
ఎన్నికల్లో పెట్టే ఖర్చులపై అభ్యర్థుల మాదిరిగానే పార్టీలకు పరిమితులు ఉండాలని నిపుణుల బృందం ఒకటి ఎన్నికల కమిషన్కు సూచించింది.
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పెట్టే ఖర్చులపై అభ్యర్థుల మాదిరిగానే పార్టీలకు పరిమితులు ఉండాలని నిపుణుల బృందం ఒకటి ఎన్నికల కమిషన్కు సూచించింది. ఎన్నికలను మరింత సమర్థంగా నిర్వహించే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ గత ఏడాది పలు వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ‘‘ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం పెట్టే ఖర్చుపై ఎలాంటి పరిమితి లేదు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే ఈ ఖర్చులపై పరిమితి అవసరమెంతైనా ఉంది’’అని ఒక వర్కింగ్ గ్రూపు సూచించింది.
రాజకీయ పార్టీలు గరిష్టంగా పెట్టగల ఖర్చులను అభ్యర్థుల పరిమితికి కొని రెట్లు ఎక్కువగా విధించాలని ఎన్నికల కమిషన్ 2015లో కేంద్ర న్యాయశాఖకు సూచించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అయితే ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికల ఖర్చులపై పారదర్శకత కోసం పలు స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: కమల్ సర్కార్లో సింధియా చిచ్చు)