
కాకతీయ పౌరుష ఖడ్గధారిగా...
తెలుగు జాతి చరిత్రలో ఓ ముఖ్య అధ్యాయమైన కాకతీయ సామ్రాజ్య వైభవంలోని కీలక ఘట్టం ‘రుద్రమదేవి’ జీవితం. ఈ ఉత్తేజపూరిత గాథను ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి దర్శక - నిర్మాత గుణశేఖర్ తెర మీదకు వస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో చారిత్రక కథాంశంతో రూపొందుతోన్న తొలి స్టీరియోస్కోపిక్ త్రీడీ చిత్రమైన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్లో కథానాయిక అనుష్క ‘రుద్రమదేవి’గా టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. కాగా, హీరో అల్లు అర్జున్ కూడా ఈ చిత్రంలో కీలక భాగస్వామి.
తెలుగు జాతి పౌరుషానికీ, కాకతీయ వీరఖడ్గానికి ప్రతీకగా కథలో కీలకంగా వచ్చే చరిత్ర ప్రసిద్ధుడైన గోన గన్నారెడ్డి పాత్రను ఆయన పోషించారు. ఆయన ధరించిన ఆ పాత్ర తెరపై ఎంత గొప్పగా ఉంటుందోనన్న ప్రేక్షకుల ఆసక్తిని మరికొంత పెంచుతూ, శనివారం నాడు గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ తొలి ప్రచార ఛాయాచిత్రాన్ని విడుదల చేశారు. ‘‘నలభై రోజుల పాటు అల్లు అర్జున్పై కీలక సన్నివేశాలు తీశాం. పీటర్ హెయిన్ ఆధ్వర్యవంలో పోరాట దృశ్యాలు చిత్రీకరించాం.
యువతరాన్నీ, మాస్ ప్రేక్షకులనూ ఆకర్షించే గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ అద్భుతంగా పోషించారు’’ అని గుణశేఖర్ వివరించారు. రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాశ్రాజ్, నిత్యామీనన్, క్యాథరిన్, ప్రభు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత సారథి. తోట తరణి కళా దర్శకులు. అజయ్ విన్సెంట్ ఛాయాగ్రహణం, శ్రీకర్ ప్రసాద్ కూర్పు నిర్వహిస్తున్నారు. ‘‘గోన గన్నారెడ్డి పాత్రధారి అల్లు అర్జున్పై తీసిన ముఖ్య సన్నివేశాలు సినిమాకు పెద్ద బలం’’ అని గుణశేఖర్ ఢంకా బజాయిస్తున్నారు.