ఎంపీ రూపా గంగూలీని అడ్డుకున్న పోలీసులు | No entry to BJP's Roopa ganguly, Left Team In Riot-Hit Basirhat | Sakshi
Sakshi News home page

రూపా గంగూలీని అనుమతించేది లేదు: పోలీసులు

Published Fri, Jul 7 2017 12:59 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

ఎంపీ రూపా గంగూలీని అడ్డుకున్న పోలీసులు

కోల్‌కతా: బీజేపీ ఎంపీ రూపా గంగూలీతో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు శుక్రవారం కోల్‌కతా విమానాశ్రయం సమీపంలో అడ్డుకున్నారు. పశ్చిమ్‌బంగాలోని బసిర్‌హత్‌ ప్రాంతంలో చెలరేగిన మతఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళుతున్న ఎంపీ రూపా గంగూలీతో పాటు ఇతరులను  పోలీసులు మధ్యలోనే అదుపులోకి తీసుకున్నారు.

పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నందున శాంతిభద్రతల దృష్ట్యా బసిరహత్‌లో పర్యటనకు ఎవరినీ అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. బసిరహత్‌ వెళ్లే మార్గంలో బారికేడ్‌లు ఏర్పాటు చేసి, గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే పరిస్థితి సద్దుమణిగే వరకూ అక్కడకు ఏ రాజకీయ నేతలు పర్యటించవద్దని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తమ పార్టీ నేతలు కూడా అక్కడ పర్యటించలేదని తెలిపారు.

కాగా బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో చెలరేగిన హింస ఆగడం లేదు. బదూరియలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌పై చెలరేగిన వివాదం అంతకంతకూ పెరిగిపోయి రెండువర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. భవనాలపై దాడులకు దిగారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ఇరు వర్గాల ఘర్షణలతో బదూరియా రణరంగంగా మారింది.

మంగళవారం నాటికి అల్లరు బదురియా, హరోరా, స్వరూప్‌నగర్‌, దిగంగ ప్రాంతాలకు వ్యాపించాయి. అయితే పుకార్లు వ్యాపించడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. మరోవైపు శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భారీగా భద్రత బలగాలు భారీగా మోహరించాయి. నాలుగు కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. అటు బదూరియా అల్లర్లపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement