18 ఏళ్ల వయసు నిండిన వారు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని భన్వర్లాల్ పిలుపునిచ్చారు
సాక్షి, తిరుమల: 2017 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ అక్టోబరు 31వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తిరుమలలో వెల్లడించారు. బుధవారం ఆయన తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ అన్ని మండల కేంద్రాలు, ఆర్టీవో, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యంలో భాగస్వాములవుతారని, అందువల్ల ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు కావాలని భన్వర్లాల్ పిలుపునిచ్చారు.