
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం అభినందనీయమని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. జిల్లాలోని అనపర్తి జీబీఆర్ కళాశాలలో గురువారం జరిగిన ఒ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము చదువుకునే సమయంలో ఉచిత ఆంగ్ల మాధ్యమాం లేక ఇబ్బందులు పడ్డామని, సీఎం జగన్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ అన్ని చోట్ల ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, మూడు రాజధానులే ముద్దని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారని అన్నారు. చిన్న చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందని, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలు రాజధాని అవ్వాలని ఆనాడే పెద్దలు చెప్పారని పేర్కొన్నారు. అమ్మ తెలుగు భాష, నాన్న ఇంగ్లీష్ భాష అని అమ్మానాన్న కలయికే భాష అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రీ, మెట్రో ఎండీ ఎంవిఎస్ రెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే సూర్యానారాయణ తదితరులు పాల్గొన్నారు.