ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. దీంతో బరిలో ఎవరున్నారో తేలిపోయింది.
చేవెళ్ల రూరల్/యాలాల/బంట్వారం, న్యూస్లైన్: ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. దీంతో బరిలో ఎవరున్నారో తేలిపోయింది. జిల్లాలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గండు అంతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో గ్రామస్తులంతా కలిసి ఆమె ఒక్కరితోనే నామినేషన్ వేయించారు.
ఇక యాలాల మండలం అగ్గనూరు ఎంపీటీసీగా జంగం కమలాక్షి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి నామినేషన్లు వేసిన మిగితా ఇద్దరూ బరిలోంచి తప్పుకున్నారు. దీంతో కమలాక్షి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల రిటర్నింగ్ అధికారి శోభారాణి ప్రకటించారు. యాలాల మండల పరిధిలోని కోకట్ ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆవుటి శంకర్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బంట్వారం మండలం సల్బత్తాపూర్ ఎంపీటీసీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చిప్పే సుజాత సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నుండి బద్రప్ప, టీఆర్ఎస్ నుంచి లచ్చమ్మ, స్వతంత్ర అభ్యర్థులుగా చంద్రమౌళి, బస్వరాజులు నామినేషన్లు వేయగా, వీరంతా సోమవారం బరిలోంచి తప్పుకున్నారు. దీంతో తిప్పే సుజాత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్, ఎంపీడీఓ సుధారాణిలు వెల్లడించారు.