
ఇందిరాపార్కు వద్ద హాస్టల్ విద్యార్థుల ధర్నాలో ఎమ్మేల్యే ఆర్ కృష్ణయ్య
దోమలగూడ : పెరిగిన ధరలకనుగుణంగా రాష్ట్రంలోని దాదాపు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల మెస్చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని కోరుతూ బీసీ సంక్షే మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద హాస్టళ్ల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతు తెలిపిన కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థుల మెస్ చార్జీలను పెంచక పోవడం శోచనీయమన్నారు.
నాలుగేళ్ల క్రితం నిర్ణయించిన ధరలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారన్నారు. దీంతో హాస్టళ్ల విద్యార్థులకు నాసిరకం భోజనం అందుతోందన్నారు. మనసున్న ముఖ్యమంత్రిగా ఒక రోజు హాస్టల్లో గడిపితే వారి బాధలు తెలుస్తాయని, ఆతర్వాత వారి సంక్షేమానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆయన విజ్ఞతకే వదిలి వేస్తామన్నారు. రాష్ట్రంలో దాదాపు రెండు వేల బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, 530 కళాశాల విధ్యార్థుల హాస్టళ్లు ఉన్నాయని, వాటికి సొంత భవనాలు, కనీస వసతులు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారన్నారు.
సచివాలయంలో 9 భవనాలలో ఏడు కొత్తవే అయినా.. వాటిని కూలగొట్టి కొత్తవి నిర్మించాలని ప్రభుత్వం భావి స్తోందని, వాటికి బదులుగా హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజకృష్ణ, ర్యాగరమేష్, కుల్కచర్ల శ్రీనివాస్, నీల వెంకటేష్, విక్రంగౌడ్, కృష్ణయాదవ్, రాంబాబు, విష్ణు, నవనీత్, అంజియాదవ్, గజేంద ర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.