
న్యూఢిల్లీ: వచ్చే నెల 3న జరగనున్న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు ఈ–అడ్మిట్ కార్డులను మాత్రమే అందజేస్తామని యూపీఎస్సీ తెలిపింది. తమ వెబ్సైట్లో ఉంచిన ఈ–అడ్మిట్ కార్డులను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలంది. అడ్మిట్ కార్డులను పోస్టు ద్వారా పంపబోమని స్పష్టం చేసింది. అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనల జాబితాను యూపీఎస్సీ సోమవారం విడుదల చేసింది.
అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డును తీసుకువెళ్లాలని పేర్కొంది. ఈ–అడ్మిట్ కార్డులో ఫొటో సరిగా లేని అభ్యర్థులు ఆధార్, పాస్పోర్ట్ వంటి గుర్తింపు కార్డులతో పాటు రెండు ఫొటోల (ఉదయం పరీక్షకు ఒకటి, మధ్యాహ్నం పరీక్షకు ఒకటి)ను తీసుకురావాలని సూచించింది. ఈ–అడ్మిట్ కార్డులో తప్పులు ఉంటే వెంటనే uscsp-upsc@nic.in కు మెయిల్ చేయాలని తెలిపింది.