
పురోహితుడికి ఇది వరకే వివాహమై ముగ్గురు పిల్లల తండ్రి అని పోలీసు విచారణలో తేలింది.
భోపాల్ (సిరోంజ్) : వధు, వరులను వేద మంత్రాలతో ఒక్కటి చేసిన పూజారే వంకర బుద్ధి చూపించాడు. నవవధువుతో పూజారి పారిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని విధిష జిల్లా సిరోంజ్లోని బాగ్రడ్లో చోటుచేసుకుంది. వినోద్ మహరాజ్ అనే పూజారి మే 7న ఓ నూతన జంటకు వివాహం జరిపించాడు. వివాహ కార్యక్రమాలు పూర్తవ్వగానే వధువు సంప్రదాయం ప్రకారం అత్తింటి నుంచి అమ్మగారిఇంటికి వచ్చింది.
అనంతరం ఇంట్లోని 1.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, 30,000 రూపాయల నగదు తీసుకుని వధువు వెళ్లిపోయింది. దీంతో యువతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు మే23న మరో వివాహం చేపించాల్సి ఉండగా, పురోహితుడు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. రెండు ఫిర్యాదులపై పోలీసులు విచారణ జరపగా, పురోహితుడు వినోద్ మహరాజ్ ముగ్గురు పిల్లలకు తండ్రి అని తేలింది. పురోహితుడు, సదరు యువతికి రెండు సంవత్సరాలుగా పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. పురోహితుడి కుటుంబ సభ్యులు కూడా కనిపించకుండాపోయారు. ఇప్పుడు వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.