
సాక్షి,న్యూఢిల్లీ : దేశంలో ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాకు నెలానెలా కొంత మొత్తం ప్రభుత్వం సమకూర్చే విధానం కార్యాచరణకు నోచుకోనుంది. రానున్న రెండేళ్లలో సార్వత్రిక కనీస ఆదాయం (యూబీఐ) పథకాన్ని ఒకటి రెండు రాష్ట్రాలైనా అమలు చేస్తాయని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్నా పెద్దా, ధనిక..పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కనీస మొత్తం చెల్లించాలని 2016-17 ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. కాగా,వచ్చే రెండేళ్లలో ఒకట్రెండు రాష్ట్రాలు తప్పనిసరిగా యూబీఐని అమలుచేస్తాయని అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు.
పేదరిక నిర్మూలన కోసం ప్రస్తుతం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అవినీతిలో కూరుకుపోవడంతో వాటితో పోలిస్తే సార్వత్రిక కనీస రాబడి కింద అందే మొత్తం పౌరుల కనీస అవసరాలను చాలావరకూ తీర్చవచ్చనే అభిప్రాయం నెలకొంది. ఒకటి, రెండు రాష్ట్రాలు ఈ పథకాన్ని తలకెత్తుకున్నా వాటి ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా యూబీఐని దశలవారీగా విస్తరిస్తారు.