
నేను ఓడిపోయినా... ఇది మా ప్రభుత్వం
విజయవాడ: కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం వేదికగా స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఉప్పులేటి కల్పన, టీడీపీ నేత వర్ల రామయ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వివరాలు .... శనివారం కనుమూరు గ్రామంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికపై టీడీపీ నేత వర్ల రామయ్య తెగ హడావుడి చేస్తున్నారు. దీంతో అక్కడే కల్పన ఏ హోదాతో వేదిక ఎక్కారని రామయ్యను ప్రశ్నించారు.
దీంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ రామయ్య హడావుడి చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉంది మా ప్రభుత్వం. నేనే కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అది గుర్తుంచుకో అంటూ.. హెచ్చరించారు. అంతేకాదు రేపోమాపో నీవు కూడా మా పార్టీలోకే రావాల్సిందేనని అన్నారు. రామయ్య మాటలకు ఆగ్రహించిన కల్పన అనవసర వ్యాఖ్యలు చేయొద్దంటూ రామయ్యకు హితవు పలికారు. ఇటీవల పామర్రు శాసన సభకు జరిగిన ఎన్నికల్లో వర్ల రామయ్యపై ఉప్పులేటి కల్పన విజయం సాధించిన సంగతి తెలిసిందే.