
గురుద్వారాను సందర్శించిన మోదీ
కెనడాలో పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురుద్వారాను సందర్శించారు.
వాంకోవర్ : కెనడాలో పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం నాడు గురుద్వారాను సందర్శించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన వాంకోవర్లోని గురుద్వారాను దర్శించి ప్రార్థనలు చేశారు. సిక్కు సాంప్రదాయం ప్రకారం తలపాగా చుట్టుకున్న ఇరుదేశాల ప్రధానులు ఆకర్షణగా నిలిచారు. అనంతరం సమీపంలోని లక్ష్మీనారాయణ దేవాలయాన్ని కూడా సందర్శించారు. అక్కడ మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్శంగా కెనడా ప్రధాని హార్పర్ మాట్లాడుతూ భారత్, కెనడాల మధ్య సాన్నిహిత్య సంబంధాలున్నాయని, ఇరుదేశాలు సహజమిత్రులని పేర్కొన్నారు. నరేంద్రమోదీ లాంటి గొప్ప ప్రపంచనేతను కలవడం తన అదృష్టమని కొనియాడారు.
తన పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ గురువారం 1985 జూన్ 23న జరిగిన ఎయిర్ ఇండియా కనిష్క విమాన ప్రమాద ఘటన మెమోరియల్ను సందర్శించి, మృతులకు నివాళులర్పించారు. ప్రమాద మృతుల బంధువులను కలుసుకున్నారు. కెనడాలోని బడా పారిశ్రామికవేత్తలు, పెద్ద బ్యాంకు యజమానులతో రౌండ్ టేబుల్ సమావేశాలంలో పాల్గొన్నారు. కాగా కెనడా ప్రధానితో అధికార డిన్నర్ తర్వాత మోదీ శుక్రవారం ఇండియాకు తిరిగి పయనమవుతారు. దీంతో ఆయన ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల పర్యటన ముగియనుంది.