
సాక్షి, విశాఖపట్నం : పవన్ కల్యాణ్వి అవకాశవాద రాజకీయాలని, ఆయన నిలకడ లేని వ్యక్తి అని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా అని, దీనిలో భాగంగానే పవన్ కల్యాణ్ బీజేపీలో జాయిన్ అయ్యారని విమర్శించారు. చంద్రబాబుకు తనకంటూ ఏ విధానం లేదని, అందుకే దొడ్డి దారిన కొంతమందిని బీజేపీలోకి పంపిస్తున్నారు. బీజేపీలో జాయిన్ అయిన వాళ్లు వైఎస్ జగన్ మీద పడి ఏడ్వడం కంటే ఏపీ అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుందని హితభోద చేశారు. జగన్ మీద కక్షతో వేరే పార్టీలో జాయిన్ అవడం వల్ల పవన్ సాధించింది ఏమి లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైఎస్సార్ పార్టీ అన్ని విధాలుగా విఫలమైందని పవన్ ఏ విధంగా చెబుతున్నారంటూ అవంతి ప్రశ్నించారు.కాగా సీఎం వైఎస్ జగన్ తానిచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రజలంతా జగన్ పక్షానే ఉన్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని అవంతి ధీమా వ్యక్తం చేశారు.
(పవన్ కల్యాణ్పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు)