
నందిగామలో గన్ తో దుండగుడి బీభత్సం
నందిగామ : కృష్ణాజిల్లా నందిగామలో సోమవారం ఓ వ్యక్తి రివాల్వర్తో బెదిరించి కలకలం సృష్టించాడు. ఓ వ్యాపారిని బెదిరించి అతని వద్ద నుంచి బంగారం దోచుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే కారులో (AP 31Q 3438) విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న సురేష్ కుమార్ అనే వ్యాపారిని సోమవారం ఉదయం ఓ వ్యక్తి గొల్లపూడి వద్ద లిప్ట్ అడిగాడు.
కోదాడలో దిగిపోతానని చెప్పటంతో లిప్ట్ ఇచ్చాడు. నందిగామ మండలం హనుమంతపాలెం సమీపంలో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీతో వ్యాపారిని బెదిరించి 3 బంగారపు ఉంగరాలు, గొలుసుతో పాటు నగదు దోచుకున్నాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ సెల్ఫోన్లో వ్యాపారి ఫోటో తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం పొలాల్లోకి పారిపోయినట్లు సమాచారం. ఈ సంఘటనతో భయభ్రాంతులకు గురైన వ్యాపారి నందిగామ డీఎస్పీ రాదేశ్ మురళికి ఫిర్యాదు చేశాడు.
కాగా బెదిరించి, దోపిడీకి పాల్పడిన వ్యక్తి...సిమీ కార్యకర్తగా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజా పరిణామాలతో నందిగామ-జగ్గయ్యపేట హైవేపై పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.