రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు 11 నుంచి 21 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించారు. పగటి ఉష్ణోగ్రత 32 నుంచి 33 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 25 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలిపారు.
గాలిలో తేమశాతం ఉదయం 82 నుంచి 85, మధ్యాహ్నం 66 నుంచి 69 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొర్ర, పొద్దుతిరుగుడు, ఉలవ, పెసర, అలసంద లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవచ్చన్నారు. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటివరకు 82.8 మి.మీ నమోదైంది.