Nava Nirmana Deeksha
-
నవ నిర్మాణ దీక్షలకు మరో రూ.6.55 కోట్లు
సాక్షి, అమరావతి : గత నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలకు మరో రూ.6.55 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రణాళిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దీక్షల కోసం గతంలోనే జిల్లాకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.13 కోట్ల రూపాయలను, విజయవాడలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సభకు రూ.10 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ నిధులు సరిపోలేదని, మరిన్ని నిధులు వ్యయం అయినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లాకు మరో రూ.50 లక్షల చొప్పున రూ.6.50 కోట్లను, విజయవాడలో సీఎం సభకు మరో రూ.5 లక్షలను ప్రణాళికా శాఖ మంజూరు చేసింది. -
దుబారాకు లోటులేదు..!
సాక్షి, అమరావతి: సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు.. అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు.. వీలుంటే కొన్నింటిని వాయిదా వేసుకుంటారు. కానీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం అందుకు విరుద్ధం. రాష్ట్రం భారీ రెవెన్యూ లోటులో ఉన్నా సరే దుబారాతో ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ఏటేటా రెగ్యులర్ విమానాలను కాదని ప్రత్యేక విమానాల్లో పర్యటనలు, అర్భాటాలు, ప్రచార ఈవెంట్లు, ధర్మపోరాటాలకు భారీగా వ్యయం చేస్తున్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఆర్భాటపు దుబారాకు అయిన మొత్తం రూ.2,620.76 కోట్లకు పెరిగిపోయిందంటే అనవసర ఖర్చులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్ధమవుతుంది. వీటివల్ల నాలుగేళ్లలో రాష్ట్రానికి ఎలాంటి శాశ్వత వసతి కానీ, ఆస్తిగానీ సమకూరలేదు. పైగా.. ఏమీ చేయకుండా చేస్తున్నట్లు విస్తృత ప్రచారం చేసుకుంటూ.. రాష్ట్ర ఖజానాను విచ్చలవిడిగా వాడేసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్ అంటూ.. పరిష్కార వేదిక 1100 నెంబర్ అంటూ వందల కోట్ల రూపాయలను ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రం ఏటా రెవెన్యూ లోటులోనే కొనసాగుతున్నప్పటికీ అనవసరపు ఖర్చులను అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రే అందుకు విరుద్ధంగా ఈ వెంట్ల పేరుతో భారీగా నిధులు ఖర్చుపెడుతుండడంపై అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తంచేస్తోంది. ఓ పక్క రాజధాని కోసం ప్రజలను విరాళాలు ఇవ్వండంటూ పిలుపునిస్తూ.. మరోపక్క ప్రజాధనాన్ని సొంత ప్రచారం కోసం దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సర్కార్ సొమ్ముతో ధర్మపోరాటమా!? మొన్నటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా పల్లవి అందుకుని ధర్మపోరాటం అంటూ సర్కార్ సొమ్ముతో సభలు నిర్వహించడాన్ని ఉన్నతస్థాయి అధికారి ఒకరు తప్పుపట్టడం గమనార్హం. సీఎంగా ఉంటూ ధర్మపోరాటాలు ఎవ్వరైనా చేస్తారా అంటూ ఆ అధికారి వ్యాఖ్యానించడం విశేషం. రాజధానిలో శంకుస్థాపనల పేరుతో వందల కోట్ల రూపాయలు వ్యయం చేసినా ఇప్పటివరకూ ఒక్క శాశ్వత భవనాన్నీ సమకూర్చలేదు. పైగా తాత్కాలిక సచివాలయ వ్యయాన్ని రూ.300 కోట్ల నుంచి మరమ్మతులు, ఇతర సౌకర్యాల పేరుతో ఏకంగా రూ.1,100 కోట్లకు పెంచేశారు. భాగస్వామ్య సదస్సులకు రూ.150కోట్లు అలాగే, పెట్టుబడుల కోసం భాగస్వామ్య సదస్సులను నిర్వహించడాన్ని ఎవ్వరూ తప్పుపట్టక పోయినప్పటికీ వాటి నిర్వహణకు చేస్తున్న వ్యయంపై మాత్రం అధికారులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు భాగస్వామ్య సదస్సులు నిర్వహించగా.. ఒక్కో సదస్సుకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.150 కోట్లు వ్యయం చేయడాన్ని అధికారులే తప్పుపడుతున్నారు. అంత వ్యయం చేసినప్పటికీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ భారీ పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదని వారు పేర్కొంటున్నారు. మరోపక్క.. ఇప్పటివరకూ ఐదుసార్లు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించడమే జన్మభూమి లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అవి సీఎం ప్రచార సభలుగా మారిపోయాయని అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు జరిగిన ఐదు జన్మభూమి కార్యక్రమాలకు మొత్తం రూ.125 కోట్లు వ్యయం చేశారని, ఇదంతా దుబారా కిందకే వస్తుందని పేర్కొంటున్నాయి. నయాపైసా ఉపయోగంలేని నవనిర్మాణ దీక్షలు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకుండా నవ నిర్మాణ దీక్షల పేరుతో ఏటా 20 కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నారని, ఇప్పటివరకు నాలుగుసార్లు నవ నిర్మాణ దీక్షల పేరుతో సీఎం ప్రచార సభలు నిర్వహించారు తప్ప వాటివల్ల ఎటువంటి ప్రయోజనంలేదని అధికారులే అంటున్నారు. అలాగే, కొత్తగా ఈ ఏడాది హ్యాపీ సిటీస్ సదస్సును తెరమీదకు తీసుకువచ్చిన సీఎం.. ఇందుకు రూ.61 కోట్లు వ్యయం చేశారు. పోలవరం ప్రాజెక్టు డ్యాం పునాదులు కూడా పూర్తికాకముందే బస్సుల్లో జనాన్ని ఆ ప్రాజెక్టు దగ్గరకు తీసుకువెళ్లి చూపించడానికి ఏకంగా 22.50 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. రాజధాని శంకుస్థాపనకు రూ.250 కోట్లను వ్యయం చేసిన సర్కారు ఆ తరువాత పరిపాలన నగరం, సీడ్ కేపిటల్.. రహదారుల శంకుస్థాపనల పేరుతో ఈవెంట్లను నిర్వహించి రూ.100 కోట్లు వ్యయం చేసింది. అయినా ఇప్పటివరకూ రాజధాని ఒక్క శాశ్వత నిర్మాణానికీ నోచుకోలేదు. ప్రత్యేక విమానం, హెలికాప్టర్ ఖర్చు రూ.100కోట్లు ఈ ఏడాది విదేశీ పర్యటనలు, రోడ్షోలకు రూ.62 కోట్లు కేటాయింపు నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన విదేశీ పర్యటనలవల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకపోయినా ఖజానాకు మాత్రం బాగా చమురు వదిలింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో, హెలికాప్టర్లలో ప్రయాణం చేస్తున్నారు. దేశంలోనూ ఎక్కడికి వెళ్లాలన్నా రెగ్యులర్ ఫ్లైట్లున్నప్పటికీ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో వెళ్లారు. చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు గత నాలుగేళ్లలో రూ.100 కోట్లు వెచ్చించారు. గన్నవరం విమానాశ్రయంలో బాబు ప్రత్యేక విమానం, హెలికాప్టర్ పార్కింగ్ చేసి ఉంటాయి. పార్కింగ్ చేసి ఉంచినందుకు కూడా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు చెల్లించాల్సి వస్తోందని.. అలాగే పైలెట్లకు స్టార్ హోటల్స్లో బస ఏర్పాటుచేయాల్సి వస్తోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెగ్యులర్ ఫ్లైట్లున్నా ప్రత్యేక చార్టెడ్ విమానాల్లో తిరగడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన అజేయ కల్లాం తాను రాసిన మేలుకొలుపు పుస్తకంలో తప్పుపట్టారంటే సీఎం ఎలా దుబారా చేశారో తేటతెల్లం అవుతోంది. అలాగే, ఈ ఏడాది విదేశీ యాత్రల కోసం ప్రత్యేకంగా ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటుచేశారు. విదేశీ పర్యటనలు, రోడ్ షోల నిర్వహణకు ఏకంగా బడ్జెట్లో రూ.62కోట్లను కేటాయించారు. -
ఇంకేం చేయాలి
నెల్లూరు(పొగతోట)/సూళ్లూరుపేట: గడిచిన నాలుగేళ్లలో జిల్లాను ఎంతో అభివృద్ధి చేశాం.. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి మొదలుకుని చెక్డ్యాంల నిర్మాణం వరకు చాలా చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. నెల్లూరుకు ఇంకా ఏం చేయాలని ప్రజలను ప్రశ్నించారు. రానున్న రోజుల్లో జిల్లాలో అభివృద్ధి పనులు చేపడతామని హామీలిస్తూ తనదైన శైలిలో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. సుమారు గంటన్నరపాటు సీఎం ప్రసంగం కొనసాగింది. ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. శుక్రవారం నవ నిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సీఎం పర్యటించారు. తొలుత పెళ్లకూరు మండలంలోని తాళ్వాయిపాడులో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు. మధ్యాహ్నం అక్కడి నుంచి నాయుడుపేట చేరుకుని మహాసంకల్ప ముగింపు సభలో గంటకు పైగా ప్రసంగించారు. రెండు గంటలు అలస్యంగా .. షెడ్యూల్ ప్రకారం సీఎం పర్యటన ఉదయం 10 గంటలకు తాళ్వాయిపాడులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకోవాల్సి ఉంది. ఉదయం 12 గంటల సమయంలో సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గ్రామానికి చేరుకుని అక్కడ గ్రామదర్శినిలో ప్రజలతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం నాయుడుపేట చేరుకున్నా రు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు. జిల్లాలో ఏడు వేల కోట్ల విలువ చేసే సీజేఎఫ్ఎస్ భూములను ఎస్సీ, ఎస్టీలకు స్వాధీనం చేసేలా చర్యలు చేపడతున్నామన్నారు. లక్ష ఎకరాల చుక్కల భూములకు యాజమాన్యపు హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. భవిష్యత్లో నిరుద్యోగ సమస్య రాకుండా పరిశ్రమలు స్థాపనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సోమశిల హైలెవల్ కెనా ల్ రూ.800కోట్లతో ప్రారంభించామన్నారు. రెండో దశ పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రూ.43కోట్లతో పులికాట్ ముఖద్వారం పనులు చేపట్టి పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో చిన్నచిన్న ప్రాజెక్ట్లు పూర్తి చేసి 1.25లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకొచ్చామన్నారు. రాబోవు ఏడాదిలో 20వేల పంటగుంటలు, నాలుగు లక్షల చెక్డ్యామ్లు నిర్మించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వర్షపాతం తక్కువైనా నీటి నిర్వహణ సమర్థవంతంగా చేస్తూ దిగుబడులు సాధిస్తున్నామన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసమే రాష్ట్రాన్ని విభజించినట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ 2014కి ముందు దెయ్యాలకు పెన్షన్లు ఇచ్చేవారని, రేషన్షాపుల్లో బియ్యం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా ఇవ్వలేకపోయినా అర్హులైన వారికి పింఛన్లు, నిత్యావసర సరుకులు సకాలంలో అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ నిధులు కేటాయించడం లేదన్నారు. బీజేపీకి పతనం ప్రారంభమైందన్నారు. పంచాయతీరాజ్శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 2014లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఎకరం సాగు భూమి ఇచ్చిన ఘనత చంద్రబాబునాయుడికే దక్కిందన్నారు. అనంతరం సీఎంను టీడీపీ నాయకులు సన్మానించారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఆర్డీఓలు హరిత, శీనానాయక్, భక్తవత్సలరెడ్డి, డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి ఎమ్మెల్యేలు పాశం సునీల్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ ఎంపీ నెలవల, మాజీ ఎమ్మెల్యేలు పరసా, బల్లి దుర్గాప్రసాద్, జెడ్పీ ఫ్లోర్లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి, కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీలో ఆనం రామనారాయణరెడ్డి, కన్నబాబు వర్గీయుల మధ్య రాజకీయ వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆనం వర్గీయులపై కన్నబాబు వర్గీయులు దాడి చేశారు. మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ బొగ్గవరపు శ్రీకాంత్ నారాయణ గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచి కన్నబాబు వర్గంగా కొనసాగుతున్నాడు. మారిన పరిణామాల క్రమంలో ఆనం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా నియమితులు కావడంతో శ్రీకాంత్ ఆనం వర్గంలోకి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కన్నబాబుకు అత్యంత సన్నిహితులైన కొందరు శ్రీకాంత్తో పాటు ఆనం వర్గానికి చెందిన కొందరిని స్థానిక సినిమా హాల్ వద్దకు రమ్మని ఫోన్ చేసి పిలిపించారు. అక్కడ ఇరువర్గాలు పాత విషయాలను దృష్టిలో ఉంచుకుని వాదులాడుకున్నారు. మాటామాటా పెరిగి ఇరువర్గాలకు బాహాబాహీకి దిగారు. స్థానికులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేసి సినిమా హాల్ నుంచి వెలుపలికి పంపించారు. దీంతో కౌన్సిలర్ శ్రీకాంత్ నారాయణ పోలీస్స్టేషన్లో తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు సీఎం బందోబస్తుకు వెళ్లి ఉండటంతో ఏఎస్సై ఫిర్యాదును స్వీకరించారు. -
రూ.కోటి వ్యయం.. ఒరిగింది శూన్యం
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన నవ నిర్మాణ దీక్షల వల్ల శాఖాపరమైన కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. దీక్షల కోసం ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన కోటి రూపాయలు ప్రజాధనం కూడావృథా అయింది. అయితే శని, ఆదివారాలు రెండు రోజులు సెలవులు రావడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ప్రతి ఏటా జూన్ 2వ తేదీ నుండి నవ నిర్మాణ దీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా నాలుగో విడత నవ నిర్మాణ దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ఒక్కరోజు దీక్ష నిర్వహించి ఉంటే బాగుండేదని, ఇలాంటి వాటిని కూడా వారం రోజులపాటు నిర్బంధంగా నిర్వహించి చంద్రబాబు తన మార్కు ప్రచారాన్ని నిర్వహించుకునేందుకు వేదికగా మలచుకున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. జిల్లా కేంద్రం, డివిజనల్ కేంద్రం, మునిసిపల్ కేంద్రం, మండల కేంద్రం, గ్రామ పంచాయతీ అనే తేడా లేకుండా ఎక్కడ బడితే అక్కడ నవ నిర్మాణ దీక్షలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతిజ్ఞ టు మహాసంకల్పం రాష్ట ప్రభుత్వం వారంరోజులపాటు నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలను ప్రతిజ్ఞతో ప్రారంభించి మహాసంకల్పంతో ముగించింది. తొలిరోజు 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, విభజన హామీలు అమలుపై చర్చించి ప్రభుత్వ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. రెండవరోజు నీటిభద్రత, కరువు రహిత రాష్ట్రం, మూడవరోజు రైతు సంక్షేమం, ఆహార భద్రత, నాల్గవ రోజు సంక్షేమం–సాధికారత, ఐదవరోజు జ్ఞాన భూమి –ఉపాధి కల్పన, ఆరవరోజు మౌలిక సదుపాయాలు– మెరుగైన జీవనం, ఏడవరోజు సుపరిపాలన–అవినీతిరహిత సమాజం గురించి చర్చించారు. చివర్లో మహా సంకల్పం చేపట్టారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఏ–1 ఫంక్షన్ హాలులో మహాసంకల్పం చేపట్టారు. వారం రోజులపాటు షెడ్యూల్ ప్రకటించినప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో సక్రమంగా అమలు చేయకుండా యంత్రాంగం మమ అనిపించేసింది. అందుకు కారణం నవ నిర్మాణ దీక్షలో ప్రజల భాగస్వామ్యం లేకపోవడమే. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామ పంచాయతీ వరకు అన్నిచోట్ల నవ నిర్మాణ దీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రజల భాగస్వామ్యం కొరవడింది. పైగా ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజలను నిర్బంధంగా ఉంచేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యంత్రాంగం ప్రయత్నించినప్పటికీ ప్రజల హాజరు పలచగానే ఉంది. జిల్లాకు చెందిన మంత్రి, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నచోట్ల ప్రజలను పథకాల పేరుతో మభ్యపెట్టి దీక్షలకు తరలించడం జరిగింది. కొత్తగా పింఛన్లు, ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించడంతో ప్రజలు ఆ మాత్రమైనా వచ్చారు. లేకుంటే ఎర్రటి ఎండల్లో పనేమి లేదన్నట్లుగా వెళతామా అని కొంతమంది ప్రజలు అధికారుల ఎదుట బహిరంగంగానే వ్యాఖ్యానించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారపార్టీ నేతల హడావుడి నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో అధికార పార్టీ నేతల హడావుడి ఎక్కువగా కనిపించింది. ఇది ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యక్రమంలా భావించి హల్చల్ చేశారు. ముఖ్యమంత్రి తనయుడు, పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్, మహిళా శిశు సంక్షేమశాఖామంత్రి పరిటాల సునీత, జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ జిల్లాపై కన్నెత్తి కూడా చూడలేదు. అధికార పార్టీ శాసనసభ్యులు పాల్గొన్న నవ నిర్మాణ దీక్షల్లో తెలుగు తమ్ముళ్ల సందడి మరీ ఎక్కువగా కనిపించింది. కొన్నిచోట్ల తెలుగు తమ్ముళ్లు కూర్చొని, అధికారులు నిల్చొన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిని బట్టి నవ నిర్మాణ దీక్షను అధికారపార్టీ ఏవిధంగా ఉపయోగించుకుందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం కంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించేందుకే ఎక్కువగా దీక్షను వినియోగించుకున్నారు. దీంతో ప్రజలు ఇది ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
వికటిస్తున్న బాబు వ్యూహాలు!
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసు కొన్నా.. ప్రజలకిచ్చిన ప్రధాన హామీలేవీ ఇప్పటివరకు అమలు చేయలేకపోయారు. కానీ, ఒకట్రెండు హామీలు నహా మొత్తం నెరవేర్చేశామని బొంకుతున్నారు. అధికారం చేపట్టిన జూన్ 8, 2014న సీఎంగా ఐదు దస్త్రాలపై తొలి సంతకం చేశారు. వాటినే ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదు. పదవి చేపట్టిన తొలి మాసంలోనే ఆర్థిక రంగంతోసహా పలు రంగాలపై శ్వేత పత్రాలు ప్రచురించి కాంగ్రెస్ పదేళ్ల పాలనలో అభివృద్ధి తిరోగమనంలో పయనించిందని చెప్పుకొచ్చారు. కానీ, ఈ నాలుగేళ్లల్లో తన పరిపాలనలో ఆయా రంగాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో శ్వేతపత్రాలు ప్రచురించమని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. బాబు విననట్లు నటిస్తూ..‘నవ నిర్మాణదీక్ష’ అంటూ ప్రజలతో ప్రమాణాలు చేయించే కార్యక్రమాల్ని ప్రజాధనంతో నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ప్రదర్శిస్తున్న రాజకీయ టక్కుటమార విద్యల్లో ‘నవ నిర్మాణదీక్ష’ ఒకటి. గత నాలుగేళ్లుగా ఈ తంతు నిర్వహిస్తున్నారు. మొదటి మూడేళ్లు నవ నిర్మాణదీక్షల వేదికల నుంచి కాంగ్రెస్ పార్టీని, వైసీపీని తిట్టిపోశారు. ఈ ఏడాది కొత్తగా బీజేపీని, జనసేనను కలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని పార్టీ కార్యక్రమాలుగా మార్చివేసి.. ‘ప్రత్యేకహోదా’ ఇవ్వనందుకు బీజేపీని, మోదీని; రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్న సాకుతో కాంగ్రెస్ పార్టీని; అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి వైసీపీని; స్నేహహస్తాన్ని వీడి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలో ఎండగడుతున్న జనసేన అధినేత పవన్కళ్యాణ్ను పదేపదే విమర్శిస్తున్నారు. ప్రత్యేకహోదా అంశంలో మాట తప్పారని ప్రధాని మోదీని ఏపీ ప్రజల్లో విలన్గా చిత్రీకరించడానికి బాబు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. మోదీతో జగన్, పవన్కల్యాణ్లు జత కలిశారని ప్రచారంచేసి.. 2019 ఎన్నికల్లో గట్టెక్కాలన్నది బాబు వ్యూహం! బాబు చేస్తున్న నవ నిర్మాణ దీక్షల పోస్టర్లలో 2050 నాటికి పెట్టుకొన్న లక్ష్యాలు కనిపిస్తున్నాయి. అంటే, 2050 వరకు తన ప్రభుత్వమే ఉంటుందని పరోక్షంగా ప్రజలకు చెబుతున్నట్టే లెక్క. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ 30 ఏళ్ల తర్వాత సాధించబోయే లక్ష్యాలు ఏర్పరుచుకొన్న దాఖలాలు కన్పిం చవు. గత నాలుగేళ్లలో టీడీపీ అన్ని రంగాల్లో ఘనంగా విఫలమైంది కనుకనే.. ప్రజల దృష్టిని మరల్చడానికి తనకు తెలిసిన విద్యలను ప్రదర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి నిర్దిష్టమైన ఎజెండా లేదు. ఈ నాలుగేళ్లల్లో సాధించామని చెప్పుకోవడానికి ఏ ఒక్క ఘనత లేదు. నాలుగేళ్ల బాబు పాలనలో వ్యవసాయరంగం కుదేలయింది. ఎన్నికల ముందు బేషరతుగా రైతు రుణమాఫీ చేస్తామన్నారు. మొత్తం రుణభారం రూ. 95,455 కోట్లుగా ఎస్ఎస్బీసీ తేల్చితే.. కాకి లెక్కలు వేసి రైతులకు రూ. 24,000 కోట్లు చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు కేవలం రూ. 14,000 కోట్లమేర మాత్రమే చెల్లించారు. ఆ మొత్తం రైతులు వడ్డీలు కట్టడానికే సరిపోయింది. ఇక, రాష్ట్రంలో కరువును పారద్రోలామని ఘనంగా చెప్పుకొంటూ.. అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ఘనత ఈ ప్రభుత్వానిది. క్రిందటేడాది.. రాయలసీమ నుంచి పొరుగునున్న తమిళనాడుకు 4 లక్షల మంది సన్నకారు రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం వలసబాట పట్టారని పతాక శీర్షికల్లో వార్తలొచ్చాయి. సాగునీటి రంగానికి సంబంధించి అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టుల అంచనాల్ని అనూహ్యంగా పెంచేశారు. పెంచిన అంచనాలను చీఫ్ సెక్రటరీ ఆమోదించడానికి నిరాకరిస్తే.. క్యాబినెట్లో ఫైల్పెట్టి ఆమోదముద్ర వేసుకొన్నారు. పట్టిసీమను సకాలంలో పూర్తిచేస్తే 21.9% బోనస్ ఇస్తామనే నిబంధన ఏర్పరిచి.. ఆ ప్రాజెక్టు సకాలంలో పూర్తయిందని చెప్పుకోవడానికి.. పాత పైపులు తెచ్చి బిగించి సంబ రాలు జరుపుకొన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంను కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి ఉండగా, కాంట్రాక్టింగ్ పనుల కోసం దాని నిర్మాణం తలకెత్తుకొని.. దానిని పూర్తి చేయలేక నెపాన్ని కేంద్రంపై నెట్టేస్తున్నారు. పోలవరం అవినీతికి కేంద్రంగా మారిపోయింది. దాని లెక్కలు, ఖర్చులు చెప్పే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడంతో, కేంద్రం నిధులు విడుదల చేయని పరిస్థితి. డ్వాక్రా మహిళలకు రూ. 14,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి.. కేవలం రూ. 3,000 చొప్పుల పెట్టుబడి రూపంలో ఇచ్చారు. ఫలితంగా 84 లక్షల మంది మహిళలు రుణగ్రస్తులుగా బ్యాంకు రికార్డుల్లో మిగిలారు. మహిళల సాధికారత మద్యం అమ్మకాల పెంపు ద్వారా సాధ్యపడుతుందా? ఈ నాలుగేళ్లల్లో ఏడాపెడా అప్పులు చేయడంలోనే ఈ ప్రభుత్వం విజయం సాధించింది. ఎఫ్ఆర్బిఎం చట్టం నిబంధనలను పక్కనపెట్టి ఇష్టానుసారం అప్పులు చేశారు. ఈ నాలుగేళ్లల్లో రూ.1,40, 000 కోట్ల మేర కొత్తగా రుణాలు తీసుకొచ్చారు. ఆర్థిక క్రమశిక్షణ కాగడాపెట్టి వెతికినా కనపడదు. గతంలో చేసిన దుబారాకు అదనంగా ఇటీవల ధర్మదీక్ష కార్యక్రమాలకు ఒక్కోదానికి రూ. 30 కోట్లు చొప్పున, నవ నిర్మాణదీక్షకు రూ.13 కోట్లు చొప్పున ఖర్చు పెడుతున్నారు. వీటివల్ల ప్రజలకు ఒరిగేదేమిటి? ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి రూపంలో నెలకు రూ. 2,000 ఇస్తామన్న హామీని.. ఆగస్టు నెల నుంచి డిగ్రీ చదివిన నిరుద్యోగులకు పరిమితం చేసి ఇస్తామంటున్నారు. ఎన్నికల ఏడాదిలో కేవలం 6 లేక 7 నెలలు అదికూడా 21 ఏళ్లు దాటి ఓటు కలిగిన వారికి ఇవ్వాలన్న నిర్ణయం, ఓట్లు కొల్లగొట్టే వ్యూహం మాత్రమే. రాష్ట్ర పాలన కాడిని పక్కన పడేసి బాబు.. ప్రతి పక్షపార్టీలను తిట్టడం, సొంత పార్టీ నేతలతో తిట్టించడమే పనిగా పెట్టుకుని చాలాకాలమే అయింది. ఎన్డీఏ నుంచి బయకొచ్చాక అది మరింత పెరిగింది. పార్టీ నేతలతో జరిపే టెలికాన్ఫరెన్స్లు, పార్టీ సమన్వయ భేటీల్లో ఆయన చర్చించే అంశాలు కేవలం రెండే రెండు. 1. టీడీపీ బాగా పనిచేస్తున్నదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి అసత్యాలు ప్రచా రం చేయడం, రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై 80% ప్రజలు సంతృప్తి చెందుతున్నారని చెప్పుకోవడం. 2. ప్రతిపక్షాలపై బురదజల్లే విధంగా తిట్లదండకాలు ఎలా ఉండాలో నాయకులకు దిశానిర్దేశం చేయడం. జన్మభూమి కమిటీలతో ఇప్పటికే టీడీపీ నేతలు గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకతను కొనితెచ్చుకొన్నారు. నాలుగేళ్లపాటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి.. ప్రత్యేకహోదా సాధించలేకపోవడం తెలుగుదేశం వైఫల్యమని ప్రజలు నమ్ముతున్నారు. పైగా, ప్రత్యేకహోదా వల్ల ఉపయోగం లేదని, అదేమీ సంజీవని కాదని ప్రచారం చేసిన బాబు.. కేవలం ప్రజల్లో పెరుగుతున్న ప్రత్యేకహోదా సెంటిమెంట్ను సొమ్ము చేసుకోవడానికే.. చివరి క్షణంలో ప్రత్యేకహోదా అంశాన్ని ఎత్తుకున్నారన్న నిజం ప్రజలు గ్రహిస్తున్నారు. బాబు పన్నుతున్న వ్యూహాలు వికటిస్తున్నాయి. టీడీపీ అధినేత ప్రతి అడుగును, ప్రతి వ్యూహాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ ‘ 81069 15555 -
ఎమ్మెల్యే మణిగాంధిపై విరుచుకుపడ్డ జనం
బురాన్దొడ్డి(సి.బెళగల్) : ‘‘అయ్యా మేము నాలుగేళ్లుగా తిరుగుతున్నా పింఛన్ ఇవ్వడం లేదు. మేము సచ్చాక పింఛన్ ఇవ్వాలనుకున్నారా..?’’ అంటూ వృద్ధులు ఎమ్మెల్యే మణిగాంధీని, అధికారులను నిలదీశారు. బుధవారం మండల పరిధిలోని బురాన్దొడ్డిలో సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ నోడల్ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గోనెనాయక్ జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. మండల ప్రత్యేకాధికాధికారి ప్రసాదరావు, ఎంపీడీఓ సిద్ధాలింగమూర్తి, తహసీల్దార్ అన్వర్హుసేన్, ఆర్అండ్బీ ఏఈ ఫణీరామ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వృద్ధులు గంగన్న, జాన్, వితంతువులు వరలక్ష్మి, సువర్ణ, మైబూబాబీ, గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన వృద్ధురాలు నాగమ్మ పింఛన్కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామంలో తాగడానికే నీళ్లు లేవని గ్రామస్తులు దేవరాజు, మాదన్న, ఆనంద్ తదితరులు అధికారులను నిలదీశారు. అదేవిధంగా గ్రామంలోని ఎస్సీలకు శ్మశానానికి స్థలం కేటాయించాలని చంద్రన్న, సుంకన్నలు అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగమనెమ్మ, అధికారులు పాల్గొన్నారు. -
‘ఏం సాధించారో చెప్పే ధైర్యముందా!’
నాయుడుపేటటౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లుగా నవనిర్మాణ దీక్ష పేరుతో రూ.కోట్లు దుర్వినియోగం చేయడం తప్ప ఏం సాధించారో చెప్పే ధైర్యం ఉందా అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా ఇన్చార్జ్ కిలివేటి సంజీవయ్య విమర్శించారు. నాయుడుపేటలోని ఆయన నివాసంలో గురువారం వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిపై పొట్టి శ్రీరాములు స్వస్థలమైన జువ్వలదిన్నెలో ప్రజలు నిలదీస్తారని ఇంటిలిజెన్స్ నివేదిక ఇవ్వడంతో సభను మార్చేస్తారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయా సాధన కోసం జాతీయ పార్టీ నాయకురాలి అదేశాలను సైతం లేక్క చేయక తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ నుంచి మగధీరుడిలా బయటకు వచ్చి వైఎస్సార్ సీపీని స్థాపించారన్నారు. అలాంటి తమ నేతను విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నవనిర్మాణ దీక్ష పేరుతో చేపట్టే సభలో జిల్లాలో టీడీపీ నాయకులు నదుల్లో ఇసుకను కొల్లగొడుతున్న తీరు, నీరు–చెట్టు పేరుతో జరుగుతున్న రూ.కోట్ల అవినీతి, ఆక్రమణల పేరిట 400 కుటుంబాలను రోడ్డుపై పడేసిన తీరు, పులికాట్ ముఖద్వారాల్లో పూడికతీయిస్తాం అంటూ చేప్పే మోసకారి మాటల గురించి ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మొదట్లో చంద్రబాబు కాంగ్రెస్తో లాలూచిపడి చీకటి ఒప్పందాలు చేసుకుని, రాష్ట్ర విభజనకు కారకుడిగా నిలిచారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో ప్రధాని మోదీతో పాటు కేసీఆర్తో లాలుచీ పడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పదవులను త్యాగం చేసిన ఎంపీల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నాయకులు లేదన్నారు. వారికి దమ్ముంటే వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామలు చేయించి, వారిని మళ్లీ పోటీలో నిలబెట్టి గెలిపించాలని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, పట్టణాధ్యక్షుడు షేక్ రఫీ, కౌన్సిలర్ కళాచంద్ర, జరీనా, జిల్లా కార్యదర్శి పాదర్తి హరిరెడ్డి, నాయకులు కె.హరిబాబు మొదలియార్, డి.రవీంద్ర, పి.రఘ, జి.సిద్ధయ్య, డి.రాజశేఖరరెడ్డి, మెస్ భాస్కర్రెడ్డి, మోహన్రావు, సీహెచ్ మోహన్కృష్ణశర్మ, సి.చెంగయ్య, పి.భాస్కర్, రత్నశ్రీ, సుగుణమ్మ, అనురాధ, ఇరుగు సాయి, వెంకటేష్ పాల్గొన్నారు. -
‘చంద్రబాబు.. బీజేపీకి గౌరవ కార్యదర్శి’
సాక్షి, విశాఖపట్నం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్లకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఏ ప్రయోజనం లేని నవనిర్మాణ దీక్షల కారణంగా ఏపీలో వారం రోజులుగా ప్రభుత్వ పాలన నిలిచిపోయిందన్నారు. ఆయన విశాఖలో శుక్రవారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. నవనిర్మాణ దీక్షలకు రూ.50 కోట్లు వృథా చేశారని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్లు భయపడుతున్నారేమో గానీ, బీజేపీకి ఎలాంటి భయాలు లేవని స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న కాంగ్రెస్ పార్టీతో కలవాలని చంద్రబాబు ఎందుకు అనుకుంటున్నారో చెప్పాలన్నారు. నిత్యం ప్రధాని పదవిని వదులుకున్నానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబును ప్రధానిని చేస్తానని ఎవరు చెప్పారని ఈ సందర్భంగా ఏపీ సీఎంను ఆయన ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలు చెబితేనే పెన్షన్లు ఇస్తున్నారని, అర్హులకు ఇళ్లు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెల్లవారి లేచిన దగ్గరి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నామస్మరణ చేస్తూ బీజేపీకి చంద్రబాబు గౌరవ ప్రచార కార్యదర్శిగా మారారని పేర్కొన్నారు. బీజేపీ నేతలపై దాడులకు నిరసనగా ఈ నెల 11న విజయవాడలో ధర్నా చేపట్టనున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు. -
విసిగి...వేసారిన జనం
పుంగనూరు : చండ్రమాకులపల్లెకు సీఎం చంద్రబాబు గంటకుపైగా ఆలస్యంగా రావడంతో టీడీపీ నాయకులు విసిగిపోయారు. సీఎం సభ కోసం తరలించిన జనం మండుటెండలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలకంటే అధికారులు, పోలీసులే ఎక్కువగా కనిపించారు. ఐదు నిముషాల్లో సభ ముగించడంతో జనం నిరాశచెందారు. అంతేకాకుండా పలు ఆర్టీసీ బస్సులు సీఎం సభకు ప్రజలను తరలించేం దుకు మరలించడంతో ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. -
తమ్ముళ్లకు తలంటిన చంద్రన్న!
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో రోజురోజుకు దిగజారిపోతున్న తెలుగుదేశం ప్రతిష్ట.. నిత్యం నేతల గొడవలు.. ఎంత ప్రచారం చేపట్టిన ప్రజాభిమానం పొందడంతో విఫలం. నిఘావర్గాల నివేదికలు వెరసి తమ్ముళ్లకు చంద్రన్న తలంటారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ప్రొద్దుటూరు మండలం నాగాయపల్లె గ్రామదర్శిని వెళ్లేందుకు సీఎం చంద్రబాబునాయుడు కాన్వాయ్ బయలుదేరింది. కొద్దిదూరం వెళ్లగానే బస్సు నిలిపేశారు. బస్సులో ఉన్నవారిని దింపేసి, ముందుసీట్లో ఉన్న సీఎం వెనుక వైపునకు వెళ్లారు. బస్సులోపలికి ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిని పిలిపించారు. ప్రభుత్వ నిఘా వర్గాల నివేదికలను దృష్టిలో ఉంచుకొని మీ ఇద్దర్ని ఇక్కడ పదవుల్లో పెట్టడం తాను చేసిన పెద్ద పొరపాటు అంటూ సీఎం మండిపడ్డట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు వర్గ విభేదాలు తీవ్రం అవుతుంటే మీరేం చేస్తున్నారు. పరిష్కరించాల్సింది పోయి, ఏదో వైపు మీరు మొగ్గు చూపుతూ పరిస్థితిని మరింత జఠిలం చేస్తున్నారని నిలదీసినట్లు సమాచారం. బద్వేల్లో ఎమ్మెల్యే జయరాములు, టీడీపీ నేత విజయజ్యోతి ఇద్దరిని టార్గెట్ చేస్తే మీరు ఇచ్చే మేసేజ్ ఏమిటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగులో గ్రూపు విభేదాలను ఎందుకు పరిష్కరించలేకపోయారు. ఒక వర్గానికి అనుగుణంగా పనిచేయడం ఏ మేరకు సబబు. పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు అంటూ ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు సంధించడంతో ఇద్దరు నాయకులు నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేయబోగా, అతని కంటే అనుభవం లేదు. మీ అనుభవం ఏం ఏడ్చింది అనడంతో కిమ్మనకుండా ఉండిపోయినట్లు సమాచారం. కలిసి పనిచేయండి.. ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి వ్యవహారం అయ్యాక ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డిలను బస్సులోకి పిలిపించినట్లు సమాచారం. ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలని, మీరు కలిసి పనిచేయకపోతే ఏం చేయాలో నాకు తెలుసని బాబు ముఖాన్నే చెప్పినట్లు సమాచారం. లింగారెడ్డి ఏదో చెప్పబోయేందుకు ప్రయత్నించగా మంత్రి, జిల్లా అధ్యక్షుడు ఇద్దరితో కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇకపైన విభేదాలంటూ రచ్చకెక్కితే సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. దాదాపు 15 నిమిషాలు బస్సులో ఇదే వ్యవహారం నడిచింది. అక్కడ తమ్ముళ్లు..ఇక్కడ విద్యార్థులు ప్రొద్దుటూరులో తమ్ముళ్లకు తలంటిన చంద్రన్న నవ నిర్మాణ దీక్షలో విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వివరించేంత వరకూ ఓపిగ్గా సీఎం ప్రసంగం వీక్షించసాగారు. కేంద్రప్రభుత్వం, బీజేపీ నాయకత్వం, వైఎస్సార్సీపీ విమర్శించడం సాగిస్తుంటే విద్యార్థులు సీట్లుల్లోంచి లేచి వెళ్లిపోవడం ఆరంభించారు. ఇది గమనించిన పోలీసు అధికారులు విద్యార్థులను కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. నేను చేసే ప్రయత్నానికి మీరు మద్దతు ఇస్తారా...లేదా... ఇస్తే చప్పట్లు కొట్టండి...అంటూ పలుమార్లు విద్యార్థులతో అడిగి చప్పట్లు కొట్టించుకున్నారు. సీఎం ప్రసంగం పూర్తయ్యే సరికి సభలో దాదాపు 80 శాతం వెళ్లిపోయారు. కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అయినప్పటీకీ ప్రసంగంలో మార్పులేదు. సీఎం చెప్పాలనుకున్న విషయాలన్నీ పూర్తిగా చెప్పేశారు. ప్రజాధనంతో కార్యక్రమం నిర్వహిస్తూ ఎన్నికల్లో ఓడించడండి అంటూ పిలుపునిచ్చారు. ఉన్నతాధికారుల సాక్షిగా రాజకీయ అంశాలకు వేధికగా నవనిర్మాణ దీక్ష నిలవడం విశేషం. -
ఇంటెలిజెన్స్ ‘నో’
రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు స్వస్థలం బోగోలు మండలం జువ్వలదిన్నె. ఇక్కడ ప్రభుత్వం నవ నిర్మాణదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించింది. సీఎం టూర్ షెడ్యూలు కూడా ఖరారైంది. అధికార యంత్రాంగం అంతా అక్కడే కేంద్రీకృతమైంది. ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయి. అయితే బుధవారం ఉదయానికి అకస్మాత్తుగా రూట్ మారిపోయింది. కావలి, నెల్లూరు నియోజకవర్గాల్లో పర్యటనను రద్దు చేసి సూళ్లూరుపేట నియోజకవర్గానికి మార్చేశారు. అధికారులు ఆగమేఘాలపై నాయుడుపేట, తాళ్వాయిపాడులో బహిరంగ సభ, గ్రామదర్శిని కార్యక్రమాలు జరపాలని నిర్ణయించారు. హడావుడిగా కొత్త రూట్ను ప్రకటించటం జిల్లాలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనివెనుక అసలు కారణం ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికే అని తెలిసింది. మోడల్ విలేజ్గా ప్రకటించిన జువ్వలదిన్నెలో సీఎం సభ నిర్వహిస్తే ప్రజలనుంచి నిరసనలు ఎదురుకావచ్చన్న అధికారుల సూచనలతో షెడ్యూల్ మారినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సీఎం చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్ష ముగింపు సభ జిల్లాలో నిర్వహించనున్నట్లు గత నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ నెల 3న సీఎం పర్యటన ఖరారు చేసిన అధికారులు వివరాలు ప్రకటించారు. ఆ మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 8న ఉదయం జువ్వలదిన్నెకు హెలికాప్టర్ ద్వారా చేరుకుని అక్కడ చిప్పలేరుపై నిర్మాణంలో ఉన్న వంతెన, ఇతర అభివృద్ధి పనులను పరిశీలిస్తారని, అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు సొంతూరు అయిన జువ్వలదిన్నెలోని ఆయన స్మారక భవనాన్ని పరిశీలించి, స్థానిక గిరిజన కాలనీలో మాటామంతి కార్యక్రమ నిర్వహణ, అధికారులతో సమీక్ష నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం నెల్లూరు నగరానికి చేరుకొని వీఆర్సీ గ్రౌండ్లో నవనిర్మాణ దీక్ష ముగింపు సభలో పాల్గొని తిరుగు పయనమవుతారని ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణతో పాటు ఇతర అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మంగళవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించే దీక్ష ఏర్పాట్లను కూడా పరిశీలించి అధికారులకు అనేక సూచనలు చేశారు. ఈ పరిణమాల క్రమంలో బుధవారం ఉదయం కల్లా పర్యటన మొత్తం పూర్తిగా మారిపోయింది. వెను వెంటనే జిల్లా అధికార గణం కొత్తరూట్లో పర్యటించి అక్కడ అధికారులతో సమావేశం నిర్వహించి, ఏర్పాటు ముమ్మరంగా చేయాలని స్థానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చి కొత్త షెడ్యూల్ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై వ్యతిరేకత వస్తుందనే.. జిల్లాలో మోడల్ విలేజ్గా జువ్వలదిన్నెను అధికారులు గతంలో ప్రకటించారు. ఆ మేరకు అక్కడ అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో నిర్వహించి మోడల్ విలేజ్లో చిన్నపాటి సమస్య కూడా లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగది. ఈ క్రమంలో జువ్వలదిన్నెలో కీలకంగా ఫిషింగ్ హార్బర్ వ్యవహరం పెండింగ్లో ఉంది. సీఎం అనేక సందర్భాల్లో ఫిషింగ్ హార్బర్ వస్తుందని ప్రకటించారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. రూ. 250 కోట్లతో నిర్మించే ఫిషింగ్ హార్బర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఏర్పాటు కావాల్సి ఉంది. తీర ప్రాంత ప్రజలు కూడా సుదీర్ఘకాలంగా జువ్వలదిన్నె కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర అవతరణకు కారకుడు అయిన పొట్టిశ్రీరాములు సొంత గ్రామంలో కొత్త రాష్ట్ర నవనిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమాల్లో భాగంగా అక్కడ పర్యటిస్తే వ్యతిరేకత వస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. దీనికి తోడు చిప్పలేరు వాగుపై వంతెన నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో 3న అక్కడ పర్యటించిన కలెక్టర్ ముత్యాలరాజు పనులు నత్తనడకన సాగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణమాల క్రమంలో కావలి, నెల్లూరు నగరం నుంచి పర్యటన పూర్తిగా మారిపోయిన సూళ్లూరుపేట నియోజకవర్గంకే పరిమితం అయింది. తాళ్వాయిపాడులో గ్రామదర్శిని, నాయుడుపేటలో సభ ఈ క్రమంలో 8న సీఎం పర్యటన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఖరారైంది. పెళ్లకూరు మండలంలోని తాళ్వాయిపాడులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అక్కడి నుంచి నాయుడుపేట చేరుకుని ఎల్సీఎం గ్రౌండ్లో ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించి నవనిర్మాణ దీక్ష మహా సంకల్ప సభలో పాల్గొని తిరుగుపయమవుతారు. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
చిత్తూరు కలెక్టరేట్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మట్లాడారు. నవనిర్మాణ దీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి విచ్చేయనున్నట్లు తెలియజేశారు. వివిధ కార్యక్రమాల అనంతరం హంద్రీ–నీవా, సుజల–స్రవంతి పనులపై అధికారులుతో సమావేశం నిర్వహించే అవకా శం ఉందని ఆయన తెలిపారు. రాత్రికి అక్కడే బసచేసి 8వ తేదీ ఉదయం 8 గంటలకు బయలుదేరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి వెళతారని పేర్కొన్నారు. ఓడీఎఫ్ రాష్ట్రంగా ప్రకటన? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ఓడీఎఫ్గా ప్రకటించే అవకాశం ఉందని కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. ఓడీఎఫ్ సాధనలో జిల్లా ప్రజలు చేసిన విశేష కృషికి కృతజ్ఞతగా ఇక్కడ నుంచే రాష్ట్రాన్ని కూడా ప్రకటించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఫైబర్గ్రిడ్ కనెక్షన్లు గురువారానికి 3 లక్షలు పూర్తవుతాయన్నారు. గడచిన నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 17 వేల కిలో మీటర్ల మేరకు సీసీ రోడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన పైలాన్ను చంద్రమాకులపల్లె బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. -
భయపడ్డ బీజేపీ నాయకత్వం!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రధాని నరేంద్రమోది నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. తప్పుడు నిర్ణయాలతో నాలుగేళ్లలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న బీజేపీ నాయకత్వం ఇప్పుడు భయపడుతోందని వ్యాఖ్యానించారు. అందుకే నాలుగేళ్లుగా పక్కన పెట్టిన సీనియర్ నేతలు అద్వానీ, మురళీమనోహార్ జోషిలను అడుక్కునే పరిస్థితి వచ్చిందని సీఎం ఎద్దేవా చేశారు. బుధవారం సీఎం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు రూరల్ మండలంలో గ్రామదర్శిని, కడపలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్కు రూ.15లక్షలు జమ చేస్తామని ఎన్నికల్లో ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ ఏం చేశారన్నారు. ఏ తమ్ముళ్లు ఒక్క రూపాయి అయినా మీ అకౌంట్లో వేశారా అని ప్రశ్నించారు. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని విభజన చట్టంలో ఉన్నా ఎందుకు అమలు చేయడంలేదని సీఎం ప్రశ్నించారు. విడిపోయి కట్టబట్టలతో మిగిలిన రాష్ట్రానికి జాతీయ పార్టీ అండ కావాలని ఆ రోజు బీజేపీతో జట్టుకట్టామన్నారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోయినా నాలుగేళ్లు ఓపిక పట్టామని, చివరికి విభజన చట్టంలో ఉన్న వాటినీ అమలుచేయకపోవడంతో విడిపోయామన్నారు. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన బీజేపీని ఓడించమని తాను కర్ణాటకలోని తెలుగువారికి పిలుపు ఇవ్వడంలో వల్లే అక్కడ ఆ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. రాష్ట్రానికి ప్రకటించిన 11 యూనివర్శిటీల కోసం రూ.11వేల కోట్లు విలువచేసే భూములిస్తే ఏమాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం దగా చేసినా మన తెలివితేటలతో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రూ.16లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు 2,444 ఎంఓయూలు చేసుకున్నాం. తద్వారా 30లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని పునరుద్ఘాటించారు. కేంద్రంతో లాలూచీ పడే రాజీనామాలు కేంద్ర ప్రభుత్వంతో వైఎస్సార్సీపీ లాలూచీపడిందని అందులో భాగంగానే ఎంపీలతో రాజీనామా చేయించారని చంద్రబాబు మరోసారి ఆరోపించారు. సంవత్సరంలోపు ఎన్నికలు రావని తెలుసు కాబట్టే రాజీనామాలు చేశారన్నారు. ఏప్రిల్ 3న రాజీనామా చేసుంటే ఇప్పటికే ఎన్నికలు వచ్చేవని, మే 29న ఆమోదించినా ఎన్నికలు వచ్చేవన్నారు. ఈరోజు మళ్లీ స్పీకర్ వద్దకు వెళ్లారని, వారికి చేతకాకపోతే చేతకాదని చెప్పాలి తప్పితే రాజీనామాలు ఆమోదించకపోవడానికి తాను కారణమని ఎలా చెబుతారని, అక్కడ నామాట వినే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. హ్యాపీనెస్ ఇండెక్స్లో రాష్ట్రానికి 44వ స్థానం సాక్షి, అమరావతి: హ్యాపీనెస్ ఇండెక్స్లో (ఆనంద సూచిక) రాష్ట్రం ర్యాంకు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నవ నిర్మాణ దీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. యునైటెడ్ నేషన్స్ సాధికారత సర్వే ఆనంద సూచికలో రాష్ట్రానికి ప్రపంచంలో 44వ ర్యాంకు వచ్చిందని, రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ప్లానింగ్ కార్యదర్శి సంజయ్గుప్తా చెప్పగా దానిపై చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం ఆనంద ఆంధ్రప్రదేశ్గా రూపొందాలన్నారు. -
జనం కరువాయే.. దీక్షలు బరువాయే..!
సాక్షి, కడప : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఈనెల శుక్రవారం నుంచి చేపట్టిన నవ నిర్మాణ దీక్షలకు జనాలు కరువయ్యారు. తమ పరువు కాపాడుకోవడానికి అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. జనాలు రాక సభల నిర్వహణ అధికారులకు బరువవుతోంది. ఎక్కడ చూసినా జనం నుంచి నవ నిర్మాణదీక్షలకు స్పందన లేదు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులు, టీడీపీ నాయకులు ఎంత ప్రయత్నిస్తున్నా లాభం లేకుండాపోతోంది. కేవలం పింఛన్ ఇస్తామని లబ్ధిదారులు సభలకు తిప్పుకోండం.. ఇవ్వకుండా రేపురండని అంటూ ఉద్యోగులు చెప్పడం పరిపాటిగా మారిందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సభలకు జనాలు రాకపోవడానికి కారణం.. నాలుగేళ్లుగా రైతులకు రుణమాఫీ అందలేదు. దీంతో వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే డ్వాక్రా రుణమాఫీకి ఎసరుపెట్టి కేవలం పసుపు కుంకుమగా మార్చి అంతో ఇంతో ఇచ్చే సొమ్మును కూడా కంతుల రూపంలో ఆలస్యం చేయడంపై మహిళలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్, నిరుద్యోగ భృతి, ఇంటింటికి ఉద్యోగం, నిరుపేదలకు ఇల్లు ఇలా అనేక రకాల హామీలిచ్చి అంతంత మాత్రంగా కూడా అమలు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ గ్రామసభలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. కేవలం దీక్షల్లో అధికారులు మాత్రమే ఉంటున్నారు. అంతటా.. అంతంత మాత్రంగానే జిల్లాలో ఎక్కడ చూసినా నవ నిర్మాణ దీక్షలు వెలవెలబోతున్నాయి. కలెక్టర్ హరికిరణ్తోపాటు ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరైన దీక్షలు మినహా అన్ని చోట్ల జనం కరువవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని తరహాలో ఈ సారి మండల కేంద్రాలతోపాటు పంచాయతీల్లో ఎనిమిది రోజుల నవ నిర్మాణ దీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పల్లెల్లో ఎక్కడా జనం లేని దీక్షలే కనిపిస్తున్నాయి. జనాలు నిండుగా ఉండే దీక్షలు మచ్చుకైనా కనిపించడం లేదు. దీక్షల్లో ఒక అంకె దాటని జనం.. జిల్లాలో నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షల్లో జనం ముగ్గురు, అయిదు మంది, ఏడు మంది, పది మంది ఇలా కనిపిస్తున్నారు. వీరపునాయునిపల్లె మండల కేంద్రంలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షల్లో కేవలం ఐదారు మందే కనిపించారు. అలాగే రైల్వేకోడూరు, పుల్లంపేట మండలాల్లోని పలు చోట్ల కేవలం పది మందిలోపే జనాలు కనిపించా రు. పులివెందులలోని మిస్సమ్మ బంగ్లాలో నిర్వహించిన దీక్షకు జనం లేక చిన్న పిల్లలను తీసుకొచ్చి నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గంలోని మండలాల్లో నిర్వహిస్తున్న సభలకు కూ డా జనాలు లేక కేవలం డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి నడిపిస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలంలో ప్రజలు లేక నవ నిర్మాణదీక్ష బోసిపోయింది. ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేలు, కడప ఇలా అన్నిచోట్ల జనం లేని సభలే దర్శనమిస్తున్నా యి. అందునా పింఛన్ల కోసం వృద్ధులను తీసుకొ స్తుండగా.. డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ వర్క ర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ఖచ్చితంగా హాజరు కావాలని అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. జనం లేకపోవడంతో ఎవరో ఒకరు కనిపిస్తే కొంతైనా దీక్షలకు స్పందనగా చూపించవచ్చని అధికార యంత్రాంగం ఆరాట పడుతోంది. -
‘నిర్బంధ’ దీక్ష
ఒంగోలు టౌన్: నవ నిర్మాణ దీక్షను నిర్బంధ దీక్షగా మార్చేశారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా మంగళవారం స్థానిక రామనగర్లోని మున్సిపల్ హైస్కూల్లో కార్యక్రమ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ప్రారంభవుతుందని, అందులో భాగంగా అర్హులైన వారికి సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పడంతో అనేకమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను రప్పించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణతో పాటు జిల్లాకు చెందిన మరో మంత్రి శిద్దా రాఘవరావు వస్తున్నారంటూ వారిని బలవంతంగా కూర్చోబెట్టారు. నిముషాలు గంటలుగా మారిన ఇద్దరు మంత్రుల ఆచూకీ లేదు. చివరకు మంత్రులు నవ నిర్మాణ దీక్షకు హాజరు కావడంలేదని తేలింది. దీంతో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావు వస్తున్నారంటూ కార్యక్రమానికి వచ్చిన వారిని మరోసారి బలవంతంగా కూర్చోపెట్టారు. సమీపంలోనే నివాసముంటున్న శాసనసభ్యుడు దామచర్ల సాయంత్రం 5.30గంటల సమయంలో తీరికగా వచ్చారు. ఎర్రటి ఎండలో మధ్యాహ్నం నుంచి ఎదురుచూసిన వృద్ధులు అన్ని గంటలు షామియానా కింద కూర్చోలేక పైకి లేచ్చారు. నవ నిర్మాణ దీక్షలో శాసనసభ్యుడు పాల్గొన్న అనంతరం ఆయనతో కార్యక్రమాలు నిర్వహించి ఉంటే వచ్చిన కొద్దిమంది అలాగే ఉండేవారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వరుసపెట్టి ప్రసంగాలు చేస్తుండటంతో అప్పటికే సత్తువ కోల్పోయి ఉన్న వృద్ధులు, వితంతువులు ఇక కూర్చోవడం తమవల్ల కాదంటూ బయటకు వెళ్లేందుకు గుంపులుగా లేచారు. ఇది గమనించిన వేదికపై ఉన్న నగరపాలక సంస్థ అధికారులు వారిని కూర్చోపెట్టాలంటూ తమ సిబ్బందిని ఆదేశించారు. ‘ఇక్కడే ఉంటే ప్రాణాలు పోతాయంటూ’ పలువురు వృద్ధులు వారితో వాదనకు దిగుతూ అక్కడ నుంచి బయటకు వెళ్లారు. ఉన్న కొద్దిపాటి మంది వారిని అనుసరిస్తూ బయటకు వెళ్లేందుకు లేవడంతో మున్సిపల్ హైస్కూల్ గేట్లను మూసివేశారు. ఎవరూ బయటకు వెళ్లకుండా అక్కడ ఒక వ్యక్తిని ఉంచారు. అయినా కొంతమంది మహిళలు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, నగర పాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని పంపించి మహిళలు ఎవరూ బయటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. ఇప్పటివరకు తాము ఓపికతో ఉన్నామని, ఇక తమవల్ల కాదంటూ ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగిని ఆమెతో వాదన పెట్టుకొంది. చివరకు ఆ మహిళ తన ఇద్దరు చిన్న బిడ్డలను తీసుకొని బయటకు వెళ్లింది. నవ నిర్మాణ దీక్షకు హాజరైన వారు ఒకరొకరుగా బయటకు వెళుతుండటంతో ఏం చేయాలో పాలుపోని నగర పాలక సంస్థ అధికారులకు చివరకు ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులను బలవంతంగా కూర్చోపెట్టారు. ఇంత జరుగుతున్నా శాసనసభ్యుడు దామచర్ల ఆంజనేయులు మాత్రం తమ పార్టీ నాయకులు చేసే ప్రసంగాలను వింటూ కూర్చున్నారు తప్పితే, ముందుగా ఆయన ప్రసంగం చేసి ఉంటే నవ నిర్మాణ దీక్ష నిర్బంధ దీక్షగా మారి ఉండేది కాదని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల అభివృద్ధి కార్యక్రమాలను వివరించి 830 మందికి సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ బ్రహ్మయ్య, మున్సిపల్ ఇంజినీర్ సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబ్బాబూ.. చప్పట్లు!
తూర్పుగోదావరి, అమలాపురం: నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా ప్రమాణం చేసిన నాలుగేళ్ల తరువాత చంద్రబాబునాయుడు కోనసీమ కేంద్రమైన అమలాపురంలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షకు ప్రజాస్పం దన అంతంత మాత్రంగానే కనిపించిం ది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన బాబు పర్యటన సందర్భంగా రచ్చబండ, విద్యార్థులతో ముఖాముఖి, దళితవాడ పర్యటన, నవ నిర్మాణదీక్ష బహిరంగ సభల్లో చంద్రబాబు చేసిన ప్రసంగాలు ఆకట్టుకోలేకపోయాయి. పైగా స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటన షెడ్యూలు ఖరారు, చేసిన ఏర్పాట్లపై చంద్రబాబే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఆలస్యంగా మొదలై.. ఆలస్యంగానే ముగుస్తుంది. కానీ అమలాపురంలో మంగళవారం బాబు పర్యటన పది నిమిషాలు ఆలస్యంగా మొదలై.. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ముగిసింది. ఉదయం 10.15 నుంచి సాయంత్రం 5.30 వరకు అంటే 7.15 గంటలపాటు చంద్రబాబు అమలాపురం మున్సిపాలిటీ, రూరల్ మండలాల్లోనే గడిపారు. సమనస, రంగాపురం, వన్నెచింతలపూడిలో జరిగిన కార్యక్రమాలకు స్థానికుల హాజరు అంతంత మాత్రమే. పైగా బాబు పర్యటించిన దారి చాలా ఇరుకుగా ఉండడం, భారీ భద్రత, అందుకు తగ్గట్టుగా పెద్ద కాన్వాయి కావడంతో బందోబస్తుకు వచ్చిన పోలీసులు సైతం ఇబ్బంది పడ్డారు. రంగాపురంలో వీరభద్రుని ఆలయం నుంచి శివాలయం వరకు నడుచుకుని వెళ్లే సమయంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ‘మీకు ఆర్గనైజేషన్ చేయడంరావడం లేదు’ రంగాపురం గ్రామదర్శిని ఏర్పాట్లపై చంద్రబాబు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘మీరు చాలా ఉత్సాహంగా వచ్చారు. మీరు ప్రశాంతంగా ఉంటేనేను చెప్పేది అర్థమవుతుంది. కానీ అలా లేదు.. ఆర్గనైజేషన్ బాగుంటే ఇటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఎండలో మీరు ఇబ్బంది పడుతున్నారు’ అని బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీకు ఆర్గనైజేషన్ చేయడం కూడా రావడం లేదు అని అక్కడ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో నిర్వహించే బహిరంగ సభకు జనం పెద్ద ఎత్తున వస్తారన్న అంచనాలు తప్పాయి. రంగులు వేయడం, రోడ్లు వేయడం, ఫ్లెక్స్లు కట్టడం వంటి ఆర్భాటాలు చేశారు తప్ప అమలాపురం నియోజకవర్గ టీడీపీ నేతలు జనాన్ని తరలించే విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. చివరకు పార్టీ కార్యకర్తలు, నాయకుల హాజరు కూడా పెద్దగా లేదు. సభకు వచ్చినవారిలో మూడొంతుల మంది డ్వాక్రా మహిళలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారు. సభలో నేతల ప్రసంగాలకు చప్పట్లు కరువయ్యాయి. నాయకులు సైతం ప్రభుత్వం సాధించిన విషయాలను తక్కువగా చెప్పి... జగన్పై విమర్శలు ఎక్కువ చేశారు. చంద్రబాబు ప్రసంగం సైతం చప్పగా సాగింది. ఏకంగా 1.02 గంటల పాటు ఒకసారి, లబ్ధిదారులకు కార్లు, ఆటోలు పంపిణీ సమయంలో మరో 15 నిమషాలు చంద్రబాబు ప్రసంగించారు. తాను ఎంతో చేశానని, మరోసారి అవకాశం ఇవ్వాలని, 25 ఎంపీ స్థానాలు గెలిపించాలని చంద్రబాబు పదేపదే కోరినా జనం నుంచి పెద్దగా స్పందన లేదు. కర్ణాటకలో బీజేపీని ఓడించింది మనమే కదా తమ్ముళ్లూ అని ఒకసారి, 2019లో బీజేపీని ఓడించి కేంద్రంలో చక్రం తిప్పేది మనమే అని ఒకసారి ప్రసంగం మధ్యలో ఆపి చప్పట్ల కోసం ఎదురుచూశారు. ఈ రెండు సందర్భాల్లోనూ కార్యకర్తల నుంచి స్పందన లేకపోవడంతో చప్పట్లు కొట్టండి అని అడిగి మరీ కొట్టించుకున్నారు. బీజేపీ, వైఎస్సార్ సీపీ కలిసి పనిచేస్తున్నాయా? అని బాబు ప్రశ్నించి చేతులు ఎత్తమన్నా పెద్దగా ఎవరూ చేతులు ఎత్తలేదు. తొలి ప్రసంగం ముగిసిన తరువాత మంత్రి రాజప్ప గుర్తు చేయడంతో చంద్రబాబు అమలాపురం అభివృద్ధికి రూ.25 కోట్లు ఇస్తామన్నారు. అలాగే కోటిపల్లి– ముక్తేశ్వరం వంతెన అంశం పరిశీలిస్తానన్నారు. అంతకుమించి ఈ ప్రాంతానికి చేసేదేమీ చెప్పలేదు. సాగుసమ్మె ప్రస్తావన గతంలో కోనసీమ రైతులు సాగుసమ్మె చేస్తే జాతీయ స్థాయి నుంచి నేతలను తీసుకువచ్చానని, వారి కష్టాలు చూసే రుణమాఫీ చేశానన్న బాబు ఇప్పుడు మరోసారి రైతులు సాగుసమ్మెకు సిద్ధమవుతున్న విషయంపై స్పందించలేదు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసులు అమలు చేయడం లేదన్న బాబు, తాను బోనస్గా క్వింటాల్కు రూ.200 ఇస్తానన్న విషయాన్ని మరిచారు. ఏతా వాతా బాబూ పర్యటన వల్ల సమనసలో అధ్వానంగా ఉన్న రహదారి ఆధునీకరణకు నోచుకుంది. అలాగే చింతలపూడి (సమనస)లాకులు, ఎర్రవంతెన–నల్లవంతెన రోడ్డు రైలింగ్కు కొత్తరంగులు పడ్డాయికాని పెద్దగా ప్రయోజనం లేదని నియోజకవర్గ వాసులు చెప్పుకుంటుండడం కొసమెరుపు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన నవ నిర్మాణదీక్ష సభలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, సుజయ కృష్ణ రంగారావు, ఎంపీలు పండుల రవీంద్రబాబు, తోట నరసింహం, ఎమ్మెల్సీ కె.రవికిరణ్వర్మ, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, పులపర్తి నారాయణమూర్తి, దాట్ల బుచ్చిబాబు, తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. -
జనం సొమ్ముతో స్వీయ భజన
జాతీయ స్థాయిలోనే తనను మించిన సీనియర్ నాయకుడు లేరని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు తన క్యారెక్టర్ గురించి ప్రజలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ‘‘నా చేతికి వాచీ, ఉంగరం లేవు, నా జేబుల్లో డబ్బులు లేవు. నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు, మందుకొట్టలేదు, సిగరెట్ కాల్చలేదు, చెడు స్నేహాలు కూడా చెయ్యలేదు’’ అంటూ ఆయన 68 ఏళ్లు నిండినాక ఈ వివరణలు ఇచ్చుకోవడం ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి అవసరమా? ఇంటి గడప దాటితే ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసే సీఎం చేతికి ఉంగరం ఉందా లేదా, వాచీ పెట్టుకున్నారా లేదా ఎవరిక్కావాలి? నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన నాయ కుడని గెలిపిస్తే నాలుగేళ్ళు గడిచినా వీసమెత్తు పని చెయ్యలేదన్న సత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ధ్రువీకరించదల్చుకున్నట్టు కనిపిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక ఈ నాలుగేళ్ల కాలంలో ప్రతి ఏటా ఒక వారం రోజుల పాటు ప్రజా ధనం వెచ్చించి నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షల్లో ఆయన చేస్తున్న ప్రసంగాలే అందుకు నిదర్శనం. అసలు ఈ దీక్షలు ఇందుకోసం అన్న స్పష్టత బాబుకు అయినా ఉందా అన్న అనుమానం తాను ఈ సంద ర్భంగా చేసే ప్రసంగాలను వింటే అనిపిస్తుంది. తెలంగాణా ఏర్పడ్డాక ఆ రాష్ట్రం జూన్ రెండున అవ తరణ దినోత్సవాన్ని ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నది. తెలంగాణా పోగా మిగిలిన ఏపీకి కూడా ఒక అవతరణ దినోత్సవం ఉండాలి కదా? చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఈ విషయంలో కేంద్ర హోం శాఖను స్పష్టత కోరగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన 1956 నవంబర్ ఒకటినే అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం సూచించింది. నిజానికి అదే ఏపీకి అవతరణ దినోత్సవం జరుపుకోడానికి సరైన తేదీ ఎందుకంటే విడిపోయింది తెలంగాణా ప్రాంతం కానీ ఏపీ కాదు. పోనీ పూర్వపు హైదరాబాద్ రాష్ట్రాన్ని కలుపుకొన్న సందర్భంగా నిర్ణయమైన తేదీ కాబట్టి ఇప్పుడు నవం బర్ ఒకటిని ఎలా అవతరణ దినోత్సవంగా పరిగణి స్తామనే అభ్యంతరం ఉంటే మద్రాసు ప్రావిన్స్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన 1953 అక్టోబర్ ఒకటి అయినా అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒక తేదీన తప్ప కుండా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరగా ల్సిందే. ఏపీ ప్రజలు మాత్రం గత నాలుగేళ్ళుగా అవ తరణ దినోత్సవాలు జరుపుకునే అవకాశాన్ని కోల్పో యారు. పెద్ద రాష్ట్రాలు విడిపోవడం భారతదేశంలో ఇవాళ కొత్తగా జరుగుతున్నది కాదు. గతంలో కూడా పలు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. విడిపోయాక రెండు రాష్ట్రాలూ తమతమ వీలును బట్టి అవతరణ దినో త్సవాలు జరుపుకుంటూనే ఉన్నాయి. కాబట్టి ఏపీకి కూడా అవతరణ దినోత్సవం ఉండాల్సిందే. పోనీ తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగిన జూన్ రెండో తేదీని అవతరణ దినోత్సవంగా ఖరారు చేసు కున్నారు కాబట్టి ఏపీలో చంద్రబాబు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన జూన్ ఎనిమిదిని అవతరణ దినోత్సవంగా పాటించవచ్చని ఎవరైనా సూచించ వచ్చు. రేపు ఇంకో పార్టీ ఎన్నికల్లో గెలిచి ఇంకో తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే అప్పుడు అవతరణ దినో త్సవం ఆ ప్రభుత్వానికి అనుకూలమైన తేదీకి మారు తుందా? తెలంగాణకు కూడా అదే వర్తిస్తుంది కదా అని అనొచ్చు. తెలంగాణలో ప్రభుత్వం మారినా అవతరణ దినోత్సవాన్ని ఇంకో రోజుకు మార్చే వీలు లేదు. ఆ సాహసం ఏ రాజకీయ పక్షమూ చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది అపాయింటెడ్ డేట్న కాబట్టి. మొత్తం మీద ఏపీకి అవతరణ దినోత్సవం లేకుండా పోయింది. నవ నిర్మాణం ఎక్కడ? అప్పాయింటెడ్ డేట్ అయిన జూన్ రెండున మొదలు పెట్టి వారం రోజులపాటు అంటే తాను ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8 వరకూ ప్రతి ఏటా చంద్ర బాబు నవ నిర్మాణ దీక్ష పేరిట చేస్తున్న జాతర ఒక రూపాయి మందమయినా ఏపీ ప్రజల అభివృద్ధికో, సంక్షేమానికో ఉపయోగపడేది కాదు, పైగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా ఖర్చు అవుతోంది. ఏపీకి నవ నిర్మాణం అవసరమే, దానికి అందరూ దీక్ష బూనాల్సిందే. రాష్ట్రాన్ని కష్టాల్లో నుంచి బయ టపడేసి. మళ్ళీ ప్రగతి బాట పట్టించాల్సిందే. ప్రస్తు తం నవ నిర్మాణ దీక్ష నాలుగోది. వచ్చే ఏడాది ఈ సమయానికి ఎన్నికలు ముగిసి పోయి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కొత్త ప్రభు త్వాలు ఏర్పడుతాయి. అధికారం ఎవరికి ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి బాబుకు మళ్ళీ నవ నిర్మాణ దీక్షవారోత్సవం నిర్వహించే అవకాశం వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. నమ్మి నాలుగేళ్లు అధికారం అప్పజెపితే ప్రజలకు ఆయన ఏమీ చెయ్య లేక పోయారనడానికి దీక్షల్లో ఆయన చేస్తున్న ప్రసం గాలే నిదర్శనం. మొదటి మూడేళ్లూ బీజేపీతో స్నేహం కొనసాగింది కాబట్టి దీక్షల్లో ఎన్డీఏ ప్రభు త్వం మీద ఈగ వాలకుండా చూసుకున్నారు. గొప్ప అభివృద్ధిని కేంద్రం సాయంతో సాధిస్తున్నామని ఊదరగొట్టారు. నాలుగో ఏట నవ నిర్మాణ దీక్ష సమయం వచ్చేసరికి బీజేపీతో చెడింది. ఆ పార్టీని తిట్టడానికీ, ప్రతిపక్షాలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పవన్ కల్యాణ్కూ బీజేపీతో లేని సంబంధం అంటగట్టడానికీ తెగ ఆరాట పడిపోతు న్నారు. నవ నిర్మాణ దీక్ష లక్ష్యం ఏమిటి? ఆయన చేస్తున్నది ఏమిటి? రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి రాజధాని లేక, ఆదాయ వనరులు సరిగా లేక, రూ.16 వేల కోట్ల లోటుతో మిగిలిపోయిన మాట వాస్తవం. అందుకే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ బలంగా అందరిలో ఉంది. నిన్నటిదాకా ఆ కోర్కె బలంగా లేనిది చంద్రబాబుకే. నవ నిర్మాణ దీక్షల్లో ప్రతిన బూనాల్సింది రాష్ట్రా నికి ప్రత్యేక హోదా సాధించడానికి పోరాటం చేస్తా మనీ సాధించే వరకూ ఊరుకోబోమనీ, కానీ చంద్ర బాబు చేస్తున్నదేమిటి? ప్రతిపక్షాలను తిట్టిపో యడం, తనకు తాను కాండక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చు కోవడం, కాసేపు తనకు ఏదో ముప్పు రాబోతున్న దనీ, రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది ప్రజలూ తన చుట్టూ వలయంలా ఏర్పడి రక్షించుకోవాలని భయం నటించడం– వీటితోనే నవ నిర్మాణ దీక్షా కాలం గడి చిపోతున్నది. నవ నిర్మాణ దీక్షా కార్యక్రమాల్లో భాగంగా ఆయన సోమవారం విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేటలో తాను మాట్లాడిన మాటలు వింటే రాష్ట్ర నవ నిర్మాణం కాదు తెలుగుదేశం పార్టీ ఇంకా మాట్లాడితే బాబు నిర్మాణా నికి జరుగుతున్న ప్రయత్నంగా అర్థం అవుతుంది. ‘సొంత’ క్యారెక్టర్ సర్టిఫికెట్! జాతీయ స్థాయిలోనే తనను మించిన సీనియర్ నాయకుడు లేరని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు తన క్యారెక్టర్ గురించి ప్రజలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ‘‘నా చేతికి వాచీ, ఉంగరం లేవు, నా జేబుల్లో డబ్బులు లేవు. నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు, మందుకొట్టలేదు, సిగరెట్ కాల్చలేదు, చెడు స్నేహాలు కూడా చెయ్యలేదు’’ అంటూ ఆయన 68 ఏళ్లు నిండినాక ఈ వివరణలు ఇచ్చుకోవడం ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి అవసరమా? ఇంటి గడప దాటితే ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసే సీఎం చేతికి ఉంగరం ఉందా లేదా, వాచీ పెట్టుకున్నారా లేదా ఎవరిక్కావాలి? రాష్ట్ర ఖజానాయే ఆయన జేబులో ఉంటే పిచ్చి పర్సుతో పనేంటి? ఇక ప్రజ లంతా తనకు రక్షణ కవచంలా ఉండాలని కూడా ఆయన వేడుకున్నారు. ప్రజలను పాలకుడు రక్షి స్తాడా, ప్రజలే పాలకుడిని రక్షిస్తారా? ఇంతకూ ఆయనకు రాబోతున్న ముప్పు ఏమిటి? ఆయన మీద జరుగుతున్న కుట్ర ఏమిటి? ఆయనే ప్రజలకు వివ రిస్తే బాగుంటుంది. ఇంకోమాట అదే జమ్మాదేవి పేటలో ఆయన అన్నారు, ‘బీజేతో పొత్తు పెట్టుకున్న వారిని చిత్తుగా ఓడించండి’ అని. అవును ఇప్ప టికయితే ఆయనే కదా బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నది. తననే ఓడించమని పిలుపు ఇస్తున్నారా ప్రజలకు?ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడటానికి ఆయన కోట్లాది రూపాయల ప్రజా ధనం ఖర్చు చేస్తున్నారంటే అర్థం ఏమిటి? నవ నిర్మాణ దీక్షల్లో చెప్పుకోడానికి గత నాలుగేళ్ళుగా తాను రాష్ట్రానికి చేసిందేమీ లేదనీ, భవిష్యత్తులో ఏదో చేసే ఆలోచన కూడా లేదనే కదా. ఐదు లోక్సభ సీట్లకు ఉప ఎన్ని కలొస్తే నంద్యాల తరహా ఆటలు సాగవు! నవ నిర్మాణ దీక్షలను ఆయన ఎన్నికల సభలు చేసేశారు. ఎన్నికలంటే జ్ఞాపకం వచ్చింది ప్రత్యేక హోదా సాధన కోసం లోక్సభ సభ్యత్వాలకు అయిదుగురు వైఎస్ఆర్సీపీ సభ్యులు చేసిన రాజీనామాలు ఆమో దం పొంది ఉపఎన్నికలు రావాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ అయిదు లోక్సభ సీట్లకు మాత్రమే ఎన్నికలొస్తే నంద్యాల స్టయిల్లో నడిపిం చేయవచ్చని అనుకుంటూ ఉండవచ్చు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగిన పరిస్థితి వేరు. భూమా నాగిరెడ్డి చనిపోయిన సానుభూతి కూడా సరిపోక వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అధికార యంత్రాంగం మొత్తాన్ని అక్కడ మోహరింపచేసి తొండి ఆట ఆడిస్తే తప్ప గెలవలేదు. ఈ అయిదు గురు వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలు ఒక వేళ ఆమోదం పొందితే జరిగే ఉప ఎన్నికలు నంద్యాల లాంటివి కాదు. ఒక లక్ష్యం సాధించడం కోసం పద వులను తృణప్రాయంగా త్యజించే వారిని ప్రజలు ఎట్లా అక్కున చేర్చుకుంటారో చంద్రబాబుకు అను భవమే కదా గతంలో. కాంగ్రెస్ అవమానాలను భరించలేక బయటికొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉప ఎన్నికలకు వెళ్ళిన నాయకుల విషయంలో కానీ, తెలంగాణా సాధన కోసం అక్కడ రాజీనామాలు చేసి పోటీ చేసిన నాయకుల విష యంలో కానీ ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశాం కదా. ఆ రెండు సందర్భాల్లోనూ తెలుగు దేశం పార్టీ చాలా చోట్ల డిపాజిట్లు కూడా పోగొట్టు కున్నట్టు గుర్తు. వ్యాసకర్త: దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com -
నవ నిర్మాణ దీక్షలో మహిళకు వేధింపులు
పార్వతీపురం టౌన్ : టీడీపీ చేపడుతున్న నవనిర్మాణ దీక్షలు వేధింపుల దీక్షలుగా మారుతున్నాయి. దీక్షలకు జనాన్ని తీసుకురావాలని ప్రజాప్రతినిధులు అంగన్వాడీ, వెలుగు, ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. జనాలను తీసుకురాని సిబ్బందిపై దుర్భాషలాడుతున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం పురపాలక సంఘంలోని 5వ వార్డులో సోమవారం జరిగిన నవనిర్మాణ దీక్ష వేదిక సాక్షిగా అదే వార్డుకు చెందిన ఓ అంగన్వాడీ కార్యకర్తపై అసభ్యకరంగా మాట్లాడిన వార్డు కౌన్సిలర్ చొక్కాపు వెంకటరావును కార్యకర్త భర్త కొట్టిన సంఘటన సమావేశానికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. సమావేశంలో కౌన్సిలర్ వెంకటరావు మాట్లాడడానికి సిద్ధపడుతుండగా, బాధితురాలైన అంగన్వాడీ కార్యకర్త భర్త కలుగజేసుకుని మహిళలంటే అంత చులకనా నీకు.. ఎంతకాలం వేధింపులకు గురి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో టీడీపీ నాయకులు కలుగజేసుకుని కార్యకర్త భర్తను అక్కడ నుంచి పంపించివేశారు. అంతకుముందు జనాలను తీసుకురావడంలో విఫలమైందని ఆరోపిస్తూ సదరు కౌన్సిలర్ వెంటకరావు అంగన్వాడీ కార్యకర్తను దుర్భాషలాడారు. దీంతో బాధితురాలు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. రాజీ ప్రయత్నాలు జరిగిన విషయంపై అంగన్వాడీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎలాగైనా ఇరువర్గాలను రాజీ కుదర్చి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. నలిగిపోతున్న ఉద్యోగులు... నవనిర్మాణ దీక్షలకు జనాన్ని తీసుకువచ్చే విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు, బీఎల్ఓలు, వెలుగు సిబ్బంది నలిగిపోతున్నారు. మండుతున్న ఎండలో పెడుతున్న సమావేశాలకు జనం తీసుకురావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే అధికార పార్టీ నాయకులు ఎక్కడ మండిపడతారోననే ఉద్దేశంతో సిబ్బంది ఏదో ఒక రకంగా ప్రజలను తీసుకువస్తున్నారు. -
ప్రజలంతా నాకు రక్షణ కవచంలా ఉండాలి
సాక్షి ప్రతినిధి, శృంగవరపుకోట/గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ‘బీజేపీతో పొత్తు పెట్టుకున్నవారికి ఓటేయకండి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నవారిని ఎన్నికల్లో చిత్తుగా ఓడించండి’ అని సీఎం చంద్రబాబు ప్రజలను కోరారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం, జమ్మాదేవిపేటలో సోమవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీకి వ్యతిరేకంగా మహాకుట్ర జరుగుతోందని, ప్రజలంతా తనకు రక్షణ కవచంలా ఉండాలని వేడుకున్నారు. అనంతరం ఎస్.కోటలో నిర్వహించిన నవ నిర్మాణదీక్ష సభకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తనను పొగిడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై విమర్శలు చేస్తూ రాష్ట్రాన్ని బలహీనపరుస్తున్నారని అన్నారు. అసలు పవన్ తననెందుకు తిడుతున్నాడో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అమ్మాయిలతో తిరగలేదు ‘నా చేతికి వాచీ, ఉంగరం లేదు.. జేబులో డబ్బులు లేవు.. నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు.. మందుకొట్టలేదు.. సిగరెట్ కాల్చలేదు.. చెడు స్నేహాలు కూడా చేయలేదు. అలాంటి నన్ను తిడుతుంటే మీ కోసం భరిస్తున్నాను’ అని సీఎం అన్నారు. ప్రధాని మోదీ తిరుపతి వెంకన్న సాక్షిగా అమరావతిని ఢిల్లీ కంటే మిన్నగా అభివృద్ధి చేస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రజలకు, ఏడుకొండలవాడికి ద్రోహం చేశారన్నారు. కర్ణాటకలో బీజేపీకి బలం లేకపోయినా ఎమ్మెల్యేలను కొనడానికి బరితెగించి కోర్టు ఆదేశాలతో చతికిలపడిందని ఎద్దేవా చేశారు. గాలివాన బీభత్సం ఎస్.కోటలో చంద్రబాబు నిర్వహించిన నవ నిర్మాణదీక్ష సభలో గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో భారీ గాలివాన రావడంతో టెంట్లు కూలిపోయి బారికేడ్లు తిరగబడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సభకు అంతరాయం ఏర్పడింది. తర్వాత విద్యుత్ను పునరుద్ధరించడంతో చంద్రబాబు సభనుద్దేశించి ప్రసంగించారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తరలించిన మహిళలు, వృద్ధులు, యువకులు మండుతున్న ఎండలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నానా ఇబ్బందులు పడ్డారు. అనంతరం భారీ వర్షంలో తడిసి ముద్దవడంతో సీఎం ప్రసంగిస్తుండగానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఎంపీ అశోక్గజపతిరాజు, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ శోభా హైమావతి, జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ సహా పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. విశాఖ విమానాశ్రయంలో సోమవారం రాత్రి గోపాలపట్నం, ములగాడ, మహారాణిపేట తహసీల్దార్ కార్యాలయాలను రిమోట్ ద్వారా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందర్నీ కలుపుకుని పోతున్నానన్నారు. కాగా, కళింగ వైశ్యులకు ఓబీసీ రిజర్వేషన్ ప్రభుత్వం ఇచ్చినా విశాఖ జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కళింగ వైశ్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు పూనా ఉమామహేశ్వరరావు ఈ మేరకు విశాఖలో సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్కుమార్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జేసీ సృజన, పోలీస్ కమిషనర్ యోగానంద్, జాయింట్ సీపీ రవికుమార్ మూర్తి, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్రాజు, గణబాబు, పల్లా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ లాలంభవానీ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు నవనిర్మాణ దీక్ష సభకు బ్రేక్
సాక్షి, విజయనగరం : భారీ వర్షం కారణంగా సోమవారం విజయనగరం జిల్లా ఎస్ కోటలో జరగాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష బహిరంగ సభ అర్థాంతరంగా నిలిచిపోయింది. చంద్రబాబు నవనిర్మాణ దీక్ష సభకు చేరకున్న వెంటనే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం మొదలైంది. దీంతో సభాప్రాంగణంలో ఉన్న ప్రజలు చెట్ల కిందకు పరుగులు తీశారు. ఉరుములు, మెరుపుల శబ్ధానికి భయపడ్డ జనం చెట్ల కింద నుంచి సమీపంలోని దుకాణాలు, షెడ్ల కిందకు వెళ్లి బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నారు. ఉదయం భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఆందోళనకు గురయ్యారు. భయంకరమైన ఈదురు గాలుల కారణంగా సమీపంలోని రేకులు ఎగిరి పడుతున్నాయి. -
‘టీడీపీ అంటే టాపిక్ డైవర్షన్ పార్టీ’
సాక్షి, అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించానికే టీడీపీ నవ నిర్మాణ దీక్షలు చేస్తుందని వైఎస్సార్సీపీ నేతలు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన 600 హామీల గురించి ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమస్యలను పక్కదారి పట్టించడం టీడీపీకి అలవాటైన పని అని విమర్శించారు. టీడీపీ అంటే టాపిక్ డైవర్షన్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. బీవై రామయ్య సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని ఆరోపించారు.వైఎస్పార్సీపీ ఎంపీల రాజీనామపై ప్రశ్నించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్ర బాబు 40ఏళ్ల రాజకీయ అనుభవం వేల కోట్ల రూపాయలు లూటీ చేయడానికే పనికొచ్చిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో చేశామన్న అభివృద్ధి మేడిపండును తలపిస్తే.. టీడీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు గురువింద సామెతను గుర్తు చేస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, అతని మంత్రి వర్గం అలీబాబా 40 దొంగల్లాగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. -
ఏపీ ప్రభుత్వం అవినీతి కేరాఫ్ అడ్రస్గా మారింది
-
దీక్ష వద్దు.. సభలూ వద్దు!
వలేటివారిపాలెం: గ్రామంలో చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించకుండా నవనిర్మాణ దీక్షలు పేరుతో సభలు నిర్వహించొద్దని అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. ఈ సంఘటన మండలంలోని కూనిపాలెంలో ఆదివారం జరిగింది. గ్రామంలో నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షను నిర్వహించకుండా అధికారులు గ్రామం విడిచి వెళ్లే వరకూ స్థానికులు ఒప్పుకోలేదు. సమస్యలు పరిష్కరిస్తాం.. అర్జీలు ఇవ్వాలని అధికారులు కోరారు. ఇప్పటికే పలు సార్లు ఆర్డీఓకు, స్థానిక శాసన సభ్యుడికి అర్జీలు ఇచ్చినా ఫలితం కనిపించలేదని, నవ నిర్మాణ దీక్షకు గ్రామానికి వచ్చిన అధికారులు గ్రామంలో ఉన్న సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారని నిలదీశారు. గ్రామానికి పైఎత్తున వాగులో చెక్డ్యామ్ నిర్మించారని, పోకూరు గ్రామానికి చెందిన రైతులు ఎందుకు పగుల గొట్టారని, చెక్ డ్యామ్ నిర్మించే వరకూ గ్రామానికి అధికారులు రావొద్దని తెగేసి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావు వద్దకు అంతా వెళ్లి విషయం చెబితే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు ఉన్నాయని, అందువల్లే చెక్డ్యామ్ పగులగొట్టాల్సి వచ్చిందని సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలతో నిర్మించిన చెక్డ్యామ్ను పగుల గొట్టాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. వర్షాలు లేక పంటలు పండక రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంటే నిర్మించిన చెక్డ్యామ్ పగులుగొట్టి గ్రామంలోని రైతులు ఇబ్బందులు పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో సామాధానం చెప్పాలని గ్రామస్తులు పట్టుబట్టారు. వర్షాలు పడినప్పుడు నీరు నిల్వ చేసుకునేందుకు నిర్మించిన చెక్డ్యామ్ను తిరిగి నిర్మించే వరకు అధికారులు గ్రామంలో నవనిర్మాణ దీక్షలు చేపట్టొద్దని, వెంటనే గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాలని పట్టుబట్టారు. ఫ్లెక్సీని తీసేయాలని డిమాండ్ చేశారు. అధికారులు తొలగించక పోవడంతో గ్రామస్తులు ఫ్లెక్సీని తొలగించి నవనిర్మాణ దీక్ష బహిష్కరిస్తున్నామంటూ అక్కడి నుంచి ఎవరింటికి వారు వెళ్లిపోయారు. చేసేది లేక అధికారులు కూడా తమ కార్యాలయాల బాట పట్టారు. -
‘ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది’
సాక్షి, వైఎస్సార్ కడప : నవనిర్మాణ దీక్షలు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లా లేవని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు విమర్శించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్షలపై ఆ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘రాష్ట్రంలో ఏం సాధించారని నవనిర్మాణ దీక్షలకు దిగారో సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించాలి. కడప జిల్లాకు ఏం సాధించారని చంద్రబాబు కడప పర్యటనకు వస్తున్నారు. అధికారులు కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్ని హామీలు అమలు చేశారో చంద్రబాబు చెప్పాలి. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కచ్చితంగా ఆత్మ క్షోభిస్తుంది. అందరిని మోసం చేసే వ్యక్తి చంద్రబాబు, కానీ ప్రధాని నరేంద్ర మోదీ తనను మోసం చేశారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. గత జన్మభుమికి చేసిన ఖర్చులకు సంబంధించిన నిధులను ఇంతవరకు మంజూరు చేయలేదు. తిరిగి నవనిర్మాణ దీక్షలు చేస్తూ నిధులను వృథా చేస్తున్నారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే ఎప్పుడో రాష్ట్రానికి హోదా వచ్చి ఉండేది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి విశ్వసనీయత గల రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు మాదిరి దొంగ నాటకాలు ఆడటం లేదంటూ’ రఘురామిరెడ్డి, సురేష్ బాబు పేర్కొన్నారు. -
వెలవెలబోయిన నవనిర్మాణ దీక్షలు
నగరి : నవనిర్మాణ దీక్ష పేరిట ప్రభుత్వం నిర్వహించిన శిబిరాలు వెలవెలబోయాయి. నగరి మున్సిపల్ పరిధిలోని 1, 25, 26, 27 వార్డులకు కొండచుట్టు మండపం వద్ద, 3, 4, 5, 6, 22, 23, 24 వార్డులకు పీసీఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నవనిర్మాణ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు సూపర్వైజర్లుగా మేనేజర్ రవికుమార్, ఆర్ఓ ఇమ్రాన్ ఖాన్ను నియమించారు. ఉదయాన్నే వీరు షామియానాలు, చైర్లు వేసి దీక్షా శిబిరాన్ని సిద్ధం చేశారు. కానీ 11 గంటల వరకు కూడా జనం శిబిరాల వద్ద ఎక్కడా కనిపించలేదు. కౌన్సిలర్లు కూడా రాలేదు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవనిర్మాణ దీక్షల్లో అధికారులతో పాటు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. పలువురు కౌన్సిలర్లు కూడా హాజరుకాలేదు. దీంతో అధికారులు ఉన్న జనంతో మమ అంటూ నవనిర్మాణ దీక్షా శిబిరాలను ముగించేశారు. నేలపై కూర్చుని టీడీపీ నాయకుల నిరసన కొండచుట్టు మండపం వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షా శిబిరంలో కమిషనర్, తహసీల్దార్ గైర్హాజరయ్యారంటూ 1వ వార్డుకు చెందిన కౌన్సిలర్ లత, టీడీపీ నాయకులు చలపతి ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శిబిరాలకు అధికారులే రాకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు ఎవరు సమాధానం చెబుతారన్నారు. 1వ వార్డులో ప్రజలకు పట్టాలు ఇవ్వలేదని, తాగునీరు, పారిశుద్ధ్యం సమస్య ఉందని అధికారులు రాకుంటే వీటిని ఎవరికి చెప్పుకోవాలన్నారు. వేదికపై వారికి ఏర్పాటు చేసిన సీట్లను వదిలి నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. నవనిర్మాణ దీక్షకు సందన కరువు విజయపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన నవనిర్మాణ దీక్షకు ప్రజలను నుంచి స్పందన పూర్తిగా కరువైంది. ఎంపీడీఓ బాలగణేష్ ఆధ్వర్యంలో శనివారం పన్నూరు, సూరికాపురంలో నవనిర్మాణ దీక్షలు జరిగాయి. కానీ ఎక్కడా జనం పాల్గొనకపోవడంతో సభలు వెలవెలబోయాయి. అందరికీ అండగా ఉంటాం... పుత్తూరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించి అండగా ఉంటామని ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ పేర్కొన్నారు. శనివారం పుత్తూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నవనిర్మాణదీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు తాను, తన కుమారుడు గాలి జగదీష్ అండగా ఉంటామని వ్యాఖ్యానించారు. దీంతో స్థానిక టీడీపీ వర్గాల్లో అలజడి నెలకొంది. పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ పేరును ప్రస్తావించకపోవడంపై ఆయన వర్గీయులు కంగుతిన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చంద్రన్న బీమా, పింఛన్ల పథకాలు ప్రజల మన్ననలు పొందాయన్నారు. నవనిర్మాణదీక్షలో భాగంగా అందరి చేత మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ భవానీహర్ష, వైఎస్ చైర్మన్ ఆనంగి ఆనంద్, మాజీ చైర్మన్ కరుణాకరన్, మాజీ వైస్ చైర్మన్ ప్రతాప్రాజు, భాస్కర్, గణేష్, నాయకులు జయప్రకాష్ పాల్గొన్నారు. -
నాలుగేళ్లుగాపించను ఇవ్వలేదు
నవ నిర్మాణ దీక్షలో మహిళ రోదన ఒంగోలు సబర్బన్: ‘భర్త చనిపోయాడు... ఒంటరినయ్యాను.. నాలు గేళ్లుగా పింఛను మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా...ఏ ఒక్క అధికారికీ నాపై దయ కలగలేదు. నేనేం పాపం చేశాను’ అంటూ ఒంగోలులో శనివారం జరిగిన నవ నిర్మాణ దీక్ష వద్దకు వచ్చిన ఆలపాటి రాజేశ్వరి అనే మహిళ బోరున విలపించింది. ఇళ్ల స్థలం లేదు... ఇల్లులేదు.. నిలువ నీడ లేక గుడిలో పడుకుంటున్నాను. రేషన్ కార్డు మాత్రం ఆరేళ్ల క్రితమే ఇచ్చారు. ఆధార్ కార్డు కూడా ఉంది. వితంతు పింఛనుకు అన్ని విధాలుగా అర్హురాలిని. ఒంగోలు తహశీల్దార్ కార్యాలయం చుట్టూ నాలుగేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నాను. ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం చుట్టూ కూడా తిరుగుతూనే ఉన్నాను’ అని ఆమె విలవిల్లాడింది. అధికారులను కలిసేందుకు ఆమె ప్రయత్నించటంతో వారు చూసి చూడనట్లు వెళ్లిపోయారు. ప్రకాశం భవన్ ఎదుట రాజేశ్వరి రోదన చూపరులను కలచివేసింది. -
ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వంపై కక్షగట్టారు
రాయచోటి అర్బన్ : విభజన హామీలను అమలుపర్చాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నామన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రప్రభుత్వంపై కక్ష గట్టారని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్రెడ్డి ఆరోపిం చారు. శనివారం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణంలో 1, 2, 31 వార్డుల్లో 4వ విడత నవనిర్మాణదీక్ష సభను నిర్వహించారు. గతంలో జరిగిన తిరుపతి సభలో వేంకటేశ్వరస్వామి సాక్షిగా విభజన హామీలన్ని నెరవేరుస్తానంటూ ప్రధాని ప్రమాణం చేశారన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల ఖాదర్బాష, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవర మురళి, ప్రభుత్వ న్యాయవాది జక్రియాబాష, కమిషనర్ శ్రీనివాసులు, డీఈఈ సుబ్రమణ్యం, హౌసింగ్ ఏఈ హరి పాల్గొన్నారు. రామాపురం : నవనిర్మాణ దీక్షల నిర్వహణ సమయాల్లో మార్పుచేసినట్టు మండల ప్రత్యేకాధికారి చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నవనిర్మాణ దీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్ అనూరాధ, ఎంపీడీఓ విజయరావు, ఎంపీడీఓ సూపరింటెండెంట్ అబ్దుల్రహీం పాల్గొన్నారు. నవనిర్మాణ దీక్షా.. పింఛన్ల పంపిణీనా ? సంబేపల్లె : నవనిర్మాణ దీక్షా.. పింఛన్లు పంపిణీ కార్యక్రమా అని పింఛన్దారులు వాపోతున్నారు. దీక్షలకు జనాలు రాక పోవడంతో కొత్తగా పింఛన్లు ఇస్తామంటూ అధికార పార్టీ నాయకులు, అధికారులు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. శనివారం నాల్గో విడత నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్కిరెడ్డిపల్లె: నవనిర్మాణ దీక్షలో అందరూ భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ రవికుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీరాములు నాయక్, సూపరింటెండెంట్ హైదర్ వల్లీ పాల్గొన్నారు. -
నవ నిర్మాణ దీక్ష.. నవ్వులపాలు
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమం కడప నగరంలో నవ్వులపాలయ్యింది. జనం లేక ఆ సభలు వెలవెలబోయాయి. కడప నగరపాలక సంస్థ పరిధిలో 21 ప్రాంతాల్లో నవనిర్మాణ దీక్ష వేదికలు ఏర్పాటు చేశారు. 44వ డివిజన్ చెమ్ముమియ్యాపేటలో కలెక్టర్ హరికిరణ్ పాల్గొనగా మిగతా ప్రాంతాల్లో కార్పొరేషన్కు చెందిన నోడల్ ఆఫీసర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఒక్క సభకూ పట్టుమని పదిమంది ప్రజలు రాకపోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఖాళీ కుర్చీలు వేసి, వాటిముందు అధికారులు కూర్చున్నారు. సభలకు వచ్చిన వారికి 2వ తేది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం–విభజన హామీల అమలు అనే అంశంపై చర్చ చేపట్టి, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు, నృత్యాలు నిర్వహించి బహుమతులు అందజేయాల్సి ఉంది. అయితే పాఠశాలలకు సెలవులు కావడంతో విద్యార్థులుగానీ, ఇటు తల్లిదండ్రులు గానీ ఈ కార్యక్రమాలకు హాజరు కాలేదు. దీంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణపై అధికారులకు అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా, జనం లేకపోవడంతో వేచి చూసి చూసి అధికారులు మధ్యాహ్నానికే చాప చుట్టేశారు. బాడుగ వృథా అన్ని డివిజన్లలో తప్పనిసరిగా నవనిర్మాణ దీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. 21 ప్రాంతాల్లో వేదికలు, కుర్చీలు, షామియానాలు, ఇతర ఖర్చులు భరించి ఏర్పాటు చేశారు. మొదటిరోజే జనం రాకపోవడంతో వాటికి బాడుగ వృథా అయ్యే పరిస్థితి ఏర్పడింది. ముఖం చాటేసిన టీడీపీ కార్పొరేటర్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అటు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, ఇటు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ముఖం చాటేశారు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు కానివారు వేదికలు ఎక్కినా జనం లేకపోవడంతో వారు కూడా మెల్లగా జారుకున్నారు. కడప నగరపాలక సంస్థ, ఒక రెండు, మూడు శాఖల అధికారులు మినహా తక్కిన అధికారులు, సిబ్బంది కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. 4,5,6, 9,10 డివిజన్లలో నిర్వహించిన సభల్లో జనం లేక 11 గంటలకే అన్నీ కుర్చీలు ఎత్తేశారు. ఈ రెండు డివిజన్లలోనూ టీడీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. మొత్తంపైన ప్రతిచోటా నవనిర్మాణ దీక్ష అభాసుపాలైంది. -
సీఎం పర్యటన రోజంతా... గ్రామంలోనే
కర్నూలు(అగ్రికల్చర్) : నవనిర్మాణ దీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో పర్యటించనున్నారు. రోజంతా గ్రామంలోనే గడపనున్నారు. సీఎం పర్యటన కోసం జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎప్పుడూ కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో జిల్లాకు వచ్చే ముఖ్యమంత్రి ఈ సారి మాత్రం పుట్టపర్తి నుంచి జొన్నగిరికి రానుండడం గమనార్హం. ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకునే ముఖ్యమంత్రి..అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఉదయం 10.30 గంటలకు జొన్నగిరి గ్రామానికి వస్తారు. ఎస్సీ, బీసీ కాలనీల్లో పర్యటిస్తారు. గ్రామసభ నిర్వహిస్తారు. నీరు–చెట్టు, ఉపాధి పనులను తనిఖీ చేయడంతో పాటు రైతులు, కూలీలతో ముఖాముఖి అవుతారు. రాష్ట్రంలో 5 లక్షల ఫాంపాండ్స్ పూర్తి చేసిన సందర్భంగా జొన్నగిరి చెరువు వద్ద నిర్మించిన పైలాన్ను ఆవిష్కరిస్తారు. తాగునీటి పథకం పనులకు శంకుస్థాపన చేస్తారు. ఫొటో ప్రదర్శన తిలకిస్తారు. నవనిర్మాణదీక్షలో భాగంగా జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 5.15 గంటలకు గ్రామం నుంచి తిరిగి వెళతారు. -
ఆవిర్భావ దినోత్సవం ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఏమిచ్చారని ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలకు ఇష్టం లేకుండా రాష్ట్రాన్ని విభజించారు కాబట్టి ఆవిర్భావం కాకుండా నవ నిర్మాణ దీక్ష జరుపుకొంటున్నట్లు చెప్పారు. విజయవాడ బెంజిసర్కిల్ కూడలిలో జాతీయ రహదారిపై శనివారం నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పూర్తిగా అన్యాయం చేస్తే బీజేపీ నమ్మకద్రోహం చేసిందన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హోదా వద్దనేవారు రాష్ట్రంలో ఎవరూ లేరని చెప్పారు. ప్రధానమంత్రి తిరుపతి, నెల్లూరు సభల్లో రాష్ట్రానికి హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ గెలిచిన తర్వాత హోదా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా ఇబ్బందులు పెట్టినా సాగునీటి ప్రాజెక్టులను 54 శాతం పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీకి ధోలేరా, గుజరాత్పై ఉన్న ప్రేమ రాష్ట్రంపై లేదన్నారు. రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చి రూ. 2,500 కోట్లు ఇచ్చామంటున్నారని, విజయవాడ–గుంటూరు నగరాలకు ఇచ్చిన నిధుల్ని కూడా రాజధానికి ఇచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సింగపూర్ ప్రధాని అమరావతి గురించి మన ప్రధానికి చెప్పారంటే ఎలా అభివృద్ధి చేస్తున్నామో తెలుసుకోవాలన్నారు. లాభాలు రావని తెలిసినా ఢిల్లీ–ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు నిధులిచ్చారని, రాష్ట్రంలో ప్రాజెక్టులకు నిధులిచ్చేందుకు మాత్రం లాభాల గురించి అడుగుతున్నారని, ఏపీకి రైల్వేజోన్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రధానిని మెప్పించేందుకు తాను 30 సార్లు సార్, సార్ అని అడుక్కున్నానని చెప్పారు. తనపై మహాకుట్ర పన్నారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో బీజేపీ దివాళా తీసిందన్నారు. తాను కేంద్రంతో విభేదించాక పవన్ కళ్యాణ్ తనపై విమర్శలు చేస్తున్నాడన్నారు. తిరుపతి పరిశుభ్రత ఘనత నాదే.. టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితుల్ని బీజేపీ వాడుకుంటోందని, దేవుణ్ణి కూడా అపవిత్రం చేయాలనకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. వారణాసి అపరిశుభ్రంగా ఉంటుందని, కానీ తిరుపతి పరిశుభ్రంగా ఉంటుందని ఆ ఘనత తమదేనన్నారు. రాష్ట్ర బీజేపీకి ఒక కొత్త అధ్యక్షుణ్ణి పెట్టారని ఆయన బీజేపీకి అద్దె మైకుగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సొంత మైకుగా మారారని చెప్పారు. బీజేపీ కుట్రలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి, ఒక్క పైసా మాత్రం తగ్గించడం ప్రపంచంలో అతి పెద్ద జోక్ అని విమర్శించారు. ఏపీఎన్జీవో నేత అశోక్బాబు సంవత్సరంలో రిటైర్ అవుతున్నారని ఆయన్ను రాజకీయాల్లో ప్రజాసేవ చేసేందుకు రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. భవానీ, అయ్యప్ప, వెంకన్న దీక్షలు చేసినట్లే రాష్ట్రాభివృద్ధికి నవ నిర్మాణ దీక్ష చేయాలని కోరారు. సభకు హాజరైన వారితో ముఖ్యమంత్రి నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు అరకిలోమీటర్ నుంచి వేదిక వద్దకు ముఖ్యమంత్రి ర్యాలీగా వచ్చారు. -
దీక్ష సరే...అవినీతిపై నోరు విప్పరేం?
సాక్షి, అమరావతి: నవ నిర్మాణ దీక్ష పేరిట ఆర్భాటం చేస్తున్న సీఎం చంద్రబాబు తన నాలుగేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై నోరెందుకు విప్పడం లేదని జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు. రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ఈ మేరకు శనివారం ఆయన 20 ప్రశ్నలతో ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వీటిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోని 50 వేల నగరాల్లో ఒకటిగా లేని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ఐదో స్థానంలోకి తెస్తానని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. కేంద్రీకృత అభివృద్ధి ధోరణి మంచిది కాదని పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. ఏపీని అవినీతిలో అగ్రస్థానంలో నిలబెట్టారని మండిపడ్డారు. -
దీక్ష.. ప్రయాణికులకు శిక్ష
సాక్షి, అమరావతి/ సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున బెంజిసర్కిల్ జంక్షన్లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షకు జనస్పందన లేకపోయినా.. భారీ ఎత్తున చేసిన ఏర్పాట్లతో ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. జాతీయ రహదారిపై భారీ టెంట్లు వేసి ఈ దీక్షా సభ నిర్వహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రహదారిపై దూరప్రాంతాలకు కార్లు, బస్సుల్లో వెళ్లే వారు నరకయాతన అనుభవించారు. ఈ సభ కోసం శుక్రవారం రాత్రి నుంచే విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తమిళనాడు, కోల్కతా, హైదరాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ను నగరానికి 50 కిలోమీటర్లే అవతలే దారిమళ్లించారు. ఆంక్షల కారణంగా నగరంలోని ప్రజలు చిన్నచిన్న మార్గాల్లో చుట్టుతిరిగి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ట్రాఫిక్ మొత్తం జామ్ అయి స్థానికులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇటీవలే మహానాడు పేరుతో మూడురోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధించినపుడు ఇబ్బందులు పడ్డామని మళ్లీ ఇప్పుడు నవనిర్మాణ దీక్ష పేరుతో ఇబ్బంది పెట్టారని జనం వాపోయారు. కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. అయితే దీక్ష కార్యక్రమాన్ని హడావుడిగా 10.30 గంటలకే ముగించేశారు. సమావేశం ముగిసిన వెంటనే ట్రాఫిక్ను క్లియర్చేయడానికి పోలీసు సిబ్బందే బారికేడ్లు, టెంట్లు తొలగించారు. జన స్పందన కరువు.. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి పదేపదే ప్రజలకు పిలుపునిచ్చినా పార్టీ కార్యకర్తలు, అధికార యంత్రాంగం తప్ప ప్రజలెవరూ పట్టించుకోలేదు. సభా ప్రాంగణంలో వేయడానికి తీసుకొచ్చిన కుర్చీలను చాలామటుకు తీసుకొచ్చిన లారీల్లోనే ఉంచేశారు. కృష్ణా జిల్లా నలుమూలల నుంచి డ్వాక్రా మహిళలు, అంగన్వాడీలు, ఉపాధి హామీ కూలీలు, విద్యార్థులను తరలించేందుకు 350కి పైగా బస్సులు ఏర్పాటు చేశారు. కానీ ఆ బస్సుల్లో ఎక్కేందుకు గ్రామాల్లో చాలామంది నిరాకరించారు. దీంతో ఉపాధి కూలీలను బలవంతంగా బస్సులు ఎక్కించి తీసుకొచ్చారు. వచ్చిన వారిలో చాలామంది ముఖ్యమంత్రి ప్రసంగం మొదలుకాగానే లేచివెళ్లిపోవడం కనిపించింది. వారిని ఆపడానికి అధికారులు కిందామీదా పడాల్సివచ్చింది. ఈ సభకు 25 వేల మందికిపైగా జనం వస్తారని అధికారులు, టీడీపీ నాయకులు ప్రచారం చేసినా కనీస స్పందన కూడా రాలేదు. నవ నిర్మాణ దీక్షకు ప్రజల నుంచి స్పందన లేదని టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. జిల్లాల్లోనూ ఈ దీక్షా సభలు విఫలమయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సమారు 18 వేల చోట్ల ఈ సభలు జరుపుతామని ప్రకటించి వాటికి నోడల్ అధికారులను నియమించినా మొక్కుబడిగా అక్కడక్కడా జరిగాయి. ఉపాధి కూలీల తరలింపు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో ఉపాధి కూలీలను గ్రామాల్లో ఫీల్డు అసిస్టెంట్లు పని ప్రాంతాలకు తీసుకెళ్లకుండా, సీఎం నవనిర్మాణ దీక్ష కోసం బస్సుల్లో తరలించారు. జిల్లా ఉన్నతాధికారులు మండల, గ్రామ స్థాయిలో జన సమీకరణకు అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. తెల్లవారుజామున నాలుగు గంటలకే బస్సులు గ్రామాలకు చేరాయి. ఉపాధి కూలీలను ఈ బస్సుల్లో ఎక్కించారు. కృష్ణా జిల్లా ముసునూరు, గన్నవరం మండలం నుంచి తరలించిన కూలీలు శిబిరం వద్ద కనిపించారు. వారు ఉపాధి పనులకు హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. -
నవనిర్మాణ దీక్షకు స్పందన కరువు
-
‘నవనిర్మాణం కాదు.. నయ వంచక దీక్ష’
సాక్షి, కమలాపురం: చంద్రబాబు చేపట్టింది నవ నిర్మాణ దీక్ష కాదు నయవంచక దీక్ష అని వైఎస్సార్ సీసీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాలుగేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ఏం అభివృద్ధి చేశారని నవ నిర్మాణ దీక్ష చేపట్టారో వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేసిన వాగ్దానాలు పూర్తిగా విస్మరించి తుంగలో తొక్కారని అన్నారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం.. ఆదాయం తెచ్చిపెట్టే పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం వంటివి చేపట్టి కోట్ల రూపాయలు దండుకున్నారని చంద్రబాబుపై ఆయన ఆరోపణలు చేశారు. కాపులను బీసీల్లో, వాల్మీకీ కులస్తులను ఎస్టీల్లో చేరుస్తామని బాబు మిన్నకుండి పోయారని అన్నారు. మాదిగలకు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ హామీని మరిచారని అన్నారు. ముఖ్యమంత్రి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారనీ, రాబోయే ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని రవీంద్రనాథ్ రెడ్డి జోస్యం చెప్పారు. -
చంద్రబాబు దీక్షలన్నీ ప్రజల్ని మభ్యపెట్టడానికే
-
చంద్రబాబు నవనిర్మాణ దీక్షపై మండిపడ్డ ఐవైఆర్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న నవనిర్మాణ దీక్షపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. నవనిర్మాణ దీక్ష పేరిట చంద్రబాబు గత నాలుగేళ్లుగా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. శనివారం ట్విటర్ వేదికగా ఆయన చంద్రబాబు నవనిర్మాణ దీక్షపై స్పందించారు. నవనిర్మాణ దీక్ష పేరిట టీడీపీ తమ లోపాలను, అసమర్థతలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. మొన్నటివరకు తప్పంతా కాంగ్రెస్దే అన్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నవనిర్మాణ దీక్ష పేరిట బీద అరుపులు అరవాల్సిన అవసరం లేదన్నారు. ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములును స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. -
అశోక్బాబు ప్రజాసేవలోకి రా.. : చంద్రబాబు
సాక్షి, విజయవాడ : ఏపీ ఎన్జీవో ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అశోక్బాబు మరో ఏడాదిలో రిటైరవుతున్నారని, కాబట్టి ప్రజాసేవలోకి (రాజకీయాల్లోకి) రమ్మని ఆయనను ఆహ్వానిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్లో చేపట్టిన నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తిరుమల ఆలయంలో వజ్రం పోయిందంటున్నారని, ఈ విషయంలో సీబీఐ విచారణ పేరుతో అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామిని కూడా తానే కాపాడతానని అన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా బీజేపీలో ఉన్నట్టే మాట్లాడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఎవరు చెప్తే వాళ్లే సీఎం అవుతారని అంటున్నారని, ఇలా బీజేపీ రకరకాలుగా అందరినీ నడిపిస్తోందని విమర్శించారు. ఇవన్నీ చూస్తుంటే హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ నిజమని అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తమపై కుట్ర చేస్తున్నారని, కుట్రలో భాగంగానే పవన్ కల్యాణ్ తనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ‘ఇన్నాళ్లు నేను పవన్ కల్యాణ్కు మంచిగా కనిపించాను. కేంద్రంతో విభేదించగానే పవన్కు చెడ్డగా కనిపిస్తున్నాను.పవన్ కల్యాణ్ను ఉత్తరాంధ్ర పంపి అక్కడ రెచ్చగొడుతున్నారు. నాడు రాష్ట్ర విభజన సమయంలో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడా? అప్పుడేమీ మాట్లాడలేదు. మోదీకి సహకరించాలని 2014లో మాతో వచ్చారు’ అని అన్నారు. బీజేపీ రమణ దీక్షితులను వాడుకుంటోందని ఆరోపించారు. -
నవనిర్మాణ దీక్షలు.. కుర్చీలకు ఉపన్యాసాలు
సాక్షి, కర్నూల్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నవనిర్మాణ దీక్షలు కేవలం అట్టహాస ఏర్పాట్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. జనాలు లేక దీక్షా ప్రాంగణాలు వెలవెలపోతున్నాయి. దీక్షలో జనాలు లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నేతలు మొక్కుబడిగా దీక్షలో కుర్చీలకు ఉపన్యాసాలు ఇస్తున్నట్లు అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పాల్గొన్నారు. అలాగే ఈ దీక్షలు జరుగుతున్న ఇతర జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ప్రజలు లేక ఖాళీ కుర్చీలు నేతలను వెక్కిరిస్తున్నాయి. గుంటూరు : జిల్లాలోని వట్టిచెరుకూరులో నవనిర్మాణ దీక్షలో ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో పాల్గొని నిరసన తెలియజేశారు. శుక్రవారం రాత్రి మాజీ మంత్రి రావెల కిషోర్ ఆఫీసు వద్ద తహశీల్దార్పై జరిగిన దాడికి నిరసనగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నవనిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులపైన దాడులు పెరిగిపోతున్నాయని కొంతమంది ఉద్యోగులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. -
వంచన దీక్ష!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : నవ నిర్మాణదీక్ష పేరుతో జిల్లా కేంద్రంలోని టవర్క్లాక్ వద్ద శనివారం హడావుడి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఏటా ఇలా ప్రచార ఆర్భాటం చేస్తోంది. అధికారం చేపట్టిన కొత్తలో ‘నవనిర్మాణదీక్ష’ చేస్తే కొత్త రాష్ట్రం, కొత్త అవసరాలు, రాష్ట్రాభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులకు మరింత బాధ్యత గుర్తు చేసేలా, ఉత్సాహం నింపేందుకు చేస్తున్నారని అంతా భావించారు. కానీ పాలకులు మాత్రం ఏటా ఈ దీక్ష చేస్తూనే ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నేడు చేయబోయే దీక్ష ఐదేళ్ల ప్రభుత్వానికి ఆఖరిది కానుంది. ఈ క్రమంలో ఇన్నేళ్లుగా చేసిన దీక్షల సారాంశం ఏమిటి..? వీటి వల్ల జిల్లా అభివృద్ధిలో పురోగతి కన్పించిందా..? ప్రజాప్రతినిధుల్లో బాధ్యత పెరిగిందా..? ప్రజా సమస్యలపై అధికారులు చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నారా..? జిల్లా అభివృద్ధికి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరాయా..? అన్న చర్చ జిల్లాలో నడుస్తోంది. రాష్ట్రంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతం అనంతపురం జిల్లా. ఇదే క్రమంలో టీడీపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన జిల్లాల్లో ఇదీ ఒకటి. రెండు ఎంపీ సీట్లు, 12 ఎమ్మెల్యే స్థానాలు, పది మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులకే ప్రజలు పట్టంకట్టారు. ఇలాంటి జిల్లాపై టీడీపీ ప్రభుత్వం ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపాలి..? ప్రజాప్రతినిధులు మరెంత బాధ్యతాయుతంగా మెలగాలి..? కానీ నాలుగేళ్ల ప్రభుత్వ పనితీరును విశ్లేషిస్తే జిల్లాకు తీరని ద్రోహం చేశారనేది స్పష్టమవుతోంది. ఎకరాకు నీళ్లివ్వలేని మంత్రులు, ప్రజాప్రతినిధులు చంద్రబాబు గొప్పతనంపై ఏటా నవనిర్మాణదీక్షల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఊదరగొడుతున్నారు. కానీ నాలుగేళ్లల్లో జిల్లాలో ఒక్క ఎకరాకూ సాగునీరు ఇవ్వలేని అసమర్థమంత్రులుగా పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, గతంలో మంత్రిగా చేసిన పల్లె రఘునాథరెడ్డి మిగిలిపోయారని జిల్లా వాసుల తీవ్రంగా విమర్శిస్తున్నారు. 2012 నుంచి జిల్లాకు కృష్ణాజలాలు వస్తున్నా..ఫేజ్–1 80 శాతం, ఫేజ్–2లో 75 శాతం పనులే పూర్తయ్యాయి. ఏటా 25–30 టీఎంసీల జలాలు వస్తున్నా.. నాలుగేళ్లలో ఎకరా పొలం తడపలేదు. డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని 2015లో ప్రభుత్వం జీఓ 22 జారీ చేయడంతో పనులు నిలిచిపోయాయి. కుప్పంకు నీళ్లు తీసుకెళ్లాలనే లక్ష్యం మినహా ‘అనంత’ రైతుల వేదన ప్రభుత్వానికి పట్టలేదు. హంద్రీ–నీవా ద్వారా జిల్లాలోని చెరువులకు నీళ్లిచ్చామని మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పులు చెప్పుకుంటూ గంగపూజలు చేస్తున్నారు. కనీసం ఆ చెరువుల కింద ఆయకట్టుకైనా సాగునీరు ఇచ్చారా..? వారి గుండెమీద చేయివేసుకుని ప్రశ్నించుకుంటే సమాధానం లేని పరిస్థితి. రైతులకు సాగునీరివ్వాలని ఎమ్మెల్యేలంతా సీఎం వద్దకు వెళ్లి కనీసం ప్రతిపాదన కూడా చేయలేని దౌర్భాగ్యపరిస్థితి. దీనస్థితిలో మున్సిపాలిటీలు ‘అనంత’ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని పది మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. అయితే పట్టణ ప్రాంతాల్లో నాలుగేళ్లలో ఒక్క ఇళ్లూ నిర్మించలేదు. హిందూపురం, తాడిపత్రి, గుత్తితో పాటు దాదాపు అన్ని మున్సిపాలిటీల్లోనూ తాగేందుకు నీళ్లు సరఫరా చేయలేదు. సీఎం బావమరిది బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తోన్న హిందూపురంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 90 శాతం ప్రజలు నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ హామీ నీటిమీద రాతే అయ్యింది. అలాగే డ్రైనేజీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. అనంతపురం కార్పొరేషన్లో పరిస్థితి మరో ఘోరంగా ఉంది. నాలుగేళ్లలో రూ.85 కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఇందులో నగరంలో డివైడర్లు, కొన్నివార్డుల్లో బాగున్న డ్రైనేజీ కాలవల స్థానంలో కొత్త కాలవల నిర్మాణం చేపట్టడం మినహాయిస్తే తక్కిన నిధులతో ఎలాంటి అభివృద్ధి జరిగిందో పాలకవర్గమే చెప్పాలి. పల్లెల్లో కూడా ఇదే పరిస్థితి. కనీస మౌలిక సదుపాయాలు లేక జనం అల్లాడిపోతున్నారు. కనీసం ఇళ్లు కూడా మంజూరు చేయకపోవడంతో ఏటా జన్మభూమి సభల్లో అర్జీలిచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది. గతేడాది జిల్లాకు కొన్ని ఇళ్లు మంజూరైన బిల్లుల పెండింగ్తో క్షేత్రస్థాయిలో నిర్మాణాలు పూర్తికాని పరిస్థితి. ఇచ్చిన హామీలదీ అదే పరిస్థితి రాజధాని ప్రకటన సమయంలో ‘అనంత’ అభివృద్ధికి తనదీ భరోసా అంటూ అసెంబ్లీ సాక్షిగా కొన్ని హామీలు గుప్పించారు. ఎయిమ్స్కు అనుబంధ కేంద్రం నిర్మిస్తామన్నారు. ఇది ఏర్పాటై ఉంటే సామాన్యుడి ఆరోగ్యానికి భరోసా దక్కేది. దీన్ని రాజధాని ప్రాంతానికి తరలించారు. ‘అనంత’ను స్మార్ట్సిటీ చేస్తానన్నారు. ఎలా ఉందో అందరికీ తెలుసు..! టెక్స్టైల్పార్క్, ఫుడ్పార్కు, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ క్లస్టర్, నూతన పారిశ్రామిక నగరం, పుట్టపర్తిలో విమానాల మరమ్మతుల తయారీ పరిశ్రమ నిర్మిస్తామన్నారు. వీటితో పాటు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఎక్కడా వీటి అమలుకు ఉపక్రమించలేదు. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇక పదినెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చనపుడు, జిల్లా ప్రజల బాగోగులు పట్టనప్పుడు... ఏటా ‘నవనిర్మాణదీక్ష’ పేరుతో సత్యదూరమైన ప్రసంగాలు చేయడం, ప్రజలను మోసం చేయడం భావ్యమా..? అని రాజకీయపార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వేదికపై ప్రజాప్రతినిధులు ప్రసంగించి ఇంటికెళ్లిన తర్వాత ఆత్మవిమర్శ చేసుకున్నా.. నాలుగేళ్లలో జిల్లాను ప్రభుత్వం ఎలా విస్మరించిందో స్పష్టమవుతోందని పరిశీకులు చెబుతున్నారు. నవనిర్మాణ దీక్షను ‘వంచన దీక్ష’గా వైఎస్సార్సీపీతో పాటు కాంగ్రెస్, వామపక్ష పార్టీ లు, బీజేపీ విమర్శిస్తున్నాయి. నేటి నుంచి ‘నవనిర్మాణ దీక్ష’ అనంతపురం అర్బన్: జిల్లాలో శనివారం నుంచి ఈ నెల 8 వరకు ‘నవనిర్మాణ దీక్ష’ నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ జిల్లా యంత్రాగం సిద్ధం చేసింది. నవ నిర్మాణ దీక్ష నిర్వహణకు సంబంధించి 14 నియోజవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ జి.వీరపాండియన్ ఉత్తర్వులను శుక్రవారం జారీ చేశారు. ప్రత్యేక అధికారులు వీరే :అనంతపురం నియోజకవర్గానికి ఆర్డీఓ మలోల, రాప్తాడుకు ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, గుంతకల్కు ఎఫ్ఎస్ఓ గాయత్రిదేవి, తాడిపత్రికి సాంఘిక సంక్షేమశాఖ డీడీ లక్ష్మానాయక్, రాయదుర్గానికి హౌసింగ్ పీడీ సెల్వరాజ్, ధర్మవరానికి ఆర్డీఓ విశ్వనాథ్£Š , శింగనమలకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటనారాయణమ్మ, కళ్యాణదుర్గానికి ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, హిందూపురానికి సెరికల్చర్ జేడీ సుబ్బరామయ్య, కదిరికి ఆర్డీఓ రామమోహన్, మడకశిరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, పెనుకొండకు ఆర్డీఓ రామమూర్తి, పుట్టపర్తికి డీఎఫ్ఓ చంద్రశేఖర్ను నియమించారు. -
నాలుగేళ్లుగా వైఫల్యం.. ఇప్పుడు దీక్షలతో మోసం
సాక్షి, అమరావతి: రాష్టవిభజన జరిగి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి ఈ నెల 8తో నాలుగేళ్లు పూర్తవుతోంది. విభజనతో నష్టపోయిన రాష్ట్ర ప్రజలను తొలి రోజు సంతకాల నుంచి సీఎం చంద్రబాబు మోసగిస్తూనే ఉన్నారు. వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీతో పాటు ఎన్నికల్లో 600లకు పైగా హామీలు ఇచ్చి ఆ హామీల్లో ఏవీ అమలు చేయకుండా ప్రజలను నాలుగేళ్లుగా వంచిస్తున్నారు. దీక్షలంటూ దగా చేస్తున్నారు. విభజన తేదీ అయిన జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు నవనిర్మాణ దీక్ష అంటూ రోజుకోరకమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ ఏడాది నవనిర్మాణ దీక్ష తొలిరోజు విభజన చట్టం అమలు తీరు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నాలుగేళ్లుగా విభజన చట్టాన్ని అమలు చేయించడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఎన్నికల ఏడాదిలో తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వంలో నాలుగేళ్లు అధికారాన్ని పంచుకుంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నా విభజన చట్టం అమలు విషయంలో ఏనాడూ ప్రయత్నాలు చేయలేదు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ఇతర కీలక అంశాలను స్వార్థ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తాకట్టు పెట్టారు. ముఖ్యంగా పదో షెడ్యూల్లోని సంస్థల విభజనను నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించినా ఆ సంస్థల విభజన పూర్తి చేయించలేకపోయింది. హోదాపై ఊసరవెల్లిలా రంగులు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ విషయంలో చంద్రబాబు పలుమార్లు మాటమార్చారు. హోదాకు అనుకూలంగా 13వ ఆర్థిక సంఘం కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు అధికారం చేపట్టాక ఏడు నెలల పాటు ఆ సంఘం ఉనికిలోనే ఉంది. ఆ సమయంలో హోదాను సీఎం పట్టించుకోలేదు. ఆతర్వాత కేంద్రం ప్యాకేజీ ఇస్తానంటే ఒప్పుకున్నారు. హోదాపై ఆయన మాటలు మార్చిన విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. దగాపడ్డ రాష్ట్రానికి హోదా సంజీవని అని నమ్మిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ హోదా సాధనకు పలు రూపాల్లో ఉద్యమాలు చేశారు. చివరకు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా తమ ఎంపీలతో రాజీనామా కూడా చేయించారు. వివిధ రకాలుగా ఒత్తిడి పెంచడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకుని ఇప్పుడు హోదా రాగం తీస్తున్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని తామే నిర్మిస్తామని తీసుకుని కాంట్రాక్టు పనులను తమ వారికి ఇప్పించి చంద్రబాబు భారీగా కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఆ పనులపై దృష్టి పెట్టింది. దీంతో ఇపుడు కేంద్రం అడ్డుపడుతోందంటూ ప్రచారం చేస్తున్నారు. టెన్త్ షెడ్యూల్ మాటేలేదు.. రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో ఉన్న 142 సంస్థలకు సంబంధించిన స్థిరచరాస్తుల విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్రానికి అనుకూలంగా తీర్పునిచ్చినా ఆ తీర్పును చంద్రబాబు అమలు చేయించలేదు. తమ భూభాగంలో ఉన్న ఆ సంస్థల నగదు, ఆస్తులన్నీ తమకే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం వాటన్నిటినీ స్వాధీనం చేసుకున్నా.. ప్రశ్నించాల్సిన చంద్రబాబు ఓటుకు కోట్లులో అడ్డంగా దొరికిపోయి అమరావతి వచ్చేశారనే విమర్శలు ఉన్నాయి. 58–42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ ఆ సంస్థల ఆస్తులను, నగదును పంచుకోవాలని, అవి విభజించుకోలేకపోతే కేంద్రమే విభజన చేయాలని ఉన్నత విద్యామండలి కేసులో 2016లోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఆ సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినా చంద్రబాబు ప్రశ్నించే ధైర్యం చేయలేదు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ వేసేందుకు కూడా ఉన్నత విద్యామండలికి చాలాకాలం అనుమతి ఇవ్వలేదు. టెన్త్ షెడ్యూల్ సంస్థలకు సంబంధించి రాష్ట్రానికి రావలసిన వాటా రూ. 25 వేల కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు నివేదిక ఇచ్చినా చంద్రబాబు నిమ్మకునీరెత్తినట్లే ఉన్నారు. రాజధానిలో తాత్కాలిక భవనాలతో సరి రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న నాలుగేళ్లు కేంద్రం నుంచి సరైన సాయం లేకపోయినా ఎంతో వస్తోందని ప్రజలను మభ్యపెట్టారు. కేంద్రం రూ. 2500 కోట్లు ఇస్తే దాన్ని కేవలం తాత్కాలిక భవనాలకు వెచ్చించారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ సాధించడంలో విఫలమయ్యారు. రెవెన్యూ లోటు విషయంలో కేంద్రం లెక్కలకు, రాష్ట్రం లెక్కలకూ పొంతనే ఉండటంలేదు. జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు అయితే ప్రహారీ స్థాయి కూడా దాటలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వం వల్ల ఇప్పటికే ఏర్పాటైన విద్యాసంస్థలు అద్దెభవనాల్లో కాలం వెళ్లదీస్తున్నాయి. కమీషన్లు రావని భోగాపురం ఎయిర్పోర్టు కాంట్రాక్టును చంద్రబాబు ప్రభుత్వం రద్దుచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు అధికారం చేపట్టిన నాలుగేళ్ల తర్వాత కూడా రాష్ట్రం పరిస్థితి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంది. విభజన హామీలను అమలు చేయించడంలో పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నాలుగేళ్ల తర్వాత కూడా నవనిర్మాణదీక్ష అంటూ తమను మోసగించడానికి ప్రయత్నిస్తుండటంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీక్ష పేరిట డ్రామాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. -
నేను ఫ్రంట్ పెడతాను.. పీఎం అవుతానంటే..
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్ణాటకలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో మంతనాలు జరపడాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ‘రాహుల్తో కరచాలనం చేస్తే తప్పేంటి. తన భుజం తట్టాను. మీరు కలిసిన ఆ విధంగానే చేస్తాను. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకురాలు సోనియాలతో నాకు వ్యక్తిగత గొడవలు ఉన్నాయా’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. నవ నిర్మాణ దీక్షపై శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. దేశంలో జరిగిన ఉప ఎన్నికలపై కూడా చంద్రబాబు జోస్యం చెప్పారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాజా ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ పాలన ఎలా ఉందో స్పష్టం చేస్తుందన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికల్లో ఎప్పుడు ఇంత ఘోరంగా ఓడిపోలేదని గుర్తు చేశారు. బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలువదదని బాబు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను కుప్పింగంతులు వేయ్యను.. ఎప్పుడు ఏం చేయ్యాలో నాకు తెలుసు. నేను ఫ్రంట్ పెడతాను. పీఎం అవుతానంటే మీరు రాస్తారు. కానీ ఫూల్ని, బఫూన్ను అవుతా.. అందరం కలసి పని చేయాలి’ అని అన్నారు. అంతే కాకుండా రాష్ట్ర విభజన జరిగిన తీరుపై చంద్రబాబు పాత పాటే పాడారు. రాష్ట్రానికి కాంగ్రెస్ కంటే బీజీపీనే ఎక్కువ అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. రేపటి(జూన్ 2) నుంచి ఏడు రోజులపాటు నవనిర్మాణ దీక్ష కొనసాగుతుందని తెలిపారు. రోజుకో అంశంపై మాట్లాడుతూ దీక్ష కొనసాగిస్తామన్నారు. 4 ఏళ్లలో జరిగిన అంశాలపై నవనిర్మాణ దీక్షలో మాట్లాడుతానన్నారు. కేంద్రం సహకరించక పోయిన అభివృద్ధి అగదంటూ పేర్కొన్నారు. ఈ దీక్ష 5 కోట్ల మంది చేసే పవిత్ర కార్యక్రమం.. శనివారం ఉదయం 9 గంటలకు ఎవరు ఎక్కడున్నా అధికారులు ఈ దీక్షలో పాల్గొనాలని బాబు ఆదేశించారు. -
ఏమిటీ దుబారా?
► నవనిర్మాణ దీక్ష పేరుతో రూ.‘కోట్లు’ కుమ్మరింపు ► ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికలోటుతో సతమతమవుతోందని చెప్పే ప్రభుత్వం అనవసరంగా రూ.కోట్లాది రూపాయలను దుబారాగా ఖర్చు చేస్తోంది. మూడేళ్ల పాలనలో సాధించింది శూన్యమైనా గొప్పల కోసం, కాకి లెక్కలు చెప్పు కునేందుకు నవ నిర్మాణదీక్ష పేరిట వారం రోజుల పాటు ప్రభుత్వం నానా హంగామా చేసింది. ఓ పక్క ఆర్థిక లోటంటూనే రూ.కోట్లు తగలేస్తున్నారు. ఈ దీక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేస్తే అధికారులు మాత్రం రూ.2కోట్ల వరకు ఖర్చయ్యిందంటూ లెక్కలు చూపుతున్నారు. ప్రజాధనం దుబారాపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నవనిర్మాణ దీక్ష పేరిట రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది. ఏమాత్రం తగ్గకుండా హంగు ఆర్భాటంతో పూర్తి చేశారు. తొలిరోజు ప్రతిజ్ఞతో మొదలైన ఈ హంగామా 8వ తేదీ సంకల్ప సభ వరకు సాగింది. ప్రతీరోజూ శాఖల వారీగా సభలు నిర్వహించి కాకిలెక్కలతో లేనిగొప్పలు చెప్పుకున్నారు. గతేడాది చివరి రోజు మాత్రమే భోజనాలు ఏర్పాటు చేయగా ఈసారి ప్రతిరోజు నియోజకవర్గానికి వెయ్యి మందికి తక్కువ కాకుండా భోజనాలు ఏర్పాటు చేశామని, విశాఖపట్నంలో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యక్రమంలో సుమారు 2 వేల మందికి ప్రతిరోజు భోజనా లు ఏర్పాటు చేసినట్టు అధికారులు లెక్కలు చూపించేవారు. ప్రతీరోజూ జనసమీకరణ చేయలేక అధికారులు నానాయాతన పడ్డారు. సొమ్ము ఇవాళ కాకపోతే రేపైనా వస్తుందనే ఆశతో కొంతమంది అధికారులు అప్పోసప్పో చేసి దీక్షల కోసం ఖర్చు పెట్టారు. మరి కొంతమంది అధికారులైతే కింద స్థాయి సిబ్బందిపై భారం మోపి దీక్షలు కాని చ్చారు. కొన్ని నియోజకవర్గాలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు, మరికొన్ని నియోజకవర్గాలకు రూ.ఆరు నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చయిదని లెక్కలు చూపారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా రూ.2కోట్ల వరకు ఖర్చయినట్టుగా చెబుతున్నారు. సిటీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన దీక్షలకయ్యే ఖర్చును జీవీఎంసీ భరించింది. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేదు. ఖర్చు మొత్తాన్ని గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గ పరిధిలోని మూడు లేదా నాలుగు మండలాలకు సమానంగా కేటాయించి ఆయా మొత్తాలను స్థానిక మండలాధికారులు భరించేలా స్థానిక అధికార పార్టీ నేతలు ఆదేశాలిచ్చారు. ఇలా ఒక్కో మండలా నికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు భారం పడిం ది. కాగా రెండురోజుల క్రితం జిల్లాకు కోటి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు నిధులు కూడా జిల్లాకు జమయ్యాయి. అయితే అధికారులు పెట్టిన ఖర్చులతో సంబంధం లేకుండా ఒక్కో నియోజక వర్గానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశా రు. మిగిలిన 25 లక్షలను జిల్లా కేంద్రంలో ఖర్చు పెట్ట డంతో పాటు అరకులోయలో సీఎం పర్యటన ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చు కింద మినహాయించారు. వరుసగా ఎనిమిది రోజుల భోజనాలకే రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చయిందని, ఇతర ఖర్చులన్నీ కలిపితే రూ.15 లక్షల వరకు అయిందని, నియోజక వర్గానికి రూ.5 లక్షలు ఏ మూలకు సరిపోతుందని సంబంధిత అధికారులు ప్రశ్నిస్తున్నారు. కానీ నియోజక వర్గానికి 5 లక్షలకు మించి ఇచ్చే అవకాశం లేదని, ఆ మేరకు బిల్లులు కూడా సమర్పించాల్సి ఉంటుం దని జిల్లా ప్రణాళికాధికారి రామశాస్త్రి తెలిపారు. -
ఏపీ నంబర్ వన్
2050 నాటికి ప్రపంచంలో మనమే అగ్రగామి నవ నిర్మాణ దీక్ష ముగింపులో సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘మీ తలరాతలు మారుస్తా.. మీ తలసరి ఆదాయాన్ని పెంచుతా.. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలబెడతా.. 2050 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం కోటి ఏడు లక్షల రూపాయలను అందించి తెలుగోడి సత్తా చూపిస్తా’నని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కృష్ణా జిల్లా విజయవాడ బెంజ్ సర్కిల్లో చంద్రబాబు ప్రారంభించిన నవ నిర్మాణ దీక్షను తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గురువారం ముగించారు. సభకు హాజరైన జనంతో మహా సంకల్ప దీక్ష పేరుతో సీఎం ప్రతిజ్ఞ చేయించారు. అదే సందర్భంలో పొగరహిత వంట ఇంధన వినియోగ రాష్ట్రంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2022 నాటికి దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా చేసి తలసరి ఆదాయాన్ని మూడు లక్షలకు పెంచుతానన్న చంద్రబాబు.. 2029 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా చేసి తలసరి ఆదాయాన్ని రూ.10 లక్షలకు తీసుకు వెళతానన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ 2050 నాటికి ప్రపంచంలోనే ఏపీని ముందుకు తీసుకుపోయి తలసరి ఆదాయాన్ని కోటి ఏడు లక్షలకు పెంచుతానని మాట ఇస్తున్నానన్నారు. రాబోయే వెయ్యి, రెండువేల ఏళ్ల వరకు చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి రాజధానిని నిర్మిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇందుకోసం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ను ఒక వినూత్నమైన కార్యక్రమంగా అభివర్ణించారు. ఒక్క పైసా తీసుకోకుండా 33 వేల 500 ఎకరాలను అప్పజెప్పి రూ.40 వేల కోట్ల ఆస్తిని రాష్ట్రానికి సమకూర్చారన్నారు. అందుకే అమరావతిని ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ సిటీని చేసి చూపిస్తానని చెప్పారు. అమ్మకు వందనం పథకం... అ అంటే అమ్మ, ఆమెను ఎంతో గౌరవించాలనే ఉద్ధేశంతో తల్లులకు పాదాభివందనం చేసేలా ‘అమ్మకు వందనం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ పథకం ద్వారా అమ్మకు బడి పిల్లలతో వందనం చేయించే ప్రక్రియ చేపడుతున్నామని చెప్పారు. 2018కల్లా కాఫర్ డ్యాం పూర్తి సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన కాఫర్ డ్యామ్ పనులను 2018 నాటికి పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం కాఫర్డ్యాం పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ఈ పనులు చేపట్టే జెట్ గ్రౌండింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అక్కడ నిర్మించే ఐకానిక్ బ్రిడ్జికీ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాఫర్ డ్యాంను వందేళ్లపాటు వరదల్ని తట్టుకునే సామ ర్థ్యంతో నిర్మించేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 70 శాతం మట్టిపనులు పూర్తయ్యాయని, మిగిలిన పనుల్నీ అనుకున్న సమయంకంటే ముందే పూర్తి చేస్తామని తెలిపారు. 2018కి మొదటిదశ పనులు పూర్తవుతాయని, 2019కి ప్రాజెక్టును పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కాగా, పట్టిసీమద్వారా ఈ సీజన్లో 100 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు మళ్లిస్తామని ఆయన పేర్కొన్నారు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతలను ఆగస్టు 15న ప్రారంభిస్తామని, చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. -
నవనిర్మాణ దీక్ష నవ్వుల పాలు! ’
– అభివృద్ధి అంటూ ప్రజాప్రతినిధుల ఊకదండపు ఉపన్యాసాలు – కార్యక్రమాలకు సామాన్య ప్రజలు హాజరు అంతంతే - అధికారులు, పొదుపు మహిళలు, విద్యార్థులతో సరిపెట్టిన వైనం మూడేళ్లలో ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. జిల్లాలో ఒక్క పరిశ్రమ వచ్చింది లేదు. ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చింది లేదు. సరికదా వందల సంఖ్యలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించారు. వరస కరువులతో అల్లాడుతుంటూ కరువు సహాయక చర్యలు చేపట్టలేదు. ఉపాధి కరువై కూలీలు వలసబాట పట్టారు. హంద్రీ– నీవా రెండో దశ పనులు పూర్తి చేసే సూచనలు కనిపించలేదు. పేదలకు ఒక్క ఇళ్లు నిర్మించలేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే అభివృద్ధి బాటలో ఉన్నామంటూ... ముఖ్యమంత్రి నిద్రాహారాలు మాని కృషి చేస్తున్నారంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ‘నవ నిర్మాణ దీక్ష’ కార్యక్రమంలో గొప్పలకు పోయారు. ఒక రకంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సోత్కర్షతోనే ఏడు రోజుల కార్యక్రమం ముగిసింది. - అనంతపురం అర్బన్ ‘నవ నిర్మాణ దీక్ష’ కార్యక్రమాలు ఈ నెల 2 నుంచి గురువారం వరకు జరిగాయి. తొలి రోజున ప్రతిజ్ఞ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంతో ముగిసింది. ముఖ్యమంత్రి ప్రసంగం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే కార్యక్రమానికి హాజరైన పొదుపు మహిళలు, విద్యార్థులు సభ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తప్పనిసరై కూర్చున్నారు. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రోజుకు ఒక అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోందంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఐదు రోజుల పాటు జరిగిన సమీక్ష కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం కనిపించలేదు. సమీక్ష అంశానికి సంబంధించిన రోజున ఆయా వర్గాలకు చెందిన వారిని కార్యక్రమానికి అధికారులు తరలించారు. నవ నిర్మాణ దీక్ష ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కావడంతో ఉద్యోగుల భాగస్వామ్యం తప్పనిసరయ్యింది.ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్, డీఆర్డీఏ శాఖల అధికారులు, సిబ్బంది ఏడు రోజుల కార్యక్రమాన్ని తలపై మోశారు. నవ నిర్మాణ దీక్ష వల్ల ఒరిగిందేమి లేదని, ఒక రోజుతో సరిపెట్టాల్సిన కార్యక్రమాన్ని ఏడు రోజుల పాటుు నిర్వహించడంతో తాము తీవ్ర ఇబ్బందికి గురయ్యామని పలువురు అధికారులు, సిబ్బంది వాపోయారు. ఇబ్బంది పడిన ప్రజలు దీక్షలో భాగంగా ఏడు రోజుల పాటు జరిగిన కార్యక్రమాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సమీక్ష కార్యక్రమాలు నిర్వహించడంతో ముఖ్య అధికారులందరూ పాల్గొనడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు కదలలేదు. రోజూ క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లే ఆర్డీఓలు, తహసీల్దార్లు నవనిర్మాణ దీక్షకు పరిమితయ్యారు. దీంతో మండలాల్లో రెవెన్యూ కార్యాలయాలకు వివిధ పనులపై వచ్చే ప్రజలకు అధికారులు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వారి పనులు పెండింగ్లో ఉండిపోయాయి. అలాగే ప్రతి సోమవారం కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల స్థాయిలో నిర్వహంచే మీ కోసం కార్యక్రమం రద్దయింది. దీంతో పలువురు ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టరేట్, డివిజన్, మండల స్థాయి కార్యాలయాలకు వచ్చి ఊసూరుమంటూ వెనుతిరిగారు. నిధులు ఇవ్వని ప్రభుత్వం నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం తరపున అధికార యంత్రాగం ఆర్భాటంగా నిర్వహించింది. అయితే కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని తెలిసింది. దీంతో అధికారులు తమ పలుకుబడిని ఉపయోగించి నిర్వహణ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వాటికి బిల్లులు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. ‘మహా సంకల్పం’లో ఉద్యోగులే దీక్ష చివరి రోజున గురువారం జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలో మహా సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎస్ఎస్బీఎన్ కళాశాల ఆవరణలో ‘మహా సంకల్పం’ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, వారి సిబ్బంది తప్పని సరిగా హాజరు కావాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాలు ఇచ్చారు. అంతే కాకుండా హాజరు పట్టిక కూడా ఏర్పాటు చేశారు. హాజరు కాని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. దీంతో తప్పని సరిగా ఉద్యోగులందరూ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక పొదుపు సంఘాల మహిళలను, విద్యార్థులను అధికారులు తరలించారు. -
హమ్మయ్య..దీక్షలు ముగిశాయి!!
సాక్షి, విజయవాడ : నవ నిర్మాణ దీక్షలు రేషన్ డీలర్లు, కార్డుదారులకు ఇక్కట్లు తెచ్చిపెట్టాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారం రోజులు పాటు నిర్వహించిన నవనిర్మాణదీక్షలకు పౌరసరఫరాల శాఖ అధకారులు, రేషన్ డీలర్లతోపాటు కార్డుదారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజులుగా ఇబ్బందులు పడ్డ వారు గురువారంతో దీక్షలు ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో 5వేల మంది తరలింపు నవనిర్మాణ దీక్షలకు జిల్లా వ్యాప్తంగా సుమారు 5వేల మంది రేషన్ డీలర్లు, తెల్లకార్డుదారులు హాజరైనట్లు డీలర్లు చెబుతున్నారు. ఇందులో సుమారు 1500 మంది డీలర్లు పాల్గొన్నారు. జిల్లాలో 2161 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. ఒకొక్క మండలంలో 35 నుంచి 50 వరకు రేషన్ షాపులు ఉన్నాయి. మండలాల వారిగా డీలర్లు, తెల్లకార్డుదారులు దీక్షల సదస్సులకు హాజరుకావాలని అధికారులు హుకుం జారీ చేశారు. తొలుత డీలర్లు సీరియస్గా తీసుకోకపోయినా అధికారుల నుంచి వత్తిడి పెరగడంతో ఏ కన్వెన్షన్ సెంటర్కు వెళ్లి హాజరువేయించుకుని సాయంత్రం వరకు ఉండక తప్పలేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనియన్కు నాయకత్వం వహిస్తున్న వారు తెల్లకార్డుదారులను కూడా తప్పకుండా తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడంతో వారితో పాటు ఒకటి రెండు రోజులు కార్డుదారులను కూడా తీసుకువెళ్లారు. ఎక్కువగా రేషన్ డీలర్లే దీక్ష సమావేశాల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఇక పౌరసరఫరాల జిల్లా స్థాయి అధికారులు నుంచి సర్కిల్ స్థాయి అధికారులు, ఆర్ఐలు అంతా సమావేశ మందిరం వద్దనే ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాశారు. ఏ నిముషంలో ఏ ఉన్నతాధికారి పిలుస్తారోనని వేచి చూశారు. దీంతో సరుకులు పంపిణీ ఏ విధంగా జరుగుతోందో దృష్టి పెట్టలేకపోయారు. సరుకులు పంపిణీకి ఇబ్బంది నెల మొదటి వారంలో నవనిర్మాణ దీక్ష సభలు జరగడంతో రేషన్ డీలర్లు ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు తెల్లకార్డుదారులు సరుకుల కోసం రావడం, మరొకవైపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశం పాల్గొనాల్సి వచ్చింది. కొంతమంది ప్రత్యామ్నాయంగా మరొక వ్యక్తితో సరుకు పంపిణీ చేయించగా, ఎక్కువ మంది మాత్రం దుకాణాలు మూసి వేశారు. నగరంలో రెండు సర్కిల్స్లోనూ ఇటువంటి ఇబ్బందులు వచ్చాయి. సరుకులు తక్కువ... ప్రచారం ఎక్కువ.... గతంలో రేషన్ దుకాణాలు ద్వారా కందిపప్పు, పామాయిల్, బియ్యం, పంచదార, గోధుమలు ఇచ్చేవారు. ప్రస్తుతం బియ్యం తప్ప ఇంకా ఏ ఇతర సరుకులు ఇవ్వడం లేదు. దీంతో కార్డుదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నిర్వహించే నవనిర్మాణదీక్షలకు హాజరుకావాలని హుకుం జారీ చేయడంపై కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అప్పులు చేసి ఇస్తున్నాం
6వ రోజు నవ నిర్మాణ దీక్షలో ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు సాక్షి, అమరావతి: పెన్షన్, రేషన్ కార్డుల కోసం రెండు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి మరీ లంచాలు ఇవ్వాల్సి వస్తోందని, సచివాలయానికి వచ్చి ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండటం లేదంటూ ప్రజలు బహిరంగంగా చెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో బుధవారం జరిగిన ఆరవ రోజు నవ నిర్మాణ దీక్షావేదిక దీనికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. ముఖ్యమంత్రి ప్రజా పరిష్కార వేదిక నెంబర్ 1100కు ఫోన్ చేయడం ద్వారా ప్రయోజనం పొందిన వారిని జిల్లాల నుంచి ఎంపిక చేసిన తీసుకొచ్చి చెప్పించాలనుకున్న అధికారుల ప్రయత్నం బెడిసికొట్టింది. కుటుంబ ఆస్థి తగాదాల కోసం పోలీసులను ఆశ్రయిస్తే లంచం తీసుకొని వారి ఎదుటి పక్షానికి వత్తాసు పలుకుతున్నారని, చివరికి వడ్డీకి అప్పు తెచ్చి రూ.500 లంచం ఇస్తే కానీ పెన్షన్ రాలేదంటూ పొద్దుటూరు నుంచి వచ్చిన శ్రీరంగ ప్రసాద్ చెప్పారు. రేషన్ కార్డులో భార్యపేరు తప్పుగా ఉందంటే ఎమ్మార్వో రూ.1,000 లంచం అడిగారని, 1100కి ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి తిరిగిచ్చారే కానీ పని కాలేదని కృష్ణా జిల్లాకు చెందిన భూపతి శివశంకరరావు ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ నుంచి వచ్చిన వెంకట నారాయణ కథ అయితే మరీ దారుణం. తండ్రి చనిపోతే తల్లికి వితంతు పెన్షన్ కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పని కావడం లేదని, నాన్న చనిపోయాడనడానికి ఆధారాలు కావాలంటూ వేధిస్తున్నారని, రెండు రోజులుగా మిమ్నల్ని కలుద్దామన్నా కుదరడం లేదని, చివరికి ఊరికి వెళ్లడానికి డబ్బులు లేకపోతే రాత్రంతా విజయవాడ బస్టాండ్లోనే పడుకున్నా అంటూ గద్గద స్వరంతో చెప్పడంతో అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. వెంకటనారాయణకు వెంటనే రూ.25 వేలు ఆర్థిక సాయం అందించారు. తాను ఎంత కష్టపడుతున్నా కొంతమంది అవినీతి అధికారుల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని చెప్పారు. జూన్లోగా లంచాలు తీసుకున్న వారందరూ ఆ మొత్తాలను వెనక్కి ఇచ్చేయాలని, జూలై నుంచి అవినితీ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. -
పంట నష్టం పట్టకుండా నవ నిర్మాణ దీక్షలా?
- ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కొత్తపేట: అర్ధాంతరంగా వచ్చిన సుడిగాలి, వానతో వందలాది ఎకరాల్లో అరటి, కంద తదితర పంటలు నేలమట్టమై రైతులు నష్టపోతే వారిని పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు నవ నిర్మాణ దీక్షలకు పరిమితమవుతారా?అని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వచ్చిన గాలివానకు నియోజకవర్గ పరిధిలోని వందలాది ఎకరాల్లో అరటి, కంద తదితర పంటలు నేలమట్టమయ్యాయి. మంగళవారం జగ్గిరెడ్డి కొత్తపేట మండలం వాడపాలెం, వానపల్లి లంక ప్రాంతాల్లో పర్యటించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు వచ్చారా? నష్టాన్ని అంచనా వేశారా?అని జగ్గిరెడ్డి రైతులను ప్రశ్నించారు. ఇంతవరకూ ఎవరూ రాలేదని తెలపడంతో ఆయన అమలాపురం ఆర్డీఓ జి.గణేష్కుమార్కు ఫోన్ చేసి అధికారుల తీరును వివరిస్తూ వెంటనే పంట నష్టాలు నమోదు చేసి పంపిస్తే కనీసం ఇన్పుట్ సబ్సిడీ అయినా ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భగా విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరు రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఉందన్నారు. ఐదు రోజులుగా అధికారులను నవనిర్మాణ దీక్షల పేరిట ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శించారు. పంట నష్టాలపై జిల్లా కలెక్టర్ను కలుస్తామని, అవసరమైతే వైఎస్సార్సీపీ తరఫున ప్రభుత్వంపై పోరాడతామని చెప్పారు. జగ్గిరెడ్డి వెంట వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి , జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్, మండల సేవాదళ్ కన్వీనర్ గూడపాటి ప్రవీణ్కుమార్, వాడపాలెం గ్రామ పార్టీ అధ్యక్షుడు గనిశెట్టి శేఖర్, పార్టీ రైతు విభాగం నాయకుడు పెదపూడి శ్రీనివాస్ ఉన్నారు. -
రసాభాసగా నవనిర్మాణ దీక్ష
కర్నూలు: నంద్యాలలో నిర్వహించిన నవనిర్మాణ దీక్ష రసాభాసగా ముగిసింది. అధికార పార్టీ నేతల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో మహిళలు ఇక్కట్లు ఎదుర్కొవాల్సి వచ్చింది. మధ్యాహ్నం 2.30 గంటలకు వరకు ఇన్చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు హాజరుకాకపోవడంతో విసిగిపోయిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఇళ్లకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఎవరినీ వెళ్లనీయకుండా అధికారులు గేట్లు వేశారు. దీంతో అధికారులతో వారందరూ వాగ్వాదానికి దిగారు. ఎంతసేపు కూర్చోబెడతారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నవనిర్మాణ దీక్షకు జనం రాకపోవడంతో అధికారులు విద్యార్థులను తరలించారు. సెలవుల్లో ఉన్న విద్యార్థులను దీక్షకు తరలించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నవనిర్మాణ దీక్షపై సీఎం టెలికాన్ఫరెన్స్
అమరావతి: సకాలంలో వర్షాలు పడటం శుభసూచకమంటూ.. ప్రభుత్వ కృషికి ప్రకృతి సహకారం తోడైతే ప్రతి రంగంలో అద్భుత ప్రగతి సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇస్రో విజయం, సివిల్స్ విద్యార్ధుల విజయాలు స్ఫూర్తిదాయకాలన్నారు. రాష్ట్రంలో రూ. 4లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని, 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని, అన్ని ఎంవోయూలు గ్రౌండ్ అయితే 30 లక్షల మందికి ఉపాధి వస్తుందని చెప్పారు. మాన్యుఫ్చాక్చర్ హబ్గా మన రాష్ట్రం తయారు కావాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ ఏర్పడాలని, ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలని ఆకాంక్షించారు. వంద శాతం కరెంటు కనెక్షన్లు, వంద శాతం వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో అందరికీ వంద శాతం ఇంటి స్థలాలు, సొంత ఇళ్లు కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామం, వార్డులో పెండింగ్ సమస్యలను గుర్తించి వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి కుటుంబంలో భరోసా, భద్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూడేళ్లలో చేసిన పనులను నవనిర్మాణ దీక్షలలో చర్చనీయాంశాలు చేశామని సీఎం చెప్పారు. ప్రభుత్వం చేసిన పనులపై ప్రజలు సంతృప్తి చెందాలని, అప్పుడే వ్యవస్థల పట్ల వారిలో నమ్మకం పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. నవ నిర్మాణ దీక్షలను విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో రేపటి మహా సంకల్పాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టెలికాన్ఫరెన్స్లో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
దేశంలో నేనే సీనియర్ నాయకుడిని
నవ నిర్మాణ దీక్ష’లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేను ఎవరికీ భయపడను సాక్షి, అమరావతి: దేశంలో తానే సీనియర్ రాజకీయ నాయకుడినని, ఎవరికీ భయపడనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వాన్ని గౌరవిస్తానని చెప్పారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా సోమవారం విజయవాడ ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో సంక్షేమం, నిరుపేదల స్వయం ఉపాధి తదితర అంశాలపై సీఎం ప్రసగించారు. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని చూసి తాను భయపడుతున్నానంటూ విమర్శలు చేస్తున్నారని, అయితే తానెవరికీ భయపడనని పేర్కొన్నారు. గుంటూరు సభలో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదాలో ఏముందో స్పష్టం చేయలేకపోయారని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 21 మంది అభ్యర్థులను ముఖ్యమంత్రి సన్మానించారు. వారిలో ఇద్దరు అభ్యర్థులు తమ అనుభవాలను సమావేశానికి హాజరైన ప్రజలకు వివరించారు. -
నేడు మంత్రి కాలువ శ్రీనివాసులు రాక
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మంగళవారం కర్నూలుకు రానున్నారు. ఆరోజు వివిధ నియోజకవర్గాల్లో జరిగే నవనిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. అనంతపురం నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10.30 గంటలకు నంద్యాల చేరుకొని అక్కడ నిర్వహించే నవనిర్మాణ దీక్ష సభలో, ఆళ్లగడ్డలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం కర్నూలు చేరుకొని ఇక్కడ జరిగే నవనిర్మాణ దీక్షలో పాల్గొంటారు. -
బీజేపీతో బాబుది అవకాశవాద పొత్తు
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి సాక్షి, అమరావతి: అవకాశవాద రాజకీయాల్లో చంద్రబాబు దిట్ట అని, గత ఎన్నికల్లో గెలిచేందుకు, తనపై కేసులు లేకుండా చేసుకునేందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి విమర్శించారు. తాను సంతకం చేయడం వల్లే తెలంగాణ వచ్చిందని హైదరాబాద్లో చెప్పిన చంద్రబాబు విజయవాడ నవ నిర్మాణ దీక్షలో మాత్రం నవ్యాంధ్రకు జూన్ 2న బ్లాక్డేగా చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజ్యసభ సభ్యుడు డి.రాజా, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కె.రామకృష్ణలతో కలసి సురవరం విజయవాడ దాసరి భవన్లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభకు ఎవరూ వెళ్లవద్దని చెప్పడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమన్నారు.ఇప్పటికైనా కల్లబొల్లి మాటలను కట్టిపెట్టి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఏపీకి ప్రత్యేక హోదాను కల్పించేందుకు పార్లమెంటు బయటా, వెలుపలా ఒత్తిడి పెంచాలని హితవు పలికారు. 17 పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి.. రాష్ట్రపతి ఎన్నికల విషయమై ఇటీవల 17 రాజకీయ పార్టీలు సమావేశమై చర్చించినట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు డి.రాజా చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే లౌకిక సెక్యూలర్ భావాలు కలిగిన వ్యక్తిని రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ నిలుపుతామని వెల్లడించారు. -
వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చుదాం
జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గూడూరు: సాంకేతిక పరిజా్ఞనాన్ని ఉపయోగించుకొని వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చుకుందామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రైతులకు పిలుపునిచ్చారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక ఎలిమెంటరీ పాఠశాల ఆవరణలో ‘వ్యవసాయం –అనుబంధ రంగాలు అనే అంశంపై సదస్సునిర్వహించారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి మల్లికార్జున అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ... ప్రస్తుతం వ్యవసాయరంగం కష్టతరంగా మారిందన్నారు. అధిక పెట్టుబడుల జోలికి వెళ్లకుండా తక్కువ పెట్టుబడితో పంటలు సాగు చేయాలన్నారు. ఉద్యాన వన పంటలు , కూరగాయల సాగుపై దృష్టిసారించాలని సూచించారు. డ్రిప్ , స్పింక్లర్ల సేద్యం అలవాటు చేసుకోవాలని కోరారు. అనంతరం వ్యవసాయ, దాని అనుంబంధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో కర్నూలు ఏడీఎ రమణారెడ్డి, డ్రిప్ ఇరిగేషన్ ఏడీ ఫయాజ్ , మండల నోడల్ అధికారి సత్యనారాయణ, ఎంపీపీ ఈశ్వరమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ కె.రామాంజినేయులు, కోడుమూరు, గూడూరు, సి.బెళగల్ , కర్నూలు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఓలు పాల్గొన్నారు, -
నవ నిర్మాణ సభలో తమ్ముళ్ల రగడ
- ఎమ్యెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న విష్ణు వర్గీయులు - కలెక్టర్ సమక్షంలో వాగ్వాదం గూడూరు: తమలోని విభేదాల కారణంగా తెలుగు తమ్ముళ్లు ఆదివారం రచ్చకెక్కారు. ఇందుకు గూడూరులో ఏర్పాటు చేసిన నవనిర్మాణ సదస్సు వేదికైంది. సాక్షాత్తు కలెక్టర్ సమక్షంలోనే పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ నెల 2 నుంచి పట్టణంలో నవనిర్మాణ తాలుకా స్థాయి సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సదస్సుకు కోడుమూరు ఎమ్యెల్యే ఎం.మణిగాంధీతో పాటు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఇతర అధికారులు హాజరయ్యారు. సభలో ఎమ్యెల్యే ప్రసంగిస్తుండగా టీడీపీ కోడుమూరు ఇన్చార్జి డి.విష్ణువర్దన్రెడ్డి వర్గీయులు మాజీ వైస్ ఎంపీపీ కరుణాకరరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ కె.రామాంజినేయులు, మరి కొందరు అడ్డు తగిలారు. పట్టణవాసుల దాహార్థిని తీర్చేందుకు కృషి చేస్తున్నామమని, ఇందుకోసం బుడగలవాని చెరువును ఎస్ఎస్ ట్యాంక్ మార్చే విషయంపై శనివారం చెరువును పరిశీలించానని, సీఎంతో మాట్లాడి అందుకు కృషి చేస్తానని ఎమ్యెల్యే చెబుతుండగా విష్ణు వర్గీయులు అడ్డు చెప్పారు. ఎస్ఎస్ ట్యాంక్ ప్రతిపాదనను విష్ణువర్దన్రెడ్డి గతంలోనే ప్రభుత్వానికి నివేదించారని, కొత్తగా ఇప్పుడు చేసిందేంటి అంటూ వాదనకు దిగారు. ఎమ్యెల్యే, ఆయన వర్గీయులు డి.సుందరరాజు, మరికొందరు ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళం ఏర్పడంది. నియోజకవర్గ ప్రత్యేకాధికారి మల్లికార్జున జోక్యం చేసుకుని ఇరు వర్గీయులను వారించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
సీఎం మాట్లాడుతుండగానే గోడ దూకి వెళ్లిపోయారు
-
చంద్రబాబుకు షాక్.. నిలదీసిన మహిళలు!
-
దేవుడు ఆదేశించాడు..నేను చేస్తున్నా
- భగవంతుడే రాజధాని, పోలవరం కట్టమన్నాడు - నవ నిర్మాణ దీక్ష రెండోరోజు సదస్సులో చంద్రబాబు సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయమని భగవంతుడు తనను ఆదేశించాడని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఒక రాజధానిని కట్టమని, ఒక పోలవరం ప్రాజెక్టును కట్టమని దేవుడు తనను ఆదేశించాడని అన్నారు. అందుకే తాను కష్టపడుతున్నానని చెప్పుకొచ్చారు. నవ నిర్మాణ దీక్షల రెండోరోజు శనివారం విజయవాడలోని ‘ఏ’ కన్వెన్షన్ హాలులో విభజన చట్టం హామీల అమలుపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. మూడేళ్ల క్రితం కాంగ్రెస్ అడ్డంగా మన పొట్ట కొట్టిందని అన్నారు. ఈ మూడేళ్లలో రాష్ట్రం దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగా అభివృద్ధి చెందినా ఆదాయం మాత్రం బాగా తక్కువగా ఉందని చెప్పారు. బాధాకరంగా జరిగిన విభజన వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. చేయాల్సిన నష్టమంతా చేసి ఇంకా గాయం మానక ముందే దాని మీద కారం చల్లడానికే రాహుల్గాంధీ వస్తున్నాడన్నారు. మన పొట్టకొట్టిన కాంగ్రెస్ను శాశ్వతంగా భూస్థాపితం చేయాలని, వారికి ఎవరూ సహకరించకూడదని, ఆ పార్టీ మీటింగ్కు వెళితే రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లేనని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చింది రూ.3,980 కోట్లే ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.3,980 కోట్లు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. రాజధానికి 1,500 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ.1,050 కోట్లు, విజయవాడ, గుంటూరు డ్రెయిన్లకు వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, దానికి సమానమైన ప్యాకేజీ ఇస్తామనడంతో ఒప్పుకున్నానన్నారు. పోలవరం కాఫర్ డ్యామ్కు ఈ నెల 8వ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. -
ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే
-
చంద్రబాబుకు షాక్.. నిలదీసిన మహిళలు!
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నవనిర్మాణ దీక్షలో చేదు అనుభవం ఎదురైంది. విజయవాడలో శనివారం జరిగిన నవనిర్మాణ దీక్షలో టీడీపీ పాలనలో నెలకొన్న అవినీతిపై నేరుగా సీఎం చంద్రబాబునే మహిళలు ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అవినీతి వల్ల తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీ సభ్యులు సంతకాలు పెట్టడానికి డబ్బులు అడిగారని శిరీష అనే దళిత మహిళ సీఎం ముందు తన గోడు వెళ్లబోసుకుంది. తాను డబ్బులు ఇవ్వలేకపోవడంతో ఉద్యోగం ఇవ్వలేదని, ఇలాగైతే పేదలకు ఎలా న్యాయం జరుగుతుందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇళ్లు, పెన్షన్ల మంజూరులో అవినీతి జరుగుతున్నదని మచిలీపట్నానికి చెందిన వెంకటేశ్వరమ్మ అనే మహిళ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అవినీతి కారణంగా తన భర్తకు 60 ఏళ్లు నిండినా పెన్షన్ రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకే
రాజమహేంద్రవరం: పార్లమెంటు తలుపులు మూసివేసి విభజన చట్టాన్ని మనపై బలవంతంగా రుద్దారన్న అంశాన్ని రాష్ట్రంలో కాకుండా లోక్సభలో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎంపీలతో తీర్మానం ప్రవేశపెట్టించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సూచించారు. మూడేళ్ల తర్వాతైనా చంద్రబాబు ఈ విషయంపై మాట్లాడడాన్ని స్వాగతిస్తూ దీనిపై నవ నిర్మాణ దీక్ష ప్రజలు కాదు, చంద్రబాబు చేపట్టాలని కోరారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చట్టాన్ని చట్టబద్ధంగా చేసేందుకు మళ్లీ పార్లమెంట్లో ఆమోదించాలని పేర్కొన్నారు. ఇప్పడు చట్టంలో ఏమీ లేవని చెబుతున్నారో అవన్నీ చేర్చవచ్చన్నారు. తప్పును సరిదిద్దకపోతే ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ ఎంపీలతో రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టించి రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిలదీయాలని సూచించారు. 2015లో ఇదే విషయమై తాను రాష్ట్రపతికి లేఖ అందజేశానని పేర్కొన్నారు. సంఖ్యా బలం లేకుండా చేసిన చట్టం చెల్లదని, ఈ విషయమై సుప్రీంలో తాను వేసిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకోసం సమాచారమంతా సేకరించానని పేర్కొన్నారు. తీర్మానం ప్రవేశపెడితే ఈ సమాచారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు అందజేస్తానని తెలిపారు. మోదీ అంటే భయం లేకపోతే తీర్మానం ప్రవేశపెట్టించాలన్నారు. అందుకు మద్దతు తెలపకుండా ప్రతిపక్షం కూడా తప్పించుకోలేదన్నారు. బీజేపీ, మోదీ, కేసీఆర్కు భయపడడానికి ప్రధాన కారణమైన ఓటుకు నోటు కేసులో జరిగింది ఒప్పుకోవాలని చంద్రబాబుకు సూచించారు. తెలంగాణలో మీ పార్టీని, అనుచరులను కాపాడుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నమే రాష్ట్రానికి గ్రహణంలా పట్టి పీడిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దీక్ష చేయాల్సింది ప్రజలు కాదని చంద్రబాబు దీక్షకు పూనుకోవాలని సూచించారు. -
మంత్రి పదవిని వదులుకుంటా..
►నవ నిర్మాణ దీక్ష సభలో మంత్రి అయ్యన్న కీలక వాఖ్యలు ►నిజాన్ని చెప్పడంలో దేనికైనా సిద్ధమంటున్న మంత్రి ►రాష్ట్ర అభివృద్ధిలో అధికారులు సహకరించాలని వినతి నర్సీపట్నం : తాను నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మంత్రి పదవినైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శనివారం జరిగిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న మంత్రి అయ్యన్న విశాఖ నగరంలో జరిగిన భూ కుంభకోణంపై స్పందించారు. తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని, దీనిపై తనకు ఎటువంటి నష్టం జరిగినా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. భూ దోపిడిదారులను విశాఖ ప్రజలు తరిమి తరిమి తన్నేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అదేవిధంగా ఏజెన్సీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి అధికంగా జీతాలు తీసుకుంటున్నా, వీరింతా విధులకు ఎగనామం పెట్టి నర్సీపట్నంలో వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. అన్ని విధాలుగా అభివృద్ధికి సహకరించాల్సిన అధికారులే ఈ విధంగా వ్యవహరిస్తే రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందని మంత్రి ప్రశ్నించారు. విభజన జరిగిన తరువాత రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా సీఎం చంద్రబాబు నిధులు కేటాయింపులు చేస్తున్నారన్నారు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి గడచిన రెండేళ్లలో 11,500 కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మాణం చేశామని ఆయన పేర్కొన్నారు. దేశంలో మిగిలిన 28 రాష్ట్రాల్లో ఇంతటి అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. దీనికి కేంద్రం ప్రత్యేకంగా అభినందించినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న 4,500 అంగన్వాడీ భవనాలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో 10లక్షల గృహాలను నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి చేసి విశాఖకు పోలవరం జలాలను తీసుకువస్తామన్నారు. పోలవరం జలాలు రావడంతో జిల్లా కొత్తగా 70 పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ఈ పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఇలాంటి ప్రభుత్వ కార్యాక్రమాలన్నీ సజావుగా సాగాలంటే అధికారుల సహకారం తప్పనిసరిగా ఉండాలని ఆయన కోరారు. నర్సీపట్నం మెయిన్ రోడ్డును వంద అడుగుల మేర విస్తరిస్తామన్నారు. పది మంది తిట్టుకున్నా...,90 శాతం మంది ప్రయోజనార్ధం రోడ్డు విస్తరణ చేసి తీరుతానన్నారు. -
నవ నిర్మాణదీక్ష అట్టర్ ఫ్లాప్
-
మంత్రి పితానికి చుక్కెదురు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : నవ నిర్మాణ దీక్ష సాక్షిగా తెలుగుదేశం పార్టీలో అధిపత్య పోరు బయటపడింది. జిల్లా కేంద్రం ఏలూరులో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పితాని సత్యనారాయణకు మాట్లాడే అవకాశం దక్కలేదు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి సందేశం ఉంటుందన్న సమాచారంతో జెడ్పీ చైర్మన్ ప్రసంగించిన అనంతరం మత్రి పితాని సత్యనారాయణతో మాట్లాడించాలని నిర్ణయిం చారు. మైక్ తీసుకున్న జెడ్పీ చైర్మన్ ఏకబిగిన 40 నిమిషాల పాటు ముఖ్యమంత్రి సందేశం ప్రారంభమయ్యే వరకూ మాట్లాడుతూనే ఉన్నారు. ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుర్పించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి సందేశం మరో గంటకుపైగా సాగటంతో మంత్రి పితాని సత్యనారాయణకు అవకాశం లేకుండాపోయింది. పితానికి ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే జెడ్పీ చైర్మన్ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. డుమ్మాకొట్టిన తమ్ముళ్లు మరోవైపు జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన కూడళ్లలో నవ నిర్మాణ దీక్ష సభలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సభలకు తెలుగు తమ్ముళ్లు ఎక్కడా పెద్దగా హాజరుకాకపోవడంతో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలను, డ్వాక్రా మహిళలను తరలించారు. ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన సభకు జనం రాకపోవడంతో ఉపాధి హామీ పనుల నుంచి ఇళ్లకు వెళ్తున్న కూలీలను ఓ అధికారి ఆపి కూర్చోబెట్టారు. మధ్యలో వెళ్లిపోతున్న కూలీలకు కూల్ డ్రింక్లు, మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేసి సభ అయ్యే వరకు కూర్చోబెట్టారు. దీనికోసం ఐకేసీ సిబ్బంది నానాకష్టాలు పడ్డారు. పాలకొల్లులో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మెయిన్ రోడ్డుపై నవ నిర్మాణ దీక్ష శిబిరం ఏర్పాటు చేయడంతో అటుగా రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గజలక్ష్మి సెంటర్, కుక్కల గుడి వద్ద ట్రాఫిక్ను నియంత్రించడంతో అవస్థలు పడ్డారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్కు సహకరించండి : జవహర్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని సహకరించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ కోరారు. ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన నవ నిర్మాణ దీక్షను మంత్రులు పితాని సత్యనారాయణ, జవహర్ జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. జవహర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన గత ప్రభుత్వం ఏపీని ఆర్థికంగా దెబ్బతీసి సమస్యల సుడిగుండంలో పడేసిందన్నారు. ఆ ఘటనలను ఒకసారి గుర్తు తెచ్చుకుని రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విశ్లేషించుకునేందుకు నవ నిర్మాణ దీక్ష దోహదపడుతుదన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్ని ర్మించుకునేందుకు నవ నిర్మాణ దీక్ష సాక్షిగా ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి తనకున్న పరిపాలనా దక్షతతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు ఎస్పీ వి.రత్న, డీఆర్ఓ హైమావతి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, మేయర్ షేక్ నూర్జాహాన్, ఆర్డీఓ జి.చక్రధరరావు, ఎంపీపీ మోరు హైమావతి పాల్గొన్నారు. తొలుత పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ర్యాలీ నిర్వహించి ఫైర్స్టేషన్ సెంటర్కు చేరుకున్నారు. -
17 లక్షల కోట్లు.. అవన్నీ రాకపోవచ్చు
ఎంఓయూలపై నవ నిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు - ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తుపెట్టుకున్నాం.. - మోదీ ప్రచారంతో ప్రజల నమ్మకాన్ని పొందాము.. - జూన్ 2 ఏపీకి చీకటి రోజు.. అందుకే నిర్మాణ దీక్ష - పెన్షన్లలోనూ అవినీతి.. అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా.. - మాట వినని ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఇటీవల కుదుర్చుకున్న రూ.17 లక్షల కోట్ల విలువైన ఎంఓయూల్లో అన్నీ రాకపోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వచ్చిన వాటితోనే రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం నవ నిర్మాణ దీక్ష సభలో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం సీఎం మాట్లాడారు. దేశానికి మోదీ, రాష్ట్రానికి టీడీపీ అవసరం అని గుర్తించి గత ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, మోదీతో రాష్ట్రంలో సభలు నిర్వహించి ప్రజల నమ్మకాన్ని పొందామని అన్నారు. తన తెలివి, అనుభవం, కష్టం మీ కోసం ఉపయోగిస్తానని, కాంగ్రెస్పై కసిగా పని చేద్దామని పిలుపునివ్వడంతో ప్రజలు పట్టం కట్టారన్నారు. గతంలో ఆరున్నరేళ్లు 29 మంది ఎంపీలను ఇచ్చి వాజ్పాయ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. 2009 నుంచి 2014 వరకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేసిందన్నారు. జూన్ 2 ఇటలీకి స్వాతంత్య్రం వచ్చిన రోజు అని, తెలంగాణ ఏర్పడిన రోజు అని, ఈ రోజున వారు పండుగ చేసుకుంటే ఏపీకి చీకటి రోజు కావడంతో దీక్షను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ నెల 3 నుంచి 7 వరకు విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో పలు అంశాలపై చర్చగోష్టులు కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోను కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఈ నెల 8న కాకినాడలో మహా సంకల్ప సభ నిర్వహిస్తామని ప్రకటించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ మొదలు తాజా విభజన వరకు జరిగిన పరిణామాలను ముఖ్యమంత్రి వివరించారు. కష్టకాలంలో సైతం అభివృద్ధి సూచికలో 5వ స్థానంలో ఉన్నామని, తలసరి ఆదాయం రూ.1.62 లక్షలు సాధించామన్నారు. హోదాకు సమానమైన ప్యాకేజీకి అంగీకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, హోదాలో ఉండేవన్నీ ప్యాకేజీలో ఇస్తామంటేనే అంగీకరించానని ముఖ్యమంత్రి చెప్పారు. పోలవరం ముంపు మండలాలు విలీనం చేయకపోతే తనకు పదవి అవసరం లేదని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని తాను నిర్మొహమాటంగా చెప్పడంతోనే కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చిందన్నారు. కేంద్రం ఇస్తామన్న 11 జాతీయ విద్యా సంస్థల్లో 9 వచ్చాయని, రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. పోలవరం, అమరావతి తనకు రెండు కళ్లు అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దుతానన్నారు. ఏపీని ఇండస్ట్రియల్ హబ్గా, రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేస్తానన్నారు. అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగిని డబ్బు వెనక్కు ఇవ్వాలని తొలుత హెచ్చరిస్తామని, మాట వినకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పెన్షన్లలోనూ అవినీతి జరుగుతోందని, పెన్షన్కు డబ్బులు వసూలు చేస్తున్న ఒక అధికారిని హెచ్చరించగా అతను పది మందికి డబ్బులు తిరిగి వెనక్కు ఇవ్వడం తనను ఆశ్చర్యపరచిందన్నారు. రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు పి.అశోక్బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి సీహెచ్ మురళీకృష్ణ సత్కరించారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, శాసన మండలి మాజీ చైర్మన్ చక్రపాణి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్, మంత్రులు నారా లోకేశ్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, మహిళా కమిషన్ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి, నగర మేయర్ కోనేరు శ్రీధర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనం లేక వెలవెల నవనిర్మాణ దీక్ష జనం లేక వెలవెలబోయింది. ఏకంగా 50 వేల మంది దీక్షకు హాజరు కానున్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. కనీసం 2 వేల మంది కూడా రాకపోవడంతో సీఎం, మంత్రులు కంగుతిన్నారు. వేదికకు మూడు వైపులా రోడ్డుపై పెద్ద ఎత్తున వేసిన కుర్చీలు ఖాళీగా ఉండటంతో సభ ప్రారంభానికి ముందే ట్రక్కుల్లో వెనక్కు పంపించారు. వేదికకు రెండు వైపులా ఉన్న వారిని ఎదురుగా ఒకచోట ఉండేలా చూడాలని డీజీపీని సీఎం ఆదేశించారు. అయినా కుర్చీలు నిండక నిర్వాహకులు డీలాపడ్డారు. సభకు ముందు బందరు రోడ్డులో నిర్వహించిన ర్యాలీలోనూ జనం లేరు. కాగా, జాతీయ రహదారిపై సభలు జరపకూడదన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిత్యం రద్దీగా ఉండే బెంజి సర్కిల్లో సభ జరపడంపై విమర్శలు వచ్చాయి. వాహనాలను వేర్వేరు మార్గాల్లో మళ్లించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సభకు వచ్చిన అరకొర జనం కూడా ఉక్కపోత భరించలేక మధ్యలోనే వెనుదిరిగారు. ముఖ్యమంత్రి తడబాటు ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు కూడా భాగస్వాములు. టీచర్లు కూడా భాగస్వాములు. వాళ్లకు కూడా న్యాయం జరగాలి. అదే సమయంలో అందరూ కలసి నీతిలేక.. అంటూ ముఖ్యమంత్రి తడబడి, వెంటనే సవరించుకుంటూ.. అవినీతి లేని ప్రభుత్వం కోసం పని చేయాల్సి ఉందన్నారు. చంద్రబాబు తడబాటుపై సభికులు చర్చించుకున్నారు. 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ప్రతిజ్ఞ చేయించారు. -
నారావారి నయవంచక దీక్ష
హైదరాబాద్: నవ నిర్మాణదీక్ష పేరుతో సీఎం చంద్రబాబు నాటకాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. రాష్ట్రం విడిపోయి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సంబరాలు చేసుకుంటారా అని ప్రశ్నించారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కొత్త రాష్ట్రం ఏర్పడినందుకు తెలంగాణ ప్రజలు ఒకరోజు సంబరం చేసుకుంటుంటే, ఏపీని అడ్డగోలుగా విభజించినందుకు ఏడు రోజులు సంబరాలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పబ్లిసిటీ కోసమే చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘నవనిర్మాణ దీక్ష కాదు, నారా వారి నయవంచన దీక్ష’ అని పేర్కొన్నారు. చంద్రబాబు పరిపాలనతో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, మూడేళ్ల ఆయన పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్లిందని ధ్వజమెత్తారు. మిత్రపక్షమే ఛీకొట్టిన ఈ ప్రభుత్వం నవనిర్మాణ దీక్ష ఎందుకు చేస్తోందని నిలదీశారు. టీడీపీతో జతకట్టడాన్ని ‘భస్మాసుర పొత్తు’ అని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానించాయని గుర్తు చేశారు. ఇసుక నుంచి రాజధాని వరకు అంతా అవినీతేనని ఆరోపించారు. చంద్రబాబు ఎలాంటి అవినీతి చేయలేదని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. అవినీతిపై పోరాటం చేయాలంటున్న బాబు వ్యాఖ్యలను మిలీనియం జోక్గా ఎమ్మెల్యే రోజా వర్ణించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అవినీతి సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. దీక్షల పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నారని, ప్రజల సొమ్ముతో ఎన్ని దీక్షలైనా చేయగలరని మండిపడ్డారు. చంద్రబాబును నిలదీసి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. -
ఎండుటాకులు!
మండుటెండలో పింఛన్ల పంపిణీ - పడిగాపులు కాస్తే తప్ప అందని సొమ్ము - వేళాపాళా పాటించని అధికారులు - ఇళ్ల వద్ద పంపిణీ ఒట్టిదే.. - నీళ్లు, నీడ కూడా ఏర్పాటు చేయని వైనం డోన్ పట్టణంలో గురువారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేశారు. శుక్రవారం కూడా అలాగే ఇస్తారని భావించి చాలా మంది పండుటాకులు, దివ్యాంగులు ఉదయం 6 గంటలకే కనీసం టీ కూడా తాగకుండా పింఛన్ కోసం చేరుకున్నారు. ఉదయం 10 గంటలైనా పింఛన్ ఇచ్చేవారు రాలేదు. ఎందుకు రాలేదంటే.. నవ నిర్మాణ దీక్షకు వెళ్లారని సమాచారం అందింది. విషయం తెలుసుకున్న కొందరు విలేకరులు స్థానిక మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఆయన పింఛన్ పంపిణీ అధికారులను కార్యాలయానికి పంపించారు. ఆలూరులోని ఎస్సీ కాలనీలో ఉన్న మార్కెమ్మ దేవాలయం వద్ద సామాజిక పింఛన్ల కోసం వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఉదయం 7 గంటలకే వచ్చి కూర్చున్నారు. ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 12 గంటలైనా అధికారులు రాలేదు. కనీసం టిఫిన్ కూడా చేయకుండా వచ్చిన లబ్ధిదారులు ఇంటికి వెళ్దామంటే అధికారులు వస్తారేమోనని అలాగే కూర్చున్నారు. కొందరైతే సొమ్మసిల్లి అక్కడే కూలబడిపోయారు. సాయంత్రం 5 గంటలైనా అధికారులు ఎవ్వరూ రాకపోవడంతో ఉసూరుమంటూ ఇంటిముఖం పట్టారు. మొత్తం పింఛన్లు : 3,30,607 వృద్ధాప్య : 1,26,288 వితంతు : 1,37,745 దివ్యాంగులు : 43,114 చేనేత : 3,712 కల్లుగీత : 220 అభయహస్తం : 19,528 కర్నూలు(హాస్పిటల్)/డోన్/ఆలూరు: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ తీరు లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఉద్యోగులు తమ వీలు చూసుకుని చేపడుతున్న పంపిణీతో వృద్ధులు, వికలాంగులు చుక్కలు చూడాల్సి వస్తోంది. ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నం కనిపించని పరిస్థితి. లబ్ధిదారులను ఒక చోటకు పిలిపించి పంపిణీ చేపడుతున్నారు. ఇదేమంటే.. వారే వస్తున్నారని బుకాయిస్తున్నారు. తామే ఇంటికి వస్తామంటే ఇంతటి అవస్థలు పడు ఎందుకు వస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం కరువవుతోంది. పింఛన్ల కోసం రెండు మూడు రోజులు తిరిగితే కానీ చేతికందడం లేదు. పంపిణీ కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుండటంతో ఎండ తీవ్రతతో సొమ్మసిల్లి పడిపోతున్నారు. వేసవి నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా పింఛన్లు పంపిణీ చేసే ప్రాంతాల్లో షామియానాలు, షెల్టర్ ఏర్పాటు చేయడంతో పాటు మంచినీళ్లు అందివ్వాల్సి ఉంది. ఈ బాధ్యతను స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలకు అప్పగించారు. కానీ జిల్లాలో ఎక్కడా ఇలాంటి సదుపాయాలు కల్పించిన దాఖలాల్లేవు. జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీనికి తోడు ఉక్కపోత అధికమైంది. ఫలితంగా పింఛను కోసం వచ్చిన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి అవస్థలను చూసి పలుచోట్ల పింఛను పంపిణీ ఉద్యోగులే సొంత డబ్బుతో నీటి వసతి కల్పిస్తున్నారు. పొద్దున్నే టీ తాగకుండా వచ్చిన గురువారం పొద్దున 6గంటల నుంచే పింఛన్లు ఇచ్చారంట. ఈ ఇసయం తెల్సుకుని ఈ రోజు(శుక్రవారం) నేను కూడా ఆరు గంటలకే వచ్చిన. పది గంటలైనా పింఛన్ ఇచ్చే వాళ్లెవ్వరూ రాలేదు. అదేదో దీక్షకు పోయినారంట. ఆ ఇసయం మాకు ముందే సెబితే లేటుగా వచ్చేవాళ్లం కదా నాయనా. పొద్దున్నుంచి కనీసం టీ కూడా తాగకుండా ఈడకు వచ్చినం. – హనుమక్క, డోన్ ఇండ్ల కాడికి రానేరారు మా లాంటి చేతగానోళ్లకు ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్ ఇయ్యాలంట. కానీ ఎవరొస్తున్నారు. యానాడూ ఇండ్లకాడికి వచ్చిందే లేదు. ఈడికి వచ్చినా రెండు, మూడు రోజులు తిప్పుకుంటున్నారు. వచ్చినా కూడా గంటల తరబడి ఎదురుసూడాల. దాహం వేసినా నీళ్లిచ్చేటోళ్లు లేరు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాల. – గోవిందమ్మ, డోన్ -
నవ నిర్మాణ దీక్ష వెలవెల!
- సీఎం ప్రసంగం మొదలవగానే ఇంటిబాట పట్టిన విద్యార్థులు, మహిళలు - టవర్క్లాక్ వద్ద ట్రాఫిక్ నియంత్రణతో ఇబ్బందిపడిన ప్రజలు అనంతపురం అర్బన్ : ప్రభుత్వ యంత్రాంగం ఎంతో ఆర్భాటంగా శుక్రవారం నిర్వహించిన ‘నవ నిర్మాణ దీక్ష’ వెలవెలబోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 10 గంటలకు విజయవాడలో దీక్ష ప్రతిజ్ఞ చేసి ప్రసంగం ప్రారంభించారు. ఆ లైవ్ ఇక్కడ మొదలవగానే విద్యార్థులు, మహిళలు ఇంటిబాట పట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తప్పదన్నట్లుగా కూర్చుండిపోయారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి వేదికగా నిలిచిన టవర్క్లాక్ వద్దే ‘నవ నిర్మాణ దీక్ష’ వేదిక ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆర్ట్స్ కళాశాల ఎదుటి మార్గం ద్వారా వేదిక వద్దకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు వచ్చేందుకు కూడా దారి ఉంచలేదు. బారికేడ్ల కింద నుంచి దూరి రావాల్సి రావడంతో మహిళలు ఇబ్బంది పడ్డారు. భరత నాట్యం చేసేందుకు వచ్చిన చిన్నారులకు వేదిక మీద అవకాశం కల్పించకపోవడంతో వారు కింద ఉన్న ఖాళీ స్థలంలో నాట్య ప్రదర్శన ఇచ్చారు. దీంతో కార్యక్రమానికి వచ్చినవారు నేరుగా వీక్షించలేకపోయారు. -
నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములుకండి
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలు(అగ్రికల్చర్): నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం నవనిర్మాణ దీక్షలో భాగంగా రాజ్విహార్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు కలెక్టరేట్ నుంచి రాజ్విహార్ వరకు అన్ని శాఖల అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి లైవ్ టెలికాస్ట్ ద్వారా నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్బంగా కేఈ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయిందని, రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమికొట్టారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకపోయినా 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ధైర్యం కోల్పోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని మూడేళ్లలోనే ప్రగతి పథంలోకి తెచ్చారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం కర్నూలు నుంచే ప్రారంభమై రాష్ట్రం మొత్తానికి వ్యాపించిందన్నారు. రాయలసీమ నుంచి ప్రారంభమైన ఉద్యమం రాష్ట్ర విభజనను కొంతకాలం పాటు ఆపిందన్నారు. ఆనాటి ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసివుంటే పరిస్థితి మరోరకంగా ఉండేదని తెలిపారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో మూడేళ్లలో సాధించిన ప్రగతిని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో జరిగే సమావేశాలు, సెమినార్లలో వివరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సి.హెచ్.వెంగళ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు ముందుండి జీతాలు లేకపోయినా సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఎన్జీఓ అసోసియేషన్కు దక్కుతుందని వివరించారు. సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్రెడ్డి, ఎస్పీ ఆకే రవికృష్ణ, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ–2 రామస్వామి, తెలుగుదేశం నేతలు బి.టి.నాయుడు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీలు సుధాకర్ బాబు, మసాల పద్మజ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు టీడీపీ ప్రజా ప్రతినిధులు ఝలక్!
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించిన నవ నిర్మాణ దీక్ష అట్టర్ ఫ్లాప్ కావడంపై ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. రాష్ట్ర విభజనతో అన్యాయమైపోయిన ఏపీ రాష్ట్ర పునర్ నిర్మాణమే లక్ష్యంగా వారం రోజులుపాటు జరగనున్న ఈ దీక్ష తొలిరోజున పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులు గైర్హాజరై అధినేత చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. నవ నిర్మాణ దీక్షకు టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు గైర్హాజరు కావడంపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దీక్షకు పార్టీ నేతలే హాజరు కాకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటినుంచి జరిగే కార్యక్రమాల్లో పాల్గొనకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీడీపీ ప్రజా ప్రతినిధులను చంద్రబాబు హెచ్చరించారు. తొలి రోజున జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీని చీకటి దినంగా అభివర్ణించిన విషయం తెలిసిందే. పార్టీ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. దీక్ష కోసం జనాల నుంచి విశేష స్పందన వస్తుందని భావించి దీక్షా ప్రాంగణం వద్ద భారీగా కుర్చీలు వేయగా తొలిరోజు దీక్ష ముగిసే సమయానికి కూడా కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. చంద్రబాబు ప్రసంగం దాదాపు గంటన్నర సేపు సాగడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
చంద్రబాబుకు జనాలు ఊహించని షాక్!
-
దీక్షల పేరిట ఇంకా మోసం చేస్తున్నారు
-
చంద్రబాబుకు జనాలు ఊహించని షాక్!
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నవ నిర్మాణ దీక్షను ప్రారంభించారు. రాష్ట్ర విభజనతో అన్యాయమైపోయిన ఏపీ రాష్ట్ర పునర్ నిర్మాణమే లక్ష్యంగా ఆయన ఇవాళ విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఏడు రోజుల పాటు ఈ దీక్షను ఆరంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..జూన్ 2వ తేదీని చీకటి దినంగా అభివర్ణించారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించే ప్రత్యేకహోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నానని ఆయన అన్నారు. ప్రత్యేకహోదాలో ఉన్న అన్నింటిని ప్యాకేజీలో ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా నేతలు, ప్రజలతో ముఖ్యమంత్రి నవ నిర్మాణ ప్రతిజ్ఞ చేయించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. తాను తలపెట్టిన దీక్ష కోసం జనాల నుంచి అపూర్వ స్పందన వస్తుందని భావించి దీక్షా ప్రాంగణం వద్ద భారీగా కుర్చీలు వేశారు. . కానీ దీక్ష మొదలైనప్పటికీ...జనం ఆశించిన స్థాయిలో రాలేదు. అలాగే చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించే సమయానికి వచ్చిన మహిళల్లో కూడా ఎక్కువ మంది ఎండ వేడిమి తట్టుకోలేక వెళ్లిపోయారు. దీనికితోడు చంద్రబాబు ప్రసంగం దాదాపు గంటన్నర సేపు సాగడంతో వచ్చిన వారికి ఏం చేయాలో తెలియక, ఎండకు తట్టుకోలేక అక్కడి నుంచి వెనుదిరిగారు. దీంతో ప్రతిజ్ఞ, ప్రసంగ సమయంలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. దీంతో స్థానిక నేతలు చేసేదేమీ లేక వేసిన కుర్చీలన్నింటినీ తీయించేశారు. అలాగే వైఎస్ఆర్ జిల్లాలోనూ నవ నిర్మాణ దీక్ష అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చంద్రబాబు నాయుడు ఎంతో ఆర్భాటంగా ప్రజలంతా దీక్ష చేయాలంటూ నానా హంగామా చేస్తే....జిల్లా ప్రజల నుంచి మాత్రం ఆశించిన స్పందన కనిపించలేదు. జిల్లా కేంద్రం కడపలోని ఏడు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన దీక్షకు డ్వాక్రా, ఉపాధి హామీ మహిళలను బలవంతంగా తరలించారు. తప్పనిసరి పరిస్థితుల్లో హాజరైన ఆ మహిళలు తప్ప స్థానికులు ఎవ్వరూ దానిలో పాల్గొనక పోవడం విశేషం. -
ఇక్కడ నిర్మాణదీక్షలు.. అక్కడ ఇళ్ల నిర్మాణాలు
- విభజన లేఖ ఇచ్చిన చంద్రబాబే దీక్ష చేయడం సిగ్గుచేటు - ఏపీలో దొంగ దీక్షలు చేస్తూ తెలంగాణలో ఇల్లు కడతారా? - ఏపీ సీఎం వైఖరిపై వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి మండిపాటు విజయవాడ: గతంలో రాష్ట్రాన్ని విభజించాలంటూ కేంద్రానికి లేఖలు రాసి, విభజనకు కారకుడైన చంద్రబాబు నాయుడు.. ఇవాళ నవ నిర్మాణ దీక్షల పేరుతో నాటకాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్నది నవనిర్మాణ దీక్షకాదూ.. నయ వంచన దీక్ష అని మండిపడ్డారు. ‘విభజనకు లేఖ ఇచ్చిన ఆయనే ఇవాళ డ్రామాలాడుతున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో ఏ నిర్మాణాలు చేపట్టారో చెప్పుకోలేని స్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉంది. అయితే చంద్రబాబు మాత్రం పక్కరాష్ట్రం(తెలంగాణలో) చాలా దీక్షగా రూ.100 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. ఇదీ.. ఆయన తీరు!’ అని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. మహిళలపై వేధింపులు, అరాచకాలు, అప్పులు, అవినీతిలో చంద్రబాబు నంబర్ వన్గా నిలుస్తారని వెల్లంపల్లి విమర్శించారు. -
దీక్షల పేరిట ఇంకా మోసం చేస్తున్నారు: రఘువీరా
విజయవాడ : ప్రత్యేక హోదా, విభజన హామీ చట్టాల అమలు కోసం ఆందోళన చేస్తున్న వారి దీక్షను భగ్నం చేయడం దారుణమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విభజన అంశాల అమలు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న నిరాహార దీక్షలను ఆయన విరమింపజేశారు. చంద్రబాబు హస్తం భస్మాసుర హస్తమన్నారు. నవ నిర్మాణ దీక్షల పేరిట చంద్రబాబు కోట్లాది రూపాయలు నాశనం చేస్తున్నారని, నవ నిర్మాణ దీక్షల కోసం పిల్లలను తీసుకువచ్చి హింసిస్తున్న చంద్రబాబు ఒక శాడిస్టు అని విమర్శించారు. రోడ్లను బ్లాక్ చేసి ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించారన్నారు. జూన్ 4న కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న సభ ద్వారా ప్రత్యేక హోదా అంశం అవసరాన్ని పాలకులకు తెలియజేస్తామని, ఇక మీదట తాము కూడా పోరాటాలను రోడ్డు మీద చేస్తామని చెప్పారు. మూడేళ్లు గడుస్తున్నా చంద్రబాబు నవ నిర్మాణ దీక్షలు చేయటం దారుణమని ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ అన్నారు. విభజన హామీల అమలుకు కమిటీని వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు దీక్షల పేరిట ఇంకా ఏపీ ప్రజలను మోసం చేయటం దారుణమన్నారు. -
ఏపీలో దీక్షలు తెలంగాణలో ఇళ్లా?
-
రాష్ట్రానికి చీకటి రోజు ఇది
-
రాష్ట్రానికి చీకటి రోజు ఇది: చంద్రబాబు
విజయవాడ: నేడు చరిత్రలో రాష్ట్రానికి చీకటి రోజు.. జీవితంలో మరిచిపోలేని రోజు ఇది. ఈ రోజు మీ అందర్నీ కష్ట పెడుతున్నాను.. మండుటెండను లెక్క చేయకుండా మీరు ఇక్కడికి వచ్చారు. రాష్ట్ర విభజనను గుర్తు చేసుకొని రాష్ట్ర నిర్మాణానికి పునరంకితం కావడం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో శుక్రవారం జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. ' మీ కష్టాలు నేను అర్థం చేసుకోగలను. అన్నీ రాష్ట్రాలు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరుపుకుంటాయి, అదే సమయంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి. మనం నవ నిర్మాణ దీక్ష జరుపుకుందాం. రాష్ట్ర అవతరణ సందర్భంగా మనకు జరిగిన నష్టాన్ని నెమరు వేసుకుందాం. మనం చాలా అవమానాలు పడ్డాం.. ఇంటిలో కూర్చొని బాధపడితే లాభం లేదు.. కొన్ని దేశాలు మనకు ఆదర్శం కావాలి.. రెండో ప్రపంచంలో జపాన్ బూడిదయిపోయింది.. అయినా ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్లి కష్టపడి దేశ నిర్మాణానికి పాటుపడ్డారు.. అంచలంచలుగా అభివృద్ది సాధించారు.. ఇంకా చాలా దేశాలు ఇలాంటి సమస్యల ఎదుర్కొన్నాయి.. వాళ్ల కష్టంతో తెలివితేటలతో ఎలా పైకొచ్చారా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అన్నారు. -
బాబుది రెండు గుండ్ల సిద్దాంతం
-
‘చంద్రబాబు వ్యాఖ్యలు మిలీనియం జోక్’