
ఉల్లి ధరల నియంత్రణకు రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది..
సాక్షి, న్యూఢిల్లీ : చుక్కలు తాకుతున్న ధరలతో కంటనీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో ఉల్లి సరఫరాలను పెంచేందుకు టర్కీ నుంచి 11,000 టన్నుల ఉల్లి దిగుమతులకు ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ ఆర్డర్ ఇచ్చింది. ఈ సంస్థ ఇప్పటికే ఈజిప్ట్ నుంచి 6090 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంటుండగా తాజా ఆర్డర్తో పరిస్థితి మెరుగవుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఉల్లి ధరలను సమీక్షించేందుకు హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలో ఆర్థిక మంత్రి, వినియోగదారుల వ్యవహరాల మంత్రి, వ్యవసాయ, రవాణా శాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో రూ 75 నుంచి రూ 120 వరకూ ఉల్లి ధరలు పలకడంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి దిగుమతులకు ప్రాధాన్యత ఇస్తోంది. ఉల్లి ఎగమతులపై నిషేధం విధించిన కేంద్ర కేబినెట్ 1.2 లక్షల టన్నుల ఉల్లి దిగుమతులకు ఆమోదం తెలిపింది. ఇక దిగుమతి చేసుకున్న ఉల్లిని ఆయా రాష్ట్రాలకు కిలో రూ 50 నుంచి 60లకు అందచేస్తారు.