
యూపీ పోలీసులు, యోగి ఆదిత్యనాథ్(ఫైల్)
రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసుల రక్షణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
లక్నో: కరోనా నివారణ చర్యల్లో వైద్య సిబ్బందితో పాటు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసుల రక్షణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలీసులకు రూ. 50 లక్షల చొప్పున ఆరోగ్య బీమా కల్పించనున్నట్టు బుధవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులను త్వరలోనే వెలువరిస్తామని యూపీ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవనిష్ అవస్థి ట్విటర్లో పేర్కొన్నారు. (ట్రంప్ బెదిరించారు.. మీరు ఇచ్చేశారు)
మీడియా ప్రతినిధులు కచ్చితంగా ముఖానికి మాస్క్లు ధరించాలని కోరారు. మాస్క్లు ధరించకపోతే వారిని పోలీసులు ఆపుతారని చెప్పారు. సోషల్ మీడియాలో కరోనాపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. కాగా, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి రూ. 50లక్షల చొప్పున ఆరోగ్య బీమా కల్పిస్తామని ఇంతకుముందే పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.
కరోనాపై పోరాటంలో నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందచేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన వారైనా పరిహారం వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు. (పాపం గంగమ్మ.. బాధాకరం)