
ఆలయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్న ఆడ దొంగల ముఠా
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల మల్లే వచ్చిన ఓ దొంగలముఠా కేరళ భక్తుల నగల బ్యాగును చోరీ చేసింది. చివరకు భద్రతా సిబ్బంది ఆ ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలు.. కేరళ నుంచి కొంతమంది భక్తులు శుక్రవారం దర్శనానికి వచ్చారు. కొంతసేపటికి చూస్తే తమ నగలబ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనచెందారు. ఎవరో దొంగలు కొట్టేశారని గ్రహించి వెంటనే ఆలయ భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన వారు సీసీ కెమెరాల ద్వారా దొంగలను గుర్తించారు. ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగల బ్యాగును స్వాధీనం చేసుకుని కేరళ భక్తులకు అప్పగించారు. చోరీకి పాల్పడిన ఐదుగురు మహిళలను వన్టౌన్ పోలీస్స్టేషన్లో అప్పగించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ కి‘లేడీలు’ సూళ్లూరుపేటకు చెందినవారని తేలింది. గతంలో పట్టణంలో జరిగిన చోరీలలో వీరి ప్రమేయం ఉందా? అనే కోణంలో సీఐ నాగార్జుణ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.