
కృష్ణాజిల్లా : అన్నా...కొల్లేరులోని చెరువులను ప్రభుత్వం ధ్వంసం చేయడంతో కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు జీవనాధారం కోల్పోయి వలస పోతున్నారు’ అని మండవల్లి మండలం చింతపాడు గ్రామానికి చెందిన ఎం. పద్మజ, లలిత, శ్యామల, కృష్ణకుమారి ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగడానికి నీరు కూడా లేదని ప్రభుత్వం ఏర్పాటుచేసిన పైపులైన్లో పది రోజులకొకసారి నీరు వస్తోందని వాపోయారు.
భూగర్భజలాలు కలుషితం కావడంతో పశువులను కూడా కబేళాలకు తరలిస్తున్నామని జననేత దృష్టికి తీసుకువచ్చారు. పిల్లల్ని చదివించే స్థోమత లేక కూలీ పనులకు పంపుతున్నామని వాపోయారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కూడా కల్పించలేదని జననేతకు వివరించారు. నాలుగేళ్లుగా నీటి సమస్య పరిష్కరించమని వినతిపత్రాలు అందజేసినా పాలకులు పట్టించుకోలేదని ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామం మొత్తం ఖాళీ అవుతుందని కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment