
నంద్యాల రిటర్నింగ్ అధికారిపై టీడీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : అధికారంలో ఉన్నామనే అహంకారంతో బెదిరింపులు, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ ఏకంగా ఎన్నికల సంఘంపైనే యుద్ధానికి దిగింది. నంద్యాల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై టీడీపీ ఫిర్యాదు చేసింది. సర్వేలు వద్దంటూ రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధాన అధికారికి శుక్రవారం టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
‘నంద్యాలలో సర్వేలు వద్దని రిటర్నింగ్ అధికారి ఎలా చెబుతారు. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు సర్వే చేయొద్దని ఎలా అంటారు. ఒపీనియన్ పోల్స్, సర్వేలు నిషేధించే అధికారం ఈసీకి లేదు. సర్వేలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసే పరిధి రిటర్నింగ్ అధికారికి లేదు. నంద్యాల రిటర్నింగ్ అధికారి ఆదేశాలు చట్ట వ్యతిరేకం.’ అంటూ టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని ఈ సందర్భంగా లేఖ ఇచ్చారు.
మరోవైపు నంద్యాలలో అధికారపార్టీ అక్రమాలకు పాల్పడుతోందని.. ఎన్నికల ప్రధాన అధికారి అనూప్ సింగ్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ బహిరంగంగానే డబ్బులు పంచారని ఫిర్యాదు చేశారు. టీడీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని.. స్థానిక డీఎస్పీని విధుల్లో నుంచి తప్పించి.. ఎన్నికల పరిశీలకుడిగా ప్రత్యేక అధికారిని నియమించాలని వైఎస్ఆర్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ ఎన్నికల ప్రధాన అధికారి అనూప్ సింగ్ను కోరారు.