ఐఐటీ ఫౌండేషన్ కోర్సుకు గ్రహణం
కాకినాడలో పలు పాఠశాలల నిర్వహణ తీరుపై ఆరోపణలు
భానుగుడి (కాకినాడ) : సమాజాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులే ’కంచె చేను మేసిన చందం’గా మారారు. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐఐటీ ఫౌండేషన్ కోర్సుకు తూట్లు పొడిచేందుకు తెగించారు. ఈ కోర్సు లక్ష్యం చేరుకోవాలంటే మరిన్ని సంస్కరణలు తీసుకు రావాలని ఉపాధ్యాయ లోకం కోడై కూస్తుంది. లేకుంటే దీని కోసం వెచ్చిస్తున్ననిధులు ఆమ్యామ్యాలకే సరిపోతాయని ఉపాధ్యాయులు అంటున్నారు.
36 సెంటర్లు.. 3,655 మంది విద్యార్థులు
జిల్లాలో 9 మున్సిపాల్టీలకు సంబంధించి ఇంగ్లిషు మీడియం బోధన జరుగుతున్న 36 పాఠశాలల్లో ఈ ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నారు. వేలమంది విద్యార్థులున్నప్పటికీ ఈ కోర్సుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులకు మాత్రమే బోధన జరుగుతుంది. జిల్లాలో 3,655 మంది విద్యార్థులు ప్రస్తుతం ఫౌండేషన్ కోర్సు అభ్యసిస్తున్నారు. కాకినాడలో 11 పాఠశాలలకు సంబంధించి 10 సెంటర్లలో 1200 మంది విద్యార్థులు కోర్సు నేర్చుకుంటున్న వారిలో ఉన్నారు. ఈ కోర్సుకు సంబం«ధించి జిల్లా కో ఆర్టినేటర్తో పాటు ఐదుగురు కన్వీనర్లు పనిచేస్తున్నారు. నిధులు విడుదల మున్సిపల్ కమిషనర్కు, పద్దుల నిర్వహణ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ప్రభుత్వం అప్పగించింది.
ఇవిగో ఆరోపణలు
కాకినాడ, రామచంద్రపురం మున్సిపాల్టీల్లో వేసవిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకున్నా తరగతులు నిర్వహించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. వేసవిలో 24 రోజుల పాటు, రోజుకు 4 గంటల చొప్పున తరగతులు నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులు లేకపోవడంతో ఆరు నుంచి 9 వరకు విద్యార్థులకు తరగతులు జరిగాయి. వేసవిలో జరిగిన తరగతులకు సంబంధించి ఒక్కో సెంటర్కు రూ.96 వేల వరకు నిధులు విడుదలయ్యాయి. జిల్లాలో కాకినాడలో 8, రామచంద్రపురంలో 6 సెంటర్లలో వేసవిలో ఐఐటీ ఫౌండేష¯ŒS తరగతులు నిర్వహించినట్లు సమాచారం. జిల్లాకు సంబం«ధించి రూ.14 లక్షల వరకు నిధులు విడుదలయ్యాయి.
పాఠశాల ప్రధానోపాధ్యాయులే తూతూ మంత్రంగా తరగతులు నిర్వహించి, ఆనక ఉపాధ్యాయులతో బలవంతంగా సంతకాలు చేయించుకుని డబ్బులు డ్రా చేశారని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే ఆరోపిస్తున్నారు. కాకినాడలోని ఆనందభారతి, గుడారిగుంట పాఠశాలల్లో ఈ తరహా మోసం జరిగినట్లు సమాచారం. డబ్బులు డ్రా చేసుకుని పాఠశాల ఉపాధ్యాయులు నోరుమెదపకుండా ఉండేందుకు ’విందు’భోజనాలిచ్చారని దీనిపై అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి నిజానిజాలు వెలికితీయాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. ఇటువంటి అక్రమాలను సహిస్తూ పోతే విద్యావ్యవస్థకే చేటు వచ్చే ప్రమాదముందని గగ్గోలు పెడుతున్నాయి.
ఆది నుంచీ సిగపట్లే
మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు పొందేందుకు, కాంపిటేటివ్ పరీక్షలకు పాఠశాల స్థాయి నుంచే సన్నద్ధం చేసేందుకు ప్రత్యేకంగా ఐఐటీ ఫౌండేష¯ŒS కోర్సును ప్రభుత్వం 2015లో ఏర్పాటు చేసి, ఈ ఏడాది జులై 29న ప్రారంభించింది. కోర్సు ప్రారంభానికి ముందు ప్రైవేటు సిబ్బందిని నియమించడంతో ఉపాధ్యాయులు కోర్సును వ్యతిరేకించారు. తర్వాత పాఠశాల ఉపాధ్యాయులకే ఈ బాధ్యతను అప్పగించడంతో ఆమోదం తెలిపారు.పిరియడ్కు రూ.250 చొప్పున ప్రభుత్వం సబ్జెక్టు టీచర్కు అందిస్తుంది. పాఠశాల పనివేళల్లో కాకుండా పాఠశాల ముగిశాక తరగతులు నిర్వహించేలా కార్యక్రమం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లోను వాల్యుమ్–1 చివరి దశలో ఉంది. వారానికి 12 పిరియడ్ల చొప్పున కేటాయించారు. ఇందులో గణితం–4, ఫిజిక్స్–2, కెమిస్ట్రీ–2, బయాలజీ–2, ఇంగ్లిష్–1, వారానికి ఒక పరీక్షతో కలుపుకుని 12 పిరియడ్లు. వాల్యుమ్–1కు సంబంధించి 106 పిరియడ్లు. ప్రతి తరగతికి రెండు వాల్యుమ్లు ఉంటాయి. విద్యార్థి పదో తరగతి పూర్తయ్యే నాటికి 12 వాల్యుమ్లు పూర్తవుతాయి.
అవాస్తవాలే..!
పాఠశాలల్లో ఇటువంటి గోల్మాల్ వ్యవహారాలు జరిగే అవకాశమే లేదు. వేసవి తరగతులకు సంబం«ధించి జిల్లా కో ఆర్డినేటర్తో పాటుగా, కన్వీనర్లు సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వారంతంలో పరీక్షలు సైతం నిర్వహించారు. ఇవన్నీ కింది నుంచి పై స్థాయి వరకు పరిశీలన జరిగాకే నిధులు మంజూరు చేశారు. అందువల్ల ఏ పరిస్థితిలోను ఇలాంటి డబ్బులు కాజేసే పనులు జరగలేదు. ఉన్నతాధికారులకు ఈ ఆరోపణలపై ఫిర్యాదు చేస్తాం.
– ఎస్వీఎల్ రాజు, ఐఐటీ ఫౌండేషన్ కోర్సు జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్