రూ.4కే అల్పాహారం
కేంద్రాన్ని ప్రారంభించిన ఈఓ భరత్ గుప్త
అందుబాటులో ఇడ్లీ, ఉప్మా
శ్రీశైలం : భ్రమరాంబామల్లికార్జునస్వామి దర్శనార్థమై వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం గంగా, గౌరి సదన్ పక్కనున్న మినిరల్ వాటర్ ప్లాంట్ వద్ద అల్పాహార కేంద్రాన్ని ఈఓ నారాయణభరత్ గుప్త ఆదివారం ప్రారంభించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమం చేపట్టినట్లు ఈఓ తెలిపారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి ఇడ్లి(రెండు), ఉప్మా(150 గ్రాములు) అందుబాటులో ఉంటాయన్నారు. రూ.4లకే వాటిని అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రద్దీ దృష్ట్యా ఉదయం, రాత్రి వేళల్లో కూడా కార్యక్రమాన్ని చేపడుతామని, మూడు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. నెల వరకూ కేంద్రాన్ని కొనసాగిస్తామని, భక్తుల నుంచి వచ్చే స్పందనను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతకముందు ఈఓ, అర్చకులు, వేదపండితులు స్వామి అమ్మవార్ల చిత్రపటానికి ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏఈఓ రాజశేఖర్, శ్రీశైలప్రభ ఎడిటర్ అనిల్కుమార్, సహాయ సంపాదకులు కెవి సత్యబ్రహ్మచార్య, సిబ్బంది పాల్గొన్నారు.