
మాది రాష్ట్రాన్ని కాపాడే పోరాటం: వైఎస్సార్సీపీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చను ముగించడాని కంటే ముందే ఓటింగ్ నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం పునరుద్ఘాటించింది. వైఎస్సార్సీపీ నేతలు భూమన కరుణాకర్రెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, కె.శ్రీనివాసులు, కాటసాని రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి సోమవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. చర్చ పూర్తయిన తర్వాత ఓటింగ్ నిర్వహిస్తే తెలంగాణ ఎమ్మెల్యేలు ఆ ప్రక్రియను అడ్డుకునే అవకాశాలున్నాయి కాబట్టే ముందు ఓటింగ్ నిర్వహించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. బిల్లుపై ఓటింగ్ ఉంటుందో లేదో ఎమ్మెల్యేలకు సైతం స్పష్టత లేని పరిస్థితి నెలకొందని, బిల్లుపై ఏ విధంగా ముందుకెళుతున్నారో కనీసం బీఏసీ సమావేశం నిర్వహించైనా సభ్యులకు చెప్పాల్సిన అవసరముందన్నారు.
తాము రాష్ట్రాన్ని కాపాడేందుకు పోరాడుతుంటే.. కాంగ్రెస్, టీడీపీ నేతలు మాత్రం తమ పార్టీలను కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటింగ్ నిర్వహిస్తే ఎలాంటి వైఖరి అనుసరించాలో స్పష్టత లేని కారణంగానే కాంగ్రెస్, టీడీపీలు తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. తమ పార్టీపై విమర్శలు చేసే బదులు విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో చంద్రబాబు ఎందుకు సూటిగా చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. అన్ని పార్టీలు రాజకీయాలను పక్కనపెట్టి సమైక్యాంధ్రప్రదేశ్ను కొనసాగించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. బిల్లుపై ముందుగా ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్ను వ్యూహాత్మకంగా నీరుగార్చారని చెప్పారు. సీఎం కిరణ్ సభా నాయకుడిగా ఓటింగ్ నిర్వహించాలని ఎందుకు పట్టుబట్టడంలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో బాబు మౌనంగా ఉండటంలో ఆంతర్యమేమిటని నిలదీశారు.