వరంగల్, అమరావతిలకు మహర్దశ | Warangal, Amravati boom | Sakshi
Sakshi News home page

వరంగల్, అమరావతిలకు మహర్దశ

Dec 21 2014 1:58 AM | Updated on Sep 2 2017 6:29 PM

వరంగల్, అమరావతిలకు మహర్దశ

వరంగల్, అమరావతిలకు మహర్దశ

పురాతన నగరాలను పరిరక్షించడంతోపాటు వాటికి పునరుత్తేజం కల్పించడానికి కేంద్రం నడుం బిగించింది.

  • వారసత్వ నగరాలుగా ఎంపిక
  • జాబితాలో 12 నగరాలు
  • రూ.500 కోట్లతో పునరుత్తేజం
  • కేంద్ర మంత్రి వెంకయ్య వెల్లడి
  • న్యూఢిల్లీ: పురాతన నగరాలను పరిరక్షించడంతోపాటు వాటికి పునరుత్తేజం కల్పించడానికి కేంద్రం నడుం బిగించింది. వారసత్వ నగరాల అభివృద్ధి కోసం వచ్చే ఏడాది నుంచి కొత్త ప్రాజెక్టును తీసుకొస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి  మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీనికి రూ.500 కోట్ల వ్యయం చేయనున్నట్లు శనివారమిక్కడ ఓ కార్యక్రమంలో చెప్పారు.

    ‘జాతీయ వారసత్వ నగరాభివృద్ధి యోజన’ పేరుతో తెస్తున్న ఈ ప్రాజెక్టును తొలుత దేశంలోని 12 నగరాల్లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ వారసత్వ నగరాల జాబితాలో తెలంగాణ నుంచి వరంగల్, ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతితోపాటు అమృత్‌సర్, వారణాసి, గయ, పూరి, అజ్మీర్, వేలాంగణి, మథుర, కాంచీపురం, ద్వారకా, బదామి ఉన్నాయి.

    సాంస్కృతికపరంగా, ధార్మికపరంగా ఘనమైన వైవిధ్య వారసత్వానికి ప్రతీకగా నిలిచిన నగరాలను ఈ ప్రాజెక్టుకు ఎంపికచేసినట్లు వెంకయ్య చెప్పారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ జాబితాలోకి మరిన్ని నగరాలను చేరుస్తామని పేర్కొన్నారు. ఈ నగరాల్లో వారసత్వ, పర్యాటక రంగాలకు ప్రోత్సాహకం కల్పిస్తామని తెలిపారు.

    మన ఘనమైన వారసత్వాన్ని పరిరక్షించడంతోపాటు, మన పూర్వీకుల ఘనతను వచ్చే తరాలకు అందించడమే తమ ధ్యేయమన్నారు. వచ్చే ఏడాదిలో ప్రారంభించనున్న ఈ ప్రాజెక్టు మొదటి దశ మూడు నుంచి ఐదేళ్ల వ్యవధితో ఉంటుందని మంత్రి చెప్పారు. దీనికి ఆయా నగరాలు సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుందని, నిధులన్నింటినీ కేంద్రమే ఇస్తుందని వివరించారు. ఇందులో పౌరుల భాగస్వామ్యం కీలకం కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యానికీ అవకాశం కల్పిస్తామన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement