
సాక్షి, న్యూఢిల్లీ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందానా ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి తయారైంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం గండం నుంచి బయటపడుదామనుకున్న ఆ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 20మంది తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిన సిఫారసును సవాల్ చేస్తూ ఆప్ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈసీ సిఫారసుపై స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో ఇప్పుడేం చేయాలోనని ఆప్ పార్టీ తలబద్దలు కొట్టుకొనే పరిస్థితి తయారైంది.
20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింన విషయం తెలిసిందే. రాజ్యాంగానికి విరుద్ధంగా లాభదాయక పదవుల్ని చేపట్టారని ఈసీ తేల్చి చెబుతూ రాష్ట్రపతికి ఈ మేరకు నివేదికను పంపింది. దీంతో ఈసీ నిర్ణయంపై స్టే తెచ్చేందుకు ఆప్ కోర్టుకు వెళ్లగా ఆ ప్రయత్నం విఫలమైంది. పైగా కోర్టు ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఆప్ను ప్రశ్నించింది. ఎన్నికల కమిషన్ పిలిచినప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లలేదని, ఈసీ ప్రొసీడింగ్స్కు ఎందుకు హాజరుకాలేదని నిలదీసింది.