ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ సుజల పథకం నిర్వహణకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ రఘునందనరావు పిలుపునిచ్చారు.
విజయవాడ : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ సుజల పథకం నిర్వహణకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ రఘునందనరావు పిలుపునిచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువరం ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకంపై జిల్లా అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలతో ఆయన సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒకటి చొప్పున అక్టోబర్ 2న ప్రారంభించేందుకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రజల తాగునీటి సమస్యపై దృష్టి సారించి ప్రతి ఇంటికి రూ.2 లకే 20 లీటర్ల మంచినీటిని అందించాలని నిశ్చయించారన్నారు. ఈ పథకంలో భాగంగా ఆగస్టు 30వ తేదీన విధి విధానాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులను చేస్తామని తెలిపారు. ఫేజ్-1లో ఐదు వేల గ్రామాల్లో ఈ పథకం ప్రారంభించాలని నిర్ణయించగా, జిల్లాలో 513 గ్రామాలను మొదటి దశకు ఎంపిక చేశామన్నారు. జిల్లాలో 221 ఆర్వో ప్లాంట్స్, ఒక ఇడియఫ్ ప్లాంట్స్, 291 అల్ట్రా ఫిల్ట్రేషన్ గ్రావిటి ఫిల్టర్ ప్లాంట్ల ఆవశ్యకత ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అమరేశ్వరరావు తెలిపారు.
కలెక్టర్ పిలుపునకు స్పందన ....
సమావేశంలో ఈ పథకాన్ని ప్రారంభించి రాష్ట్రానికే ఆదర్శ జిల్లాగా నిలపాలని ఇచ్చిన కలెక్టర్ పిలుపునకు నూజివీడు, తిరువూరు, గన్నవరం, జగ్గయ్యపేట, కైకలూరు, పెడన, మచిలీపట్నం, గుడివాడ, ఇబ్రహీంపట్నం తదితర నియోజకవర్గాల పరిధిలో ప్లాంట్ల నిర్వాహణకు సంబంధించి ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల తరఫున హాజరైన ప్రతినిధుల ద్వారా ప్రకటించారు. జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, జిల్లా పంచాయితీ అధికారి కె.చంద్రశేఖర్, జిల్లా ఇండస్ట్రీస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.