టీడీపీ రెండేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమీ చేయలేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి విమర్శించారు.
విజయవాడ: టీడీపీ రెండేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు నవ నిర్మాణదీక్షకు బదులు వైఫల్య దీక్ష చేస్తే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్లో తులసిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారన్నారు. నవనిర్మాణ దీక్ష పేరిట రూ.3 కోట్లు దుబారా ఖర్చు చేశారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవినీతి పెరిగిందన్నారు. ఓటుకు నోటు కేసే ఇందుకు నిదర్శనమన్నారు.
అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిలో కనీసం ఒక్కదాన్ని కూడా అమలుచేయలేకపోయారన్నారు. బెల్టు షాపుల్ని రద్దుచేస్తానని చెప్పి రెట్టింపు చేశారన్నారు. రుణమాఫీ వల్ల అరకొర లబ్ధి మాత్రమే చేకూరిందన్నారు. హంద్రీ-నీవా సుజలస్రవంతి పథకం ఎక్కడ అమలుజరుగుతోందని చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఐదుశాతం కూడా గ్రామాలకు శుద్ధ జలాలు అందడం లేదని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.