అధిక ధరలకు నిరసనగా ప్రదర్శన
తెనాలి టౌన్: సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా నిత్యావసర ధరలు అధికంగా పెరిగిపోతున్నాయని, వాటిని తగ్గించాలని చిరు వ్యాపారులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని సీపీఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు తెలిపారు. అధిక ధరలకు నిరసనగా బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని పార్టీ కార్యాలయం నుంచి మార్కెట్ వరకు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. సింగారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఏఐటీయూసీ కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులు, కర్షకులు, చిరు వ్యాపారులు సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం.నాగేశ్వరరావు, సీపీఐ పట్టణ కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, డాక్టర్ శశికిరణ్, సుభానీ,మస్తాన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.