
భర్త గల్ఫ్ వెళ్లడంతో ...
పశ్చిమ గోదావరి జిల్లా : పెళ్లైన నాలుగునెలలకే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇరగవరం శివారు గొల్లగుంటపాలెంలో సోమవారం జరిగింది. ఇరగవరం ఎస్ఐ వి.ఎస్.వి.భద్రరావు కథనం ప్రకారం.. గొల్లగుంట పాలేనికి చెందిన గాయత్రి (20)కి అదే ఊరుకు చెందిన వేండ్ర చంద్రరావుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లైంది. చంద్రరావు పెళ్లి ముందు నాలుగేళ్లు ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉన్నాడు.
ప్రస్తుతం ఆషాఢం మాసం కావడంతో గాయత్రి పుట్టింటికి వెళ్లింది. పెళ్లైన తర్వాత గత నెలలో చంద్రరావు మళ్లీ గల్ఫ్ వెళ్లడంతో మనస్తాపానికి గురైన గాయత్రి ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. పొలం పనులకు వెళ్లి వచ్చిన గాయత్రి తల్లి నాగమణి కూతురు అపస్మారక స్థితిలో ఉండడంతో ఇరుగుపొరుగువారి సాయంతో తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించింది.
ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై తహసీల్దార్ జి.మమ్మీ, పెనుగొండ సీఐ సి.హెచ్.రామారావు విచారణ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.