తప్పనిసరని అన్నారు. శాసనసభ సచివాలయ ప్రభుత్వ అధికారులు సక్రమంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సభ్యులందరం కలిసి పనిచేసి అవినీతిని అరికట్టేందుకు ప్రయత్నిద్దామన్నారు. కమిటీ ఆషామాషీగా కాకుండా గట్టిగా పని చేయాలన్నారు. బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పీఏసీ స్థాయిని పెంచేందుకు సభ్యులందరం కలిసి ప్రయత్నిద్దామన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అరికడదామన్నారు. అసెంబ్లీ కార్యదర్శి కె. సత్యనారాయణ మాట్లాడుతూ కమిటీ సమావేశానికి రెండు వారాల ముందు తమకు సమాచారం అందిస్తే అన్ని శాఖల అధికారులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కాకాణి గోవర్ధనరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, తోట త్రిమూర్తులు, బీకే పార్థసారథి, పీవీజీఆర్ నాయుడు, ఎంవీఎస్ శర్మ, శమంతకమణి, రుద్రరాజు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. -
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా భూమా ప్రమాణం
-
'ముస్లిం, మైనార్టీలపై టీడీపీకి ప్రేమ లేదు'
హైదరాబాద్ : రాష్ట్రంలోని ముస్లిం, మైనార్టీ వర్గాలపై టీడీపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో భూమా మాట్లాడుతూ... రాష్ట్రంలో హజ్హౌస్ భవనం శంకుస్థాపనకే పరిమితమైందని విమర్శించారు. భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే హజ్ హౌస్ నిర్మాణాన్ని గుంటూరు నగరంలో చేపట్టాలని నగర తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు నగరం రాజధాని అతి సమీపంలో ఉండటమే కాకుండా రైలు, రహదారి, వాయు మార్గాలకు అతి సమీపంలో ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో హౌజ్ హౌస్ గుంటూరులో ఏర్పాటు చేయాలని తెలిపారు. -
ప్రజాపోరాటాలకు వెనుకాడేది లేదు: భూమా
-
హామీలపై నిలదీస్తామనే మా నేతలపై కేసులు : జ్యోతుల
అన్నవరం : ఎన్నికల హామీలను అమలు చేయని మోసంపై ప్రజల తరఫున నిలదీస్తామన్న భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఆదివారం ఆయన విశాఖపట్నం వెళుతూ సత్యదేవుని తొలిపాంచా వద్ద సత్యదేవునికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మొన్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని హత్య కేసుతో అరెస్టు చేశారని, నిన్న పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారథిపై కేసులు బనాయించారని ఆరోపించారు. ఎన్ని విధాలుగా భయభ్రాంతులను చేసినా ప్రభుత్వ వైఫల్యాలను జగన్ నాయకత్వంలో శాసనసభలో నిలదీసి తీరతామని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఆయన వెంట పార్టీ నాయకులు గొల్లపల్లి బుజ్జి, కొండపల్లి అప్పారావు, దడాల సతీష్, రాయి శ్రీనివాస్, బీఎస్వీ ప్రసాద్, వెదురుపాక మూర్తి, బొబ్బిలి వెంకన్న, తాటిపాక కృష్ణ తదితరులున్నారు. -
భూమా నాగిరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ
కర్నూలు: వైఎస్ఆర్ సీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బెయిల్ పిటిషన్ను జిల్లా సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఈ నెల 1వ తేదీన అరెస్ట్ అయిన నాగిరెడ్డి ఆనారోగ్యం కారణంగా ప్రస్తుతం నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. నాటకీయ పరిణామాల మధ్య భూమా నాగిరెడ్డిని ఈ నెల 1వ తేదీ శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల పురపాలక సంఘం సమావేశం సందర్భంగా ప్రజా సమస్యలపై తన ప్రసంగాన్ని వినాల్సిందేనని.. డోర్ వేయమని భూమా సైగ చేసినందువల్లే వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు శుక్రవారం(గత నెల 31) టీడీపీ కౌన్సిలర్లపై దాడులకు పాల్పడ్డారని పేర్కొంటూ భూమాపై మూడు కేసులు నమోదు చేశారు. భూమా ప్రోత్సాహంతోనే దాడులు జరిగాయని పేర్కొంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని, లొంగిపోవాలని ఎస్పీ హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వెంట రాగా భూమా శనివారం స్వయంగా ఎస్పీ రవికృష్ణ వద్ద లొంగిపోయారు. అదే రోజు రాత్రి ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్ ఎదుట భూమా నాగిరెడ్డిని పోలీసులు హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్కు ఆదేశించారు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు శనివారం రాత్రి భూమాని స్థానిక మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మంగళవారం మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. ** -
సమస్యలపై పోరాడితే దొంగ కేసులా?
-
ప్రజా సమస్యలపై పోరాడితే దొంగ కేసులా?
సాక్షి, హైదరాబాద్: సమస్యలపై ప్రజల తరపున ఎవరైతే పోరాడుతున్నారో వారిని నిర్వీర్యం చేసే విధంగా దొంగ కేసులు పెట్టే స్థాయికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారి పోయారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు గద్దె నెక్కిన తరువాత అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టిన వారిలో భూమా నాగిరెడ్డి నాలుగో ఎమ్మెల్యే అని చెప్పారు. నంద్యాల పోలీసుల అక్రమ కేసులకు గురై రిమాండ్ ఖైదీగా ఉంటూ ‘నిమ్స్’లో చికిత్స పొందుతున్న పీఏసీ చైర్మన్ భూమా నాగిరెడ్డిని జగన్ గురువారం మధ్యాహ్నం పరామర్శించారు. పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలసి ఆసుపత్రికి వచ్చిన జగన్ కొద్దిసేపు భూమాతో గడిపి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులతో కూడా మాట్లాడారు. అనంతరం ఆయన నిమ్స్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రజల తరఫున పోరాడుతున్న తమ ఎమ్మెల్యేలు ఆర్.కె.రోజా(నగరి), సునీల్ (పూతలపట్టు), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల)పై వరుసగా తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో పట్టణంలో రోడ్ల వెడల్పునకు సంబంధించిన సమస్యలపై ఎమ్మెల్యే హోదాలో భూమా నాగిరెడ్డి ప్రస్తావించకుండా అధికారపక్షం వారు అడ్డుకుని గొడవ సృష్టించారని చెప్పారు. ఆ చిన్న గొడవను హత్యాయత్నం వంటి దారుణమైన కేసుగా మలిచారంటే ఎలాంటి పరిస్థితుల్లోకి వ్యవస్థను తీసుకెళుతున్నారో అర్థమవుతుందన్నారు. ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులను ఇలా ఇబ్బందులు పెట్టడం తగదన్నారు. నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఇదే అంశంపై విలేకరులకు అన్ని విషయాలు చెబుతారని కూతురు లాంటి ఆమె ఆవేదన విన్న తరువాతనైనా బాబుకు బుద్ధి వస్తుందని భావిస్తున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భూమాపై రౌడీ షీటుకు సంబంధించి కోర్టులో పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. -
'అధికారం అండతో మా ఎమ్మెల్యేలపై కేసులు'
-
'అధికారం అండతో మా ఎమ్మెల్యేలపై కేసులు'
హైదరాబాద్ : అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై కేసులు బనాయిస్తున్నారని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల తరపున పోరాడుతున్న వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన గురువారమిక్కడ అన్నారు. పార్టీలో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. నగరి ఎమ్మెల్యే రోజా, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి...తాజాగా భూమా నాగిరెడ్డిపై కూడా కేసులు పెట్టారని గుర్తు చేశారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న భూమా నాగిరెడ్డిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి దిగజారారో భూమా నాగిరెడ్డి అరెస్ట్ వ్యవహారంతో అర్థం అవుతోందన్నారు. భూమా సహా నలుగురు ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. సమస్యలపై భూమా మున్సిపల్ సమావేశంలో మాట్లాడుతుంటే టీడీపీ సభ్యులే గొడవ సృష్టించారన్నారు. భూమాపై ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా అన్యాయంపై తమ పోరాటం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. -
భూమా నాగిరెడ్డిని పరామర్శించిన వైఎస్ జగన్
హైదరాబాద్ : నిమ్స్లో చికిత్స పొందుతున్న నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గురువారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వైఎస్ జగన్ ఆరా తీశారు. భూమా ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతలు బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. నంద్యాల మున్సిపల్ సమావేశంలో గొడవ కేసులో భూమాను స్థానిక పోలీసులు ఈనెల ఒకటిన అరెస్ట్ చేశారు. రిమాండ్లో ఉన్న ఆయనను వెంటనే వైద్యం కోసం స్థానిక మెడికేర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. -
హైదరాబాద్ నిమ్స్లో భూమా నాగిరెడ్డి
* ఛాతీలో నొప్పి రావడంతో కర్నూలుకు తరలించిన పోలీసులు * వైద్యుల సూచన మేరకు నిమ్స్కు తరలింపు హైదరాబాద్/కర్నూలు: టీడీపీ నేతలు బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన వైఎస్సార్సీపీ ముఖ్య నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు పోలీసులు మంగళవారం రాత్రి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ పాత భవనం ఐసీపీయూ బెడ్ నెంబర్ 6లో అడ్మిట్ చేశా రు. వైద్యులు ఆయన ఛాతీని ఎక్స్రే తీశారు. నంద్యాల మున్సిపల్ సమావేశంలో గొడవ కేసులో భూమాను స్థానిక పోలీసులు ఈనెల ఒకటిన అరెస్ట్ చేశారు. రిమాం డ్లో ఉన్న ఆయనను వెంటనే వైద్యం కోసం స్థానిక మెడికేర్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు మంగళవారం ఛాతీలో నొప్పి రావడంతో పోలీసులు మధ్యాహ్నం 3.25 గంటలకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. గుండె వ్యాధుల చికిత్స విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయిం చారు. ఇదే విషయాన్ని పోలీసు అధికారులకు వివరించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్రెడ్డి వైద్యులతో మాట్లాడారు. సాయంత్రం 6.20 గంటలకు కార్డియాలజీ ఐసీసీయూ విభాగం నుంచి వీల్చైర్లో బయటికి వచ్చిన భూమానాగిరెడ్డిని అంబులెన్స్లో పోలీసు ఎస్కార్ట్తో హైదరాబాద్కు తరలించారు. -
రౌడీషీట్లతో రాక్షస పాలన: జ్యోతుల
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించడం, రౌడీషీట్లు పెట్టడం ఏపీ సీఎం చంద్రబాబు రాక్షసపాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ధ్వజ మెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు రౌడీ రాజ్యాన్ని స్థాపించాలని చూస్తున్నారన్నారు. ఆ ప్రయత్నాన్ని తమ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్కె రోజాపై అక్రమ కేసులు పెట్టి వేధించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచీ ప్రతిపక్షాన్ని నిర్మూలించాలని చూస్తున్నారని జ్యోతుల అన్నారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టారని, దైవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన మహిళా ఎమ్మెల్యే ఆర్కె రోజా అడ్డుకోవడమే కాకుండా ఆమెపైనే కేసు పెట్టడం దురదృష్టకరమన్నారు. -
అధికార మదంతో వేధిస్తోంది
టీడీపీపై వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి ధ్వజం సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రతిపక్షం మీద టీడీపీ వేధింపులపై రాబోయే నాలుగున్నరేళ్లలో ప్రణాళికాబద్ధంగా నిరసన తెలియజేద్దామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికార మదంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తోందన్నారు. కర్నూలు జిల్లాలోనూ భూమా నాగిరెడ్డిపై అనవసరంగా కేసులు బనాయించారన్నారు. నంద్యాల పురపాలక సంఘం సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు నాగిరెడ్డి ప్రయత్నిస్తే అధికార పార్టీ ఆయనపై అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు చేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాయి దావేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ రైతు, మహిళా వ్యతిరేక విధానాలపై ఈ నెల 5న పార్టీ తలపెట్టిన మండలస్థాయి ధర్నాలను విజ యవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమస్యలపై నిలదీస్తున్నందుకే:ఉమ్మారెడ్డి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపుతో అక్రమ కేసులను బనాయించ డం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని టీడీపీ ప్రభుత్వం... వాటిని నిలదీస్తున్నందుకే వేధిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వేధింపులకు, కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా ఇన్చార్జి భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. -
భూమా నాగిరెడ్డి అరెస్టు
రెండు హత్యాయత్నం.. ఒక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు సాక్షి, కర్నూలు: నాటకీయ పరిణామాల మధ్య నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల పురపాలక సంఘం సమావేశం సందర్భంగా ప్రజా సమస్యలపై తన ప్రసంగాన్ని వినాల్సిందేనని.. డోర్ వేయమని భూమా సైగ చేసినందువల్లే టీడీపీ కౌన్సిలర్లపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు శుక్రవారం దాడులకు పాల్పడ్డారని పేర్కొంటూ భూమాపై మూడు కేసులు నమోదు చేశారు. శనివారం రాత్రి 7.15 గంటల ప్రాంతంలో ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్ ఎదుట భూమా నాగిరెడ్డిని పోలీసులు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్కు ఆదేశించారు. వివరాలివీ.. శుక్రవారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ కౌన్సిలర్లు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులు భూమా ప్రోత్సాహంతోనే జరిగాయని పేర్కొంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వారు భూమాను అరెస్టు చేసేందుకు ప్రయత్నించడం.. రాత్రి ఆయన ఇంటిని తనిఖీ చేయడం జరిగాయి. భూమా ఇంట్లో లేకపోవడంతో.. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని, లొంగిపోవాలంటూ ఎస్పీ హెచ్చరించారు. శనివారం ఉదయం భూమా నాగిరెడ్డి స్వయంగా ఎస్పీ వద్దకు వస్తున్నారని తెలియడంతో పట్టణమంతా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసి పోరుుంది. ఇదే సమయంలో శనివారం కర్నూలులో జరగాల్సిన జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని రద్దుచేసుకుని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, గౌరు చరితారెడ్డి, గుమ్మనూరు జయరాం, మణిగాంధీ, భూమా అఖిలప్రియ, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిలు మధ్యాహ్నం నంద్యాలలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకున్నారు. అక్కడే ఉన్న నాగిరెడ్డితో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాలం బాబు నేతృత్వంలో విద్యార్థులు నంద్యాలకు తరలివచ్చారు. వారితో కలిసి నాగిరెడ్డి అక్కడి నుంచి బయలుదేరి 1.35 గంటలకు డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవికృష్ణతో సమావేశమయ్యారు. మీరు సైగ చేయడం వల్లే దాడులు: ఎస్పీ శుక్రవారం జరిగిన సంఘటనలకు మీరు బాధ్యత వహించాల్సిందేనంటూ.. తలుపులు మూయమని వైఎస్సార్ సీపీ శ్రేణులకు మీరు చెప్పడం వల్లే దాడులు జరిగాయని, ఫ్యాక్షన్ను ప్రోత్సహించేలా మీ ప్రవర్తన ఉందంటూ ఎస్పీ రవికృష్ణ వాదించారు. దీన్ని ఎమ్మెల్యే నాగిరెడ్డి ఖండించారు. టీడీపీ కౌన్సిలర్లే తమ దాడులకు పాల్పడ్డారని చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యహరించాలని, రెండు వైపులా సమగ్ర విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఎస్పీని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కోరారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారించిన ఎస్పీ ఎట్టకేలకు నాగిరెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేశామని, అదేవిధంగా కులం పేరుతో దూషించారనే కారణంగా నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉందని తెలిపారు. మెడికేర్కు భూమా నంద్యాల టౌన్: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని జడ్జి ఆదేశాల మేరకు శనివారం రాత్రి పోలీసులు స్థానిక మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. భూమా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని. గుండె దడ కూడా ఉందని డాక్టర్ డేవిడ్రాజ్ నేతృత్వంలోని వైద్య బృందం నివేదిక అందజేసింది. అనంతరం, పోలీసులు ఆయనను జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్ ఎదుట హాజరు పరిచారు. వైద్య పరీక్షలను పరిశీలించిన అనంతరం భూమాకు ఈ నెల 16 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మెడికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి అనుమతించారు. తప్పుడు కేసులు బనారుుంచారు: భూమా ‘నా మీద ఈ రోజు 3 కేసులు బనాయించారు. మేం ఎంత చెప్పినా కూడా అన్ని విధాలా ఆలోచించే కేసులు పెట్టామని పోలీసులు అంటున్నారు. నన్ను, వైఎస్సార్ సీపీని ఇబ్బందులు పెట్టేందుకే కేసులు పెట్టారు. మానసికంగా ఒత్తిడికి గురి చేసేందుకే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. కేసులు పెట్టినా బాధపడేది లేదు. ప్రజా సంక్షేమానికి ఏ శిక్షకైనా సిద్ధమే’ అని నాగిరెడ్డి అన్నారు. ఎస్పీని కలిసిన అనంతరం మీడియా తో మాట్లాడారు. తమ పార్టీ కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. -
బాబూ ... మా పార్టీ అంటే ఎందుకంత భయం
హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలన రాక్షస పాలనను గుర్తు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని ఆయన అభివర్ణించారు. శనివారం హైదరాబాద్లో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయాలనే ప్రయాత్నంలో భాగంగానే భూమా నాగిరెడ్డిపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. మీ తప్పులను వేలేత్తి చూపిన మా పార్టీ వారిపై అక్రమకేసులు బనాయిస్తారా? ఇది రాక్షసపాలన కాక మరేమంటారని వెల్లడించాలని అధికార టీడీపీని డిమాండ్ చేశారు. ఒక విద్యార్థి మృతికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కుమారుడు సిద్దార్ద కారకుడంటూ మీడియాలో కథనాలు వచ్చిన తర్వాతే అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇది వాస్తవం కాదా అని జ్యోతుల నెహ్రు సూటిగా ప్రశ్నించారు. అయినా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకంత భయమో అర్థం కావడం లేదని చంద్రబాబును ఉద్దేశించి జ్యోతుల నెహ్రు వ్యాఖ్యానించారు. -
భూమాపై ‘హత్యాయత్నం’ కేసు
నంద్యాల మునిసిపల్ కౌన్సిల్లో రసాభాస.. ప్రతిపక్షంపై టీడీపీ సర్కారు మరో కక్షసాధింపు చర్య నంద్యాల: ప్రతిపక్ష పార్టీని వేధించేందుకు ఎలాంటి అవకాశం దొరుకుతుందా అని వేచిచూస్తున్న అధికార టీడీపీ సర్కారు.. అందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో చోటుచేసుకున్న స్వల్ప తోపులాట, ఘర్షణ నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై.. హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేసి అరెస్టు చేసేందుకూ సిద్ధపడింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు రాత్రికి రాత్రి ఆయన ఇంటివద్ద పోలీసులను మోహరించింది. కర్నూలు జిల్లా నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ శుక్రవారం టీడీపీకి చెందిన మునిసిపల్ చైర్పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన సమావేశమైంది. వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ అనూష సమావేశానికి గైర్హాజరు కావడంతో ఆమె స్థానంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వాకా శివశంకర్, మరో కౌన్సిలర్ కృపాకర్ కూర్చున్నారు. వారు వెనుక కుర్చీలోకి వెళ్లాలని టీడీపీ కౌన్సిలర్లు గొడవకు దిగారు. శివశంకర్ సమాధానం చెబుతుండగానే.. ఆయనను సస్పెండ్ చేస్తానంటూ చైర్మన్ హెచ్చరించారు. ఇంతలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సమావేశానికి హాజరయ్యారు. వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నంలో భాగంగా శివశంకర్ను వెనుక కుర్చీలో కూర్చోవాలని సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఎజెండాలోని అంశాలపై చర్చ జరగకుండానే సమావేశం ముగిసిందని చైర్మన్ ప్రకటించారు. భూమా నాగిరెడ్డి కల్పించుకుని తాను పట్టణ సమస్యలపై చర్చించాల్సి ఉందని పట్టుబట్టి మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే చైర్మన్ మరోసారి సమావేశం ముగిసిందని బెల్ కొట్టడమే కాకుండా.. ఆమె భర్త, కోఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్రెడ్డి.. ఎమ్మెల్యే ప్రసంగం వినాల్సిన అవసరం లేదని టీడీపీ కౌన్సిలర్లను ఆదేశించారు. దీనికి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేయటంతో వారితో టీడీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. టీడీపీ వర్గీయులు దాడికి దిగటంతో పరిస్థితి కుర్చీలు విసురుకునే వరకు వెళ్లింది. ఎమ్మెల్యే భూమా సర్దిచెప్పబోయినా ఫలితంలేకపోయింది. ఘటనలో వైఎస్ఆర్సీపీకి చెందిన మైనార్టీ కౌన్సిలర్లు ముర్తుజా, కరీముల్లా గాయపడ్డారు. టీడీపీకి చెందిన వెంకటసుబ్బయ్య, మునిసిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్లకూ గాయాలయ్యాయి. చైర్మన్, మునిసిపల్ కమిషనర్ చాంబర్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అంతకుముందు చైర్పర్సన్, టీడీపీ కౌన్సిలర్లు ఏఎస్పీ సన్ప్రీత్సింగ్కు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రవికృష్ణ నంద్యాల చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అధికార పార్టీ నేతల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి భూమాను అరెస్టు చేయడానికి వారెంట్ తీసుకొని పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేనందున ఇంటి వద్దే కాపు కాశారు. హక్కులను కాలరాస్తున్నారు: భూమా శాసనసభ్యుని హక్కులను కాలరాస్తున్న మునిసిపల్ చైర్మన్ దేశం సులోచనపై, అధికారులపై శాసనసభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు. -
భూమా నాగిరెడ్డి ఇంటి వద్ద పోలీసు బలగాలు
కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇంటి వద్ద శుక్రవారం రాత్రి భారీగా పోలీసులను మోహరించారు. జిల్లాలోని నంద్యాల పురపాలక సమావేశంలో జరిగిన ఘర్షణకు భూమానే ప్రధాన కారణమని టీడీపీ తప్పుడు ఫిర్యాదు చేయడంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. తొలుత ఆ సమావేశంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లతో టీడీపీ కౌన్సిలర్లు వాగ్వావాదానికి దిగడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఒక పద్దతి ప్రకారం జరగాల్సిన కౌన్సిల్ సమావేశంలో రసాభసాగా మారి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. టీడీపీ కౌన్సిలర్లు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లపై దాడి చేసినా.. జిల్లాలో టీడీపీ ఆధిపత్య ధోరణి కాస్తా ఘర్షణకు కారణమైంది. అధికార టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సహా ఇద్దరికి గాయాలయ్యాయి. చర్చ లేకుండా తీర్మానాలు ఆమోదిస్తుడడంతో వైఎస్సార్ సీపీ కౌన్సెలర్లు అభ్యంతరం చెప్పారు. వైఎస్సార్ సీపీ సూచనను చైర్మన్ పెడచెవిన పెట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేకుంది. టీడీపీ నాయకులు కుర్చీలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గన్ మెన్ కూడా గాయపడ్డాడు. అయితే సమావేశంలో జరిగిన ఘర్షణకు భూమా నాగిరెడ్డే కారణమని టీడీపీ తప్పుడు కేసులు బనాయించేందుకు యత్నాలు చేస్తోంది. -
నంద్యాల కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ
-
నంద్యాల కౌన్సిల్ సమావేశంలో ఘర్షణ
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల కౌన్సిల్ సమావేశం ఘర్షణ చోటు చేసుకుంది. అధికార టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సహా ఇద్దరికి గాయాలయ్యాయి. చర్చ లేకుండా తీర్మానాలు ఆమోదిస్తుడడంతో వైఎస్సార్ సీపీ కౌన్సెలర్లు అభ్యంతరం చెప్పారు. వైఎస్సార్ సీపీ సూచనను చైర్మన్ పెడచెవిన పెట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేకుంది. టీడీపీ నాయకులు కుర్చీలతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గన్ మెన్ కూడా గాయపడ్డాడు. పరిస్థితి ఉద్రికత్తంగా మారడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు.