
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రమంత్రి అనంత్కుమార్ (59) సోమవారం అనారోగ్యంతో మృతి చెందడంతో కేబినెట్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అనంత్కుమార్ నిర్వర్విస్తున్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, ఎరువులు, రసాయనాల శాఖల బాధ్యతల్ని నరేంద్రసింగ్ తోమర్, సదానంద గౌడలకు అప్పగించారు. ప్రధాని మోదీ సూచనతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ మార్పులు చేసినట్టు రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ఇకపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖని నరేంద్రసింగ్ తోమర్, ఎరువులు, రసాయనాల శాఖని సదానంద గౌడ నిర్వహించనున్నారు. కాగా, సదానంద గౌడ గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖనీ.. నరేంద్రసింగ్ తోమర్ గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గనుల శాఖల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు తాజాగా కేటాయించిన శాఖల్ని వీరు అదనంగా నిర్వహిస్తారని రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. (కేంద్ర మంత్రి అనంత్కుమార్ కన్నుమూత)