
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్ మరోసారి తన బుద్ధి చూపించుకుంది. భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో నిర్వహించిన వందో ప్రయోగంపై అక్కసును వెళ్లగక్కింది. ఇలాంటి ప్రయోగాలతో దేశాల మధ్య ప్రాంతీయ వ్యూహాత్మక స్థిరత్వం దెబ్బతింటుందంటూ వ్యాక్యానించింది. ఈ ప్రయోగం వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. పాక్ విదేశాంగ వ్యవహారాలశాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మహ్మద్ ఫైజల్ మీడియాతో మాట్లాడుతూ..
'మాకు అందిన సమాచారం ప్రకారం భూభాగాన్ని పర్యవేక్షించే కార్టోశాట్ ఉప్రగ్రహంతోపాటు మొత్తం 31 ఉపగ్రహాలు జనవరి 12న(శుక్రవారం) ప్రయోగిస్తుందని తెలిసింది. అన్ని ఉపగ్రహాలు కూడా రెండు రకాల సేవలు అందిచేవని అర్థమవుతోంది. పౌరసమాజానికి సేవలందించడంతోపాటు సైనికులకు కూడా అవి సహాయపడేలా వాటిని భారత్ రూపొందించింది. ఇలా చేస్తే వ్యూహాత్మక భాగస్వామ్యం తన నిలకడను కోల్పోతుంది. ద్వైపాక్షిక సంబంధాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. అంతరిక్ష శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని శాంతియుత వాతవరణం దెబ్బతినకుండా ప్రయోగాలు చేసుకునేందుకు అన్ని దేశాలకు అవకాశం ఉంది. కానీ ఒక దేశ మిలిటరి నిలకడను దెబ్బతీసేట్లుగా చర్యలు ఉండరాదు' అని అన్నారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఒకేసారి 30 చిన్న ఉపగ్రహాలతోపాటు తన 100వ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించిన విషయం తెలిసిందే. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ సీ–40 వాహక నౌక ద్వారా కార్టోశాట్–2 సిరీస్లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి మోసుకెళ్లింది. అన్ని దశలను విజయవంతంగా దాటుకుని పీఎస్ఎల్వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి కొన్ని గంటల ముందే పాక్ తన అక్కసును వెళ్లగక్కింది.