
చట్ట సభలు విఫలమయ్యాయనేది వాస్తవం
శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించటంలో చట్టసభలు విఫలమయ్యాయనేది కాదనలేని వాస్తవమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు, శాసనసభ, మండళ్లలో క్రమశిక్షణ, హుందాతనం కరువైందన్నారు. శుక్రవారం గుజరాత్ రాజధాని గాంధీనగర్లో శాసనసభాపతులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పోరాటాలు, నినాదాలు సభాపతులమీద ఒత్తిడి పెంచుతున్నాయన్నారు.
ఈ సందర్భంగా చట్టసభలు సమర్థవంత ంగా పనిచేసేందుకు కోడెల కొన్ని సూచనలు చేశారు. వెల్లోకి వచ్చే సభ్యులు ఆటోమేటిక్గా సస్పెండ్ అయ్యేలా నిబంధనలు ఉండాలన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎజెండా ప్రకారం నిర్వహించాలని, చట్టసభలు ఏటా తగినన్ని రోజులు సమావేశం కావాలని సూచించారు. అనుచితంగా వ్యవహరించిన వారికి జరిమానా విధించేలా ప్రతి సభ నైతిక విలువల కమిటీని నియమించుకొని సభల గౌరవం, హుందాతనం కాపాడాలన్నారు.