
1991లో గాంధీనగర్ లోక్సభ స్ధానానికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న బీజేపీ నేత ఎల్కే అద్వానీకి సహకరిస్తున్న నరేంద్ర మోదీ, వెనుక నిలబడిన అమిత్ షా
గాంధీనగర్ బరిలో అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరగుతుందో ఊహించలేం. వయసు మీద పడిందనో, ఆరోగ్యం సహకరించడం లేదనో కాకలుతీరిన నేతలను కరివేపాకులా తీసివేస్తున్న కమలనాధుల తీరుకు ఆ పార్టీ వెల్లడించిన తొలి జాబితా అద్దం పడుతోంది. బీజేపీ దిగ్గజ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీని రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పక్కనపెట్టింది. అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ నుంచి బీజేపీ చీఫ్ అమిత్ షాను బరిలో నిలిపింది. బీజేపీ గురువారం వెల్లడించిన పార్టీ అభ్యర్ధుల తొలిజాబితాలో అద్వానీ స్ధానంలో గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీచేయనున్నట్టు వెల్లడించింది.
అద్వానీని దూరం పెట్టడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపుతుందని భావిస్తున్నారు. ఇక 1991లో అద్వానీ గాంధీనగర్ లోక్సభ స్ధానానికి నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ఆయనకు నరేంద్ర మోదీ సహకరిస్తుండగా, వారివెనుక అమిత్ షా నిల్చున్న ఫోటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరోవైపు బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో అద్వానీ స్ధానంలో అమిత్ షాకు చోటు కల్పించడంతో సోషల్ మీడియాలోనూ ఇదే టాపిక్ ట్రెండ్ అవుతోంది.