
మహారాష్ట్ర సీఎం నుంచి ఉత్తర్వులను అందుకుంటున్న టీటీడీ తిరుపతి జేఈఓ బసంత్ కుమార్
సాక్షి, ముంబై : దేశ ప్రముఖ నగరాల్లో ఒకటైన ముంబైలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం తూర్పు బాంద్రాలో 6,975 చదరపు అడుగుల స్థలాన్ని అంటే సుమారు 16 సెంట్ల మేరకు స్థలాన్ని కేటాయించింది. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అభ్యర్థన మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఇందులో భాగంగా తిరుపతి జేఈఓ బసంత్ కుమార్కు ముంబైలోని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో స్థల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులను ముంబై సబర్బన్ జిల్లా కలెక్టర్ మిలింద్బోరికర్ అందజేశారు. అలాగే ఇదే ప్రాంగణంలో శ్రీవారి ఆలయంతో పాటు సమాచార కేంద్రాన్ని కూడా టీటీడీ నిర్మించనుంది. దేశవ్యాప్తంగా శ్రీవారి దివ్యక్షేత్రాలను నిర్మించే దిశగా టీటీడీ కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ ముంగటివార్, టీటీడీ ఎస్టేట్ అధికారి విజయసారథి, డెప్యూటీ ఈఓ విశ్వనాథ్, స్థానిక సలహా మండలి సభ్యుడు వీ రంగనాథన్, డాక్టర్ గీతా కస్తూరి, సమీర్, కే మెహెతా తదితరులు పాల్గొన్నారు.