
న్యూఢిల్లీ: ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న రైలు ప్రయాణికులు విమాన ప్రయాణికుల మాదిరిగా రాయితీలు పొందే అవకాశాలున్నాయి. టికెట్ ధరల సమీక్షపై ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సూచనలతో ఇటీవల తన నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించింది. కమిటీ ప్రతిపాదించిన వాటిలో ముఖ్యమైనవి..
► నెలరోజుల ముందుగా సీట్లు బుక్ చేసుకునే వారికి అప్పటికి ఖాళీగా ఉన్న సీట్ల సంఖ్యను బట్టి టికెట్ ధరలో 50 శాతం నుంచి 20 శాతం వరకు రాయితీ.
► రైలు ప్రయాణానికి రెండు రోజుల నుంచి రెండు గంటల ముందు వరకు బుక్ చేసుకున్న టికెట్లపైనా స్లాట్ ప్రకారం తగ్గింపు.
► ప్రయాణానికి రెండు రోజుల ముందు నుంచి రెండు గంటల ముందు వరకు బుక్ చేసుకున్న వారికి రాయితీ.
► దివ్యాంగులు, గర్భిణులు, వృద్ధులకు మాత్రం ఎలాంటి అదనపు చార్జీ లేకుండానే లోయర్ బెర్తు.
► అర్ధరాత్రి నుంచి వేకువజాము 4 గంటల మధ్య, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటలకు మధ్య కాకుండా సౌకర్యంగా ఉండే ఉదయం వేళల్లో గమ్య స్థానానికి చేరుకునే రైలు ప్రయాణికులపై అదనపు చార్జీ.
► ప్రయాణికుల డిమాండ్, రైళ్లను బట్టి జోనల్ స్థాయిలో టికెట్ ధర నిర్ణయం.
► రద్దీ ఉండే పండుగ రోజులు, సెలవు దినాల్లో ఎక్కువ ఛార్జీలు. అంతగా రద్దీ ఉండని సమయాల్లో టికెట్ ధరపై తగ్గింపు.
► ప్రీమియం రైళ్లు, ప్యాంట్రీకార్ ఉండే రైళ్లలో టికెట్ ధర 50 శాతం వరకు పెంపు.