
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరో కామాంధుడి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రఖ్యాత మయూర్ పాన్ హౌస్ యజమాని ఉపేంద్ర వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలకు వలవేసి, పెళ్లిచేసుకుంటానని నమ్మించడం ఇతని నైజం. అలా దగ్గరైన అమ్మాయిలకు స్వీట్పాన్లో మత్తుమందు కలిపిచ్చి, అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఆ దృశ్యాలను రహస్యంగా వీడియో తీసి, వాటిని యూట్యూబ్లో పెడతానని బెదిరించడంతోపాటు నానారకాలుగా వేధించేవాడు’’ అని పోలీసులు చెప్పారు.
ఉచ్చులో చిక్కుకున్న టెకీ: ఉపేంద్ర వర్మ నిజస్వరూపం తెలియని ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతనికి దగ్గరయ్యారు. తీరా నమ్మకద్రోహానికి గురయ్యానని తెలుసుకున్న తర్వాత ధైర్యంగా బయటికొచ్చారు. వర్మపై కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఉపేంద్ర వర్మ అజ్ఞాతంలోకి పారిపోయాడు. అతనికి సహకరించిన ముగ్గురు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. ఊహించని విషయాలెన్నో బయటపడ్డాయి. పదుల సంఖ్యలో అమ్మాయిలతో ఉపేంద్ర వర్మ చనువుగా ఉన్న ఫొటోలు లభించాయి. మయూర్ పాన్ హౌస్కు హిమాయత్ నగర్ సహా నగరంలో పలు చోట్ల శాఖలున్నాయి. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.