
సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ వివాహం నిరాడంబరంగా జరిగింది. దేవెగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కొడుకు నిఖిల్ వివాహం మాజీ మంత్రి క్రిష్ణప్ప మేనకోడలు రేవతితో రామనగర జిల్లా బిదడిలోని కుమారస్వామికి చెందిన కేతగనహళ్లి ఫాంహౌస్లో శుక్రవారం జరిగింది. కాగా, వివాహానికి హాజరైన వారు ఎవరూ భౌతిక దూరం పాటించకపోగా, కనీసం మాస్కులు కూడా ధరించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. మరో ఘటన.. కోవిడ్ హాట్ స్పాట్గా ఉన్న కలబురిగి జిల్లా చిత్తపూర్ తాలూకా రావూర్ గ్రామంలోని సిద్ధలింగేశ్వర ఆలయంలో గురువారం ఉదయం లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రథోత్సవం జరిగింది. ఇందుకు సంబంధించి ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ అధికారితోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు.