
ఆర్థిక సంవత్సరం మార్పుపై సలహాలకు ఆహ్వానం
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలోని పలు కంపెనీలు ప్రస్తుతం తమ ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ 1-మార్చి 31గా పాటిస్తున్నాయి. అయితే బడ్జెటరీ ప్రక్రియ మెరుగుకు, తగిన నగదు నిర్వహణకు ఈ కాలం మార్పు అవసరమని పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా సంబంధిత వర్గాల నుంచి సలహాలనూ, సూచనలను ఆహ్వానించింది. ఇందుకు సెప్టెంబర్ 30 వరకూ గడువు పెట్టింది.
ఇప్పటికే ఈ అంశంపై మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు శంకర అచార్య నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ డిసెంబర్ చివరినాటికి తన నివేదికను సమర్పించే వీలుంది. 1985లో ఎల్కే ఝా కమిటీ ఈ అంశంపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ప్రభుత్వాలు ఆర్థిక సంవత్సరాన్ని పాటించాలని ఈ కమిటీ చేసిన సిఫారసును అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదు.