
అచ్చం అమెరికాలోలాగేమా దగ్గర క్యాన్సర్ చికిత్స...
చికిత్స విషయంలో ఒక డాక్టర్ ఒక మాట చెప్పి... ఇంకో డాక్టర్ మరో మాట చెబితే రోగికి అయోమయంగా ఉంటుంది.
చికిత్స విషయంలో ఒక డాక్టర్ ఒక మాట చెప్పి... ఇంకో డాక్టర్ మరో మాట చెబితే రోగికి అయోమయంగా ఉంటుంది. ఇలా జరగకూడదు. ఒక చికిత్స ప్రక్రియను నిర్ణయించాక అది ఇక్కడైనా మరో చోటైనా ఒకేలా ఉండాలి. అప్పుడే పేషెంట్కు అనుమానాలు రావు. కచ్చితమైన ప్రోటోకాల్ ఆధారిత చికిత్స ప్రక్రియలతో పేషెంట్కు అయోమయం ఉండదు. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వైద్యం ప్రోటోకాల్ ఆధారితంగా ఉంటుంది. అచ్చం అమెరికాలో ఉన్న నైపుణ్యాలతో, నాణ్యత ప్రమాణాలతో, నియమ నిబంధనలతో, సదుపాయాలతో వైద్యం అందించే ఆ సంస్థ కోఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జోసెఫ్ నికోలస్ చెప్పిన మాటలివి. పేషెంట్కు అందిస్తున్న భరోసా ఇది.
ప్రశ్న : అమెరికా నుంచి మీకు హైదరాబాద్ రావాలని ఎందుకు అనిపించింది?
జోసెఫ్ నికోలస్: యూఎస్లో నేను అంతకు మునుపు క్యాన్సర్కు చికిత్స అందించే సంస్థలో పనిచేశాను. పిట్స్బర్గ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పనిచేసే ‘సీటీఎస్ఐ’ అనే మా సంస్థ అత్యున్నత ప్రమాణాలతో రోగులకు సేవలందించేది. కొందరు ఆంకాలజీ నిపుణులు కలిసి యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్కు అనుబంధంగా ‘సీటీఎస్ఐ’ ఏర్పాటు చేశారు. డాక్టర్ స్టాన్లీ మార్క్, డాక్టర్ పీటర్ ఎల్లీస్, డాక్టర్ డ్వైట్ వంటి హేమాహేమీలు అక్కడ సేవలందించేవారు. అక్కడ నాణ్యమైన వైద్యం అందుతుంటుంది. ఇలాంటి నమ్మకమైన వైద్యమే ఆసియా దేశాలలోనూ అందిస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. సీటీఎస్ఐలాంటి కచ్చితత్వంతో వైద్యం అందించాలనే సంకల్పంతోనే చైనా, ఇండియా దేశాలను సందర్శించాను. అప్పుడు హైదరాబాద్ను చూశా. రాబోయే కాలంలో అత్యున్నత వైద్య ప్రమాణాలతో ఈ నగరం అన్ని రకాల వైద్యసదుపాయాలకు మూలకేంద్రంగా ఆవిర్భవించగలదని అనిపించింది. దాంతో ఇక్కడ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశాం. మా సేవలను మరింత విస్తరించబోతున్న తరుణంలో చేయూత అందించడానికి నా స్నేహితుడు ఆండ్రూ షోగన్ కూడా ఇక్కడికి వచ్చారు. అమెరికాకు దీటుగా ఇక్కడ కూడా సేవలు అందించడానికి వీలువుతుందని తాను కూడా అభిప్రాయపడుతున్నారు.
ప్రశ్న : అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత ఏమిటి?
జో: అమెరికాలో క్యాన్సర్ రోగికి నిర్దిష్టమైన పద్ధతిలో, క్రమబద్ధమైన చికిత్స అందిస్తారు. అంటే ప్రతి కేసులోనూ నిర్దిష్టమైన ప్రోటోకాల్ పాటిస్తారు. ఉదాహరణకు ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ వద్దకు వెళ్లారనుకుందాం. అతడు సర్జరీ వైపునకు మొగ్గుచూపవచ్చు. అలాగే రేడియేషన్ ఆంకాలజిస్ట్... రేడియో థెరపీకి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అలాగే ఇతరులూ తమ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. కానీ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో అలా కాదు... మా సంస్థ శేరిలింగంపల్లిలో ఉండవచ్చు, విజయవాడలో ఉండవచ్చు లేదా భవిష్యత్తులో చండీగఢ్లో ఏర్పాటు చేయవచ్చు. కానీ పాటించే ప్రొటోకాల్ ఒకటే ఉంటుంది. అది పేషెంట్కు ప్రాధాన్యమిస్తూ, ఎవిడెన్స్ బేస్డ్గా ఉంటుంది.
ప్రశ్న : మీ ప్రాధాన్యాలు ప్రత్యేకంగా ఉంటాయంటున్నారు కదా. వాటి గురించి?
జో: మొదట ప్రస్తావించాల్సినది అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లోని అధునాతన సాంకేతికత. ఇది అమెరికన్ సాంకేతిక పరిజ్ఞానానికి ఏమాత్రం తీసిపోదు. ఇక రెండోది నైపుణ్యం. మా దగ్గర పనిచేసే డాక్టర్లు, నర్స్లు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది నైపుణ్యాలు అత్యున్నతంగా ఉంటాయి. డాక్టర్లు ఆ రంగంలోని స్టార్ డాక్టర్లే. అలాగే నర్స్ల విషయం తీసుకోండి. మిగతా సంస్థల్లో నర్స్ ఎవరైనా సాధారణ నర్సే. కానీ మా సంస్థలో క్యాన్సర్ చికిత్సలో ప్రత్యేక నైపుణ్యం పొందిన నర్స్లే ఉంటారు. వారు క్యాన్సర్ చికిత్స విషయంలో చాలా ప్రత్యేకతలు కలిగినవారై ఉంటారు. అమెరికా నుంచి ఆంకాలజీ నర్సింగ్ విభాగంలో అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన నిపుణురాలు సిస్టర్ ‘లిన్ థామాసిక్’ను ఇక్కడికి తీసుకువచ్చి, ఇక్కడ ఆంకాలజీ నర్సింగ్లో శిక్షణ ఇప్పించాం. ఆమె ద్వారా శిక్షణ పొందిన నర్స్లు క్యాన్సర్ చికిత్సలో అత్యున్నత పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకున్నారు.
ప్రశ్న : వచ్చే ఐదేళ్లలో మీ సంస్థ పురోగతి, భవిష్యత్ ప్రణాళికల గురించి...
జో: దాదాపు 2006 నుంచి నేను ఇక్కడికి వస్తూపోతూ ఉన్నాను. నాలుగేళ్లుగా ఇక్కడే స్థిరపడ్డాను. ఆ తర్వాత కొంతకాలానికి నా భార్య కూడా ఇక్కడికే వచ్చింది. నా కూతురు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడి సంస్కృతిలో మమేకం అయ్యింది. మేమంతా ఇప్పుడు ఇక్కడి స్థానికుల్లాగే కలిసిపోయాం. క్యాన్సర్ రంగంలో నమ్మకమైన సేవలతో పాటు, వాటిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో మా కుటుంబం అంతా ఇక్కడికి వచ్చింది. గత నాలుగేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నాణ్యమైన చికిత్స అందిస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో భారతదేశం 25 క్యాన్సర్ హాస్పిటల్స్తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక వంటి దక్షిణాసియా దేశాలలో చికిత్స కేంద్రాలు నెలకొల్పాలన్నది లక్ష్యం.