
వివాదం చేయాలనుకోవడం లేదు: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: తన ఇంటిపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి ఘటనపై వివాదం చేయాలనుకోవడం లేదని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో చెప్పారు. ఈ ఘటనలో తమవారికి ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయడం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. తనపై నిందారోపణలు చేసిన తృణమూల్ నాయకులు సౌగతా రాయ్, తపస్ పాల్, నందిని పాల్ పై పరువునష్టం వేయనున్నట్టు చెప్పారు. దీనికోసం ఇప్పటికే న్యాయవాదులను సంప్రదించినట్టు తెలిపారు.
కోల్కతా కైలాశ్ బోస్ ప్రాంతంలోని బాబుల్ సుప్రియో ఇంటిపై టీఎంసీ కార్యకర్తలు బుధవారం దాడికి పాల్పడ్డారు. రోజ్వ్యాలీ చిట్ఫండ్ స్కాంలో ఇద్దరు టీఎంసీ ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడంతో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు తీవ్ర ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.