
రాయపూర్ : చత్తీస్గఢ్లో తొలి దశ పోలింగ్కు ముందు ఆదివారం కంకేర్ జిల్లాలో జరిగిన మావోయిస్ట్ల దాడిలో ఓ బీఎస్ఎఫ్ జవాన్ మరణించారు. కట్టకల్, గోమ్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో నక్సల్స్ బీఎస్ఎఫ్ బృందంపై ఐఈడీని పేల్చి విధ్వంసం సృష్టించారని కంకేర్ ఎస్పీ కేఎల్ ధ్రువ్ పేర్కొన్నారు. నక్సల్ దాడిలో గాయపడిన ఎస్ఐ మహేంద్రసింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మొత్తం ఆరు ఐఈడీలు అమర్చిన మావోలు వరుసగా ఒకదాని తర్వాత మరొకటి పేల్చినట్టు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు చేపట్టిన ఎన్కౌంటర్లో శనివారం ఓ మావోయిస్టు మరణించగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పెద్దఎత్తున ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా చత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో ఇటీవల మావోయిస్టులు జరిపిన దాడిలో ఇద్దరు భద్రతా దళ సిబ్బందితో పాటు దూరదర్శన్ కెమెరామెన్ మరణించిన సంగతి తెలిసిందే. గత 15 రోజుల్లో మావోయిస్టులు చత్తీస్గఢ్లో చేపట్టిన ఐఈడీ పేలుడు ఇది నాలుగవది కావడం గమనార్హం.90 మంది సభ్యులు కలిగిన చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈనెల 12న, 20న రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment